ఆపరేషన్ హెల్మెట్
ABN, Publish Date - Aug 24 , 2024 | 01:28 AM
దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో రహదారులపై ఎటుచూసినా ద్విచక్ర వాహనదారుల తలపై హెల్మెట్లు కనిపిస్తాయి. దూరంతో సంబంధం లేకుండా బైక్పై బయటకు వచ్చారంటే తలపై హెల్మెట్ను తప్పనిసరిగా ధరిస్తారు. రాజధాని అమరావతిలో భాగంగా ఉన్న విజయవాడలో ద్విచక్ర వాహనదారులు మాత్రం హెల్మెట్ సంస్కృతికి పూర్తిగా అలవాటు పడటం లేదు.
హెల్మెట్ ధారణ తప్పనిసరికి ప్రణాళికలు
హెల్మెట్ లేకపోతే వాహనం సీజ్
హెల్మెట్ తెచ్చుకున్నాకే వాహనం విడుదల
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో రహదారులపై ఎటుచూసినా ద్విచక్ర వాహనదారుల తలపై హెల్మెట్లు కనిపిస్తాయి. దూరంతో సంబంధం లేకుండా బైక్పై బయటకు వచ్చారంటే తలపై హెల్మెట్ను తప్పనిసరిగా ధరిస్తారు. రాజధాని అమరావతిలో భాగంగా ఉన్న విజయవాడలో ద్విచక్ర వాహనదారులు మాత్రం హెల్మెట్ సంస్కృతికి పూర్తిగా అలవాటు పడటం లేదు. హెల్మెట్ ధరించడం తలపై భారంగా భావిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు విధించిన చలాన్లు చెల్లించడానికి సిద్ధమవుతున్నారే తప్ప హెల్మెట్ను పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. నగరంలో బ్లాక్స్పాట్ల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి హెల్మెట్ లేకపోవడమే కారణమని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు నగరంలో తిరిగే ప్రతి వాహనదారుడి తలపై హెల్మెట్ ఉండేలా చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం నగర వ్యాప్తంగా ఆపరేషన్ హెల్మెట్ చేపట్టారు.
చిక్కితే బైక్ సీజ్
వాహనదారులు నగరంలో ప్రయాణించేటప్పుడు హెల్మెట్ను కచ్చితంగా ధరించాలని కొద్దిరోజులుగా అన్ని విద్యాసంస్థలు, యూత్ క్లబ్ల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహనాల కొత్త చట్టం ప్రకారం జరిమానాలు ఏవిధంగా ఉంటాయో వివరించారు. అయినప్పటికీ విజయవాడలో హెల్మెట్ధారణ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. కొద్దినెలలుగా ట్రాఫిక్ పోలీసులు వివిధ కూడళ్లలో ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి చలాన్లు విధిస్తున్నారు. అయినా హెల్మెట్ ధారణ పెరగకపోవడంతో ఎన్ఫోర్స్మెంట్ మోతాదును పెంచారు. తనిఖీల సమయంలో హెల్మెట్ లేకపోతే వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. వాహనాలను ఎంజీ రోడ్డులో ఉన్న కేఎస్ వ్యాస్ ట్రాఫిక్ కాంప్లెక్స్ వెనుక గల ఏఆర్ గ్రౌండ్కు తరలిస్తున్నారు. సంబంధిత వాహనదారులు హెల్మెట్ తీసుకొచ్చిన తర్వాత మాత్రమే వాహనాలను విడుదల చేస్తున్నారు. హెల్మెట్ తెచ్చుకున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. కొంతమంది వాహనదారులు ఇళ్లకు ఫోన్లు చేసి హెల్మెట్లను రప్పించుకుంటున్నారు. మరికొంతమంది సమీపంలో ఉన్న ఆటోమొబైల్ షాపులకు వెళ్లి హెల్మెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇలా కఠినంగా వ్యవహరిస్తే వాహనదారుల్లో మార్పు వస్తుందని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. రోజుకు నగరంలో మొత్తం 200 కేసులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారికి సంబంధించినవే ఉంటున్నాయి.
రెండు నెలలు.. 10వేలకు పైగా కేసులు
ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధారణపై ముఖ్యంగా దృష్టి సారిస్తున్నారు. ప్రతి వాహనదారుడి తలపై హెల్మెట్ ఉండేలా చేయాలని కంకణం కట్టుకున్నారు. విజయవాడలోని ప్రతి కూడలి, విశాలంగా ఉన్న ప్రదేశాల వద్ద ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తున్నారు. రెండు నెలల కాలంలో కేవలం హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 10,817 కేసులు నమోదు చేశారు. గడచిన నెలలో మొత్తం 6170 కేసులు నమోదు చేశారు. అందులో 220 మంది వాహనదారులు జరిమానాలు చెల్లించారు. ఇంకా 5950 మంది చలాన్లను చెల్లించాల్సి ఉంది. ఆగస్టులో ఇప్పటి వరకు 4647 కేసులను నమోదు చేశారు. వారిలో 128 మంది చలాన్లు చెల్లించారు. మరో 4519 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి.
Updated Date - Aug 24 , 2024 | 01:28 AM