జగన్.. నీ హామీలు ఉత్తుత్తివేనా?
ABN, Publish Date - Apr 27 , 2024 | 12:22 AM
ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ప్రశ్నించారు.
తిరువూరు, ఏప్రిల్ 26: ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ప్రశ్నించారు. ఇండియా కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో ఆమె మాట్లాడారు. వినగడప వద్ద కట్టలేరుపై బ్రిడ్జి నిర్మాణం, నియోజకవర్గంలో ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు, రైతులకు సంబంధించి కోల్డ్ స్టోరేజి, మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ ఏమయ్యాయన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తుపెట్టుకుంటే, వైసీపీ పరోక్షంగా బీజేపీతో అంట కాగుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమాలకు రూపమే కాంగ్రెస్ పార్టీ అని సుస్థిర ప్రభుత్వం కోసం ఇండియా కూటమిని గెలిపించాలన్నారు. విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరి భార్గవ్, తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థి లాం తాంతియకుమారి బహిరంగ సభలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో ప్రజలకు రూ.100లు ఇస్తే మరో రూపంలో రూ.1000లు వసూలు చేస్తుందని విమర్శించారు. ఈ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మాజీ మంత్రి డాక్టర్ కోనేరు రంగారావు శ్రమించేవారని ఆయన ఆశయ సాధన దిశగా నియోజకవర్గా,న్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖరెడ్డి ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింల రిజర్వేషన్ రద్దుచేసే కుట్రకు పాల్పడుతుందని ఆరోపించారు. దేశాభివృద్ధి ప్రజాసంక్షేమం కోసం ఇండియ కూటమిని గెలిపించాలని కోరారు. సభలో వామపక్షాల నాయకులు మేకల నాగేంద్రప్రసాద్, షేక్ నాగులుమీరా, పల్లెపాటి శ్రీనివాసరావు, బొడ్డుప్రకాశరావు, తాడిశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పలపాటి లక్ష్మీదాసు, మేడా సురేష్, ఉయ్యూరు అనసూయ, పిడపర్తి లక్ష్మీకుమారి, దారా మాధవి, పర్వతనేని జగన్మోహన్ పాల్గొన్నారు.
Updated Date - Apr 27 , 2024 | 12:22 AM