మల్లవల్లిపై మళ్లీ ఆశలు
ABN, Publish Date - Jun 18 , 2024 | 12:55 AM
మల్లవల్లి ఇండస్ర్టియల్ పార్క్ (ఐపీ) అభివృద్ధిపై మళ్లీ ఆశలు నెలకొన్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో ఈ పార్కులో పరిశ్రమల పునరుజ్జీవానికి అడుగులు పడినట్టే అయ్యింది. రాష్ట్ర విభజన జరిగాక రాజధాని అమరావతి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గతంలో టీడీపీ హయాంలో ఈ ఐపీకి శ్రీకారం చుట్టగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కక్షకట్టి విజిలెన్స్ విచారణల పేరుతో భయభ్రాంతులకు గురిచేసింది. పనులు చే యలేదన్న వంకతో భూ కేటాయింపుల రద్దుకు పాల్పడింది. పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించలేకపోవటం, ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు కాకపోవటంతో మల్లవల్లి ఇండస్ర్టియల్ పార్క్ ఇన్నాళ్లూ అనాథలా మిగిలిపోయింది. తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మల్లవల్లి పారిశ్రామికవాడపై ఆశలు చిగురిస్తున్నాయి. - విజయవాడ, ఆంధ్రజ్యోతి
యూనిట్ల నిర్వాహకులకు వేధింపులు.. విజిలెన్స్ విచారణలు
భూ కేటాయింపులు రద్దు.. భూముల ధరల పెంపు..
వెనకడుగు వేసి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలు
టీడీపీ కూటమి గెలుపుతో ఆనందోత్సాహాలు
పునరుజ్జీవం కోసం ఔత్సాహికుల ఎదురుచూపులు
గతంలో టీడీపీ హయాంలో..
రాష్ట్ర విభజన తర్వాత రాజధానిగా అమరావతిని ప్రకటించాక కృష్ణాజిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయటానికి వీలుగా మల్లవల్లిలో ఇండస్ర్టియల్ పార్క్ కోసం చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా హైదరాబాద్లో పరిశ్రమలు పెట్టిన వారితో పాటు దేశ వ్యాప్తంగా పలు పారిశ్రామికవేత్తలతో ఏపీలో కూడా పెట్టుబడులు పెట్టించాలన్న ఉద్దేశంతో మల్లవల్లి ఐపీని ఎంచుకున్నారు. ఇందుకోసం 1,100 ఎకరాలు సేకరించారు. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో మోడల్ ఇండస్ర్టియల్ పార్క్ను ఏర్పాటు చేశారు. భారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు ఇందులో చౌకగా ప్లాట్లు కేటాయించాలని నిర్ణయించారు. దీంతో అశోక్ లేల్యాండ్, మోహన్ స్పిన్టెక్స్ వంటి భారీ సంస్థలతో పాటు ఎంఎస్ఎంఈ సంస్థలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున భూ కేటాయింపులు చేశారు. అశోక్ లేల్యాండ్, మోహన్ స్పిన్టెక్స్లు పరిశ్రమలు ఏర్పాటు చేశాయి. వందలాది ఎంఎస్ఎంఈ యూనిట్లు నెలకొల్పే దిశగా పనులు ప్రారంభమయ్యాయి.
వైసీపీ వచ్చాక..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మల్లవల్లి సర్వనాశనమైంది. ఇచ్చిన ప్లాట్లు కొండల్లా, లోయలో ఉన్నట్టు ఉండటంతో వాటిని తొలగించాలన్నా, మట్టిని నింపాలన్నా ఖర్చు, కాలాతీతమని కొంతమేర పనుల్లో జాప్యం జరిగింది. అయితే, పారిశ్రామికవేత్తల విన్నపాలను వైసీపీ ప్రభుత్వం వినలేదు. యూనిట్ల నిర్వాహకులకు నోటీసులు జారీచేసి, వారి భూ కేటాయింపులను రద్దు చేసింది. యూనిట్ల నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలను వైసీపీ ప్రభుత్వం అమాంతం పెంచేసింది. పెరిగిన ధరలపై పారిశ్రామికవేత్తలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అయినప్పటికీ వారి గోడును వైసీపీ వినలేదు. దీంతో ఎంఎస్ఎంఈ యూనిట్ల నిర్వాహకులు పరిశ్రమలను ఏర్పాటు చేయలేకపోయారు. ఇది స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచే అంశంపైనా ప్రభావం పడింది. చిన్నవే కాకుండా పెద్ద పరిశ్రమల విషయంలో కూడా వైసీపీ ఇదే వైఖరి అవలంబించింది. అశోక్ లేల్యాండ్ సంస్థ పెద్ద యూనిట్ను ఏర్పాటు చేసి, ఉత్పాదకత కూడా ప్రారంభించింది. కరోనా వల్ల ఆ సంస్థకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
మెగా ఫుడ్ పార్క్ పరిస్థితి మరీ దారుణం
మల్లవల్లిలో 100 ఎకరాల విస్తీర్ణంలో మెగా ఫుడ్పార్క్ ఏర్పాటు కోసం లే అవుట్ వేశారు. సెంట్రల్ ఫుడ్పార్క్తో పాటు స్టేట్ ఫుడ్పార్క్లను కూడా ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పలు ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పడ్డాయి. వైసీపీ వచ్చాక ఫుడ్పార్క్ ధరలు మరింత పెరిగాయి. ఈ ధరలను చూసి కొత్తగా ఎవరూ ముందుకు రాలేదు. అలాగే, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మెగాఫుడ్ పార్కులో సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలన్నీ జ్యూస్ తీయటానికి, ప్యాకింగ్ చేయటానికి వీలుగా సీపీసీలో మెషినరీ ఏర్పాటు చేశారు. కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేశారు. కానీ, వైసీపీ దీనిని అందుబాటులోకి తీసుకురాలేకపోయింది.
Updated Date - Jun 18 , 2024 | 12:55 AM