ఓబుళాపురంలో తవ్వకాలకు..
ABN, Publish Date - Sep 04 , 2024 | 03:28 AM
ఓబుళాపురంలో తవ్వకాలకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన మైనింగ్ అనుమతులపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టుకు ఆంధ్ర ప్రభుత్వం నివేదించింది.
గత ప్రభుత్వ అనుమతులపై అధ్యయనం చేయాలి
సుప్రీంకోర్టుకు ఏపీ సర్కారు వినతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఓబుళాపురంలో తవ్వకాలకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన మైనింగ్ అనుమతులపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టుకు ఆంధ్ర ప్రభుత్వం నివేదించింది. మైనింగ్కు అనుకూలంగా అమికస్ క్యూరీ ఇచ్చిన నివేదిక, గత ప్రభుత్వ అఫిడవిట్లపైనా సమీక్షించాల్సి ఉందని తెలిపింది. ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ (ఓఎంసీ)తోపాటు మరికొన్ని కంపెనీలు అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు జరుపుతున్నాయని ఆరోపిస్తూ.. కర్ణాటక, ఏపీ సరిహద్దులు తేల్చాలంటూ ఏపీ ప్రభుత్వం 2010లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ను మంగళవారం జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ సతీశ్చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం విచారించింది. సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం గాలి జనార్దన్రెడ్డి కంపెనీకి మైనింగ్కు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేసిందని మైనింగ్ కంపెనీల తరఫు న్యాయవాదులు గుర్తు చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అభ్యంతరం తెలిపారు.
అమికస్ క్యూరీ, గత ప్రభుత్వ అఫిడవిట్లపై సమీక్షించాల్సిన అవసరం ఉందని.. అధ్యయనం తర్వాత మళ్లీ సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేస్తామని.. దీనికి కొంత సమయం కావాలని కోరారు. తమకూ కొంత సమయం కావాలని కేంద్రం తరఫు న్యాయవాదులు కోరారు. అన్ని పక్షాల వాదనల తర్వాత కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. అమికస్ క్యూరీ నివేదికపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కాగా, సిద్దాపురం, ఓబుళాపురాల్లోని బళ్లారి రిజర్వు ఫారె్స్టలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ 2010లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2022లో మైనింగ్ పునరుద్థరణకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ నిర్ణయాన్ని ప్రస్తుత చంద్రబాబు సర్కారు వ్యతిరేకించింది. అందుకే.. ఆ నివేదికను సమీక్షించాలని భావిస్తున్నామని సుప్రీంకోర్టుకు తెలిపింది.
Updated Date - Sep 04 , 2024 | 03:29 AM