ఫ్రైడే ఇక డ్రైడే
ABN, Publish Date - Jul 17 , 2024 | 01:21 AM
ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నూతన కలెక్టర్ సృజన తనదైన ముద్ర వేసేందుకు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంతో పాటు ఇతర పట్టణ ప్రాంతాలు, గ్రామాల్లో నెలకొన్న అధ్వానపు పారిశుధ్య పరిస్థితులను మెరుగుపర చటంతో పాటు, సీజనల్ వ్యాధులను కట్టడి చేసేందుకు, సమాంతరంగా తీసుకోవాల్సిన అత్యవసర చర్యలను పాటించేందుకు ప్రతి శుక్రవారం స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించటానికి జిల్లా యంత్రాంగం సిద్ధమౌతోంది. ఈ వినూత్న కార్యక్రమానికి కలెక్టర్ సృజన ‘ఫ్రైడే డ్రైడే’గా నామకరణం చేశారు.
ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు వినూత్న కార్యక్రమం
ప్రతి శుక్రవారం డ్రైడే పేరుతో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్
ఎల్లుండి నుంచి ఎన్టీఆర్ జిల్లాలో అమలు
హెల్త్ ఈజ్ వెల్త్ నినాదంతో కలెక్టర్ సృజన పిలుపు
ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నూతన కలెక్టర్ సృజన తనదైన ముద్ర వేసేందుకు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంతో పాటు ఇతర పట్టణ ప్రాంతాలు, గ్రామాల్లో నెలకొన్న అధ్వానపు పారిశుధ్య పరిస్థితులను మెరుగుపర చటంతో పాటు, సీజనల్ వ్యాధులను కట్టడి చేసేందుకు, సమాంతరంగా తీసుకోవాల్సిన అత్యవసర చర్యలను పాటించేందుకు ప్రతి శుక్రవారం స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించటానికి జిల్లా యంత్రాంగం సిద్ధమౌతోంది. ఈ వినూత్న కార్యక్రమానికి కలెక్టర్ సృజన ‘ఫ్రైడే డ్రైడే’గా నామకరణం చేశారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఫ్రైడే డ్రైడేలో భాగంగా ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే వాటిలో ప్రధానమైన అపరిశుభ్రత అంశంతో పాటు, నూరు శాతం శానిటేషన్, వ్యర్థపదార్థాల నిర్వహణ, దోమల నిర్మూలన, రక్షిత మంచినీటికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్ భావించి ఈ కార్యక్ర మానికి పిలుపునిచ్చారు. పట్టణాలు, గ్రామాలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలలో పరిశుధ్యం ఒకటి. పారిశుధ్య సమస్యల్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల వెంబడి చెత్త పోగులు దర్శనమిస్తున్నాయి. డంపింగ్ యార్డులు లేకపోవటం వల్ల వ్యర్థపదార్థాల నిర్వహణ సరిగా ఉండటం లేదు. ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టడానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు.
గ్రీన్ అంబాసిడర్ల కార్యక్రమం పునరుద్ధరణ
డంపింగ్ యార్డులకు సంబంధించి కొరత తీర్చటానికి గతంలో టీడీపీ ప్రభుత్వం గ్రీన్ అంబాసిడర్ల కాన్సెప్ట్ను తిరిగి పునరుద్ధరించనున్నారు. ఇది సాధారణంగా జరిగే కార్యక్రమం. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో మాత్రం రోడ్ల వెంబడి చెత్త పోగులను తొలగిస్తారు. వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా చర్యలు చేపడతారు. ఆ మేరకు ప్రజలలో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. దీంతో పాటు డ్రెయిన్లలో సిల్టు తొలగింపు వంటి చర్యలకు ప్రాధాన్యమిస్తారు. వ్యర్థపదార్థాల నిర్వహణ, డ్రెయిన్లలో మురుగునీటి పారుదల, వరదనీటి మళ్లింపు, కాల్వల సమర్ధ నిర్వహణ వంటివి మేజర్గా దృష్టి పెడతారు.
దోమల నివారణ చర్యలు
మరో ప్రధానమైనది దోమల నిర్మూలన. గతంలో ఎప్పుడూ లేని విధంగా దోమల ఉధృతి పెరిగిపోయింది. దీంతో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు పెద్దఎత్తున దోమల నిర్మూలనా చర్యలు చేపడతారు. యాంటీ లార్వా ఆపరేషన్, మురుగు కాల్వలు, మురుగునీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వంటివి వేయిస్తారు. దోమల నిర్మూలన కోసం ఫాగింగ్ చర్యలు చేపడతారు.
తాగునీటి సరఫరాపై కేంద్రీకరణ
ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా అందించటంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ప్రతి ఒక్కరికీ కుళాయిల ద్వారా ఆరోగ్యకరమైన మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటారు. దీనికోసం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఇప్పటికే కలెక్టర్ సృజన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో విజయవాడతో పాటు జగ్గయ్యపేటలలో డయేరియా కేసులు ప్రబలాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రక్షిత మంచినీటిని అందించటానికి ఓవర్హెడ్ రిజర్వాయర్లను శుభ్రపరచటం, ప్రతిరోజూ మంచినీటి పరీక్షలను నిర్వహించటం చేస్తారు. వీటితోపాటు మినరల్ వాటర్ ప్లాంట్స్ కుప్పలు తెప్పలుగా వెలిశాయి. మినరల్ వాటర్ ప్లాంట్స్ ద్వారా రక్షిత మంచినీటిని పొందవచ్చునని ప్రజలు ఆ వైపు మొగ్గుచూపుతున్నారు. వాస్తవానికి మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి వచ్చే మంచినీటి నాణ్యతపై సందేహాలు ఉన్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్లను గుర్తించటం, వాటిని మ్యాపింగ్ చేయటం, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించటం, ప్రమాణాలను పాటించేలా చూడటం వంటి చర్యలను చేపట్టనున్నారు. ఇవి కాకుండా ప్రజలలో అవగాహనా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించనున్నారు. విద్యార్థి దశ నుంచే పరిసరాల శుభ్రత పట్ల అవగాహన పెంచే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
Updated Date - Jul 17 , 2024 | 01:21 AM