డబ్బు రెట్టింపు పేరుతో బురిడీ
ABN, Publish Date - Aug 21 , 2024 | 12:31 AM
రసాయనాలతో ఉన్న డబ్బును రెట్టింపు చేస్తామని నమ్మించి ఓ వ్యక్తి రూ.19.50 లక్షల నగదుతో పరారయ్యాడు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని పట్టుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు.
రూ.19.50 లక్షలతో పరారీ
అరెస్టు చేసిన పోలీసులు
కర్నూలు, ఆగస్టు 20: రసాయనాలతో ఉన్న డబ్బును రెట్టింపు చేస్తామని నమ్మించి ఓ వ్యక్తి రూ.19.50 లక్షల నగదుతో పరారయ్యాడు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని పట్టుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. సీఐ నాగరాజరావు మంగళవారం వివరాలు వెల్లడించారు. కర్నూలు నగరంలోని భాస్కర్ నగర్కు చెందిన సయ్యద్ మహ్మద్కు చిన్న సుబ్బరాయుడు అలియాస్ నాయుడు అనే వ్యక్తి భవన నిర్మాణ రంగం ద్వారా పరిచయమయ్యాడు. తనది నెల్లూరు అని చెప్పి తన దగ్గర కొన్ని రసాయనాలు ఉన్నాయని, వాటి ద్వారా డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించాడు. మొదట రూ.5 వేలను రూ.10 వేలు చేసి నమ్మించాడు. ఇదే నిజమని నమ్మిన సయ్యద్ మహ్మద్ తన దగ్గర బ్యాంకులో ఉన్న రూ.19.50 లక్షల నగదును గత నెల 19వ తేదీన విత్డ్రా చేసి నాయుడుకు ఇచ్చాడు. అశోక్ నగర్లోని తన ప్రైవేటు కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ ఓ టబ్బులో నగదును ఉంచాడు. వాటిపై కొన్ని రసాయనాలు చల్లి కొద్దిసేపు మాటలు చెప్పాడు. ఆ తర్వాత నగదును సంచిలో వేసి మిషన్ తీసుకు వచ్చేందుకు వెళ్లాలని చెప్పాడు. దీంతో బాధితుడు తన కారులోనే డ్రైవర్తో నాయుడును పంపాడు. ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకోగానే నాయుడు టిఫిన్ చేసి వస్తానని చెప్పి అక్కడి నుంచి ఉడాయించాడు. తాను మోసపోయనని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడుని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.18.20 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - Aug 21 , 2024 | 12:31 AM