పాత బైక్ కొంటున్నారా..తస్మాత్ జాగ్రత్త!?
ABN, Publish Date - Aug 26 , 2024 | 12:30 AM
బైక్ అనేది ప్రస్తుతం నిత్యావసరం.. ఇంట్లో ఒక బైక్.. ఒక స్కూటర్ ఉంటేనే పనవుతుంది. లేదంటే ఇబ్బందే. దీంతో ప్రతి ఒక్కరూ సెకండ్ హ్యాండ్ బైక్ల కొనుగోలుపై ఆసక్తి కన బరుస్తున్నారు.. ఎందుకంటే కొత్త బైక్ కొనాలంటే రూ.లక్ష పైనే ఖర్చవుతుంది. అదే సెకండ్ హ్యాండ్ బైక్ అయితే రూ. 50 వేల లోపే తేలిపోతుంది. దీంతో చాలా మంది సెకండ్ హ్యాండ్ బైక్ల కొనుగోలుపై ఆసక్తి కన బరుస్తున్నారు
చూసుకుని కొనకపోతే ముప్పే
మహానగరంలో మాయగాళ్లు
చాసిస్ నెంబర్లు మార్చేస్తున్న వైనం
పట్టుకోలేని రవాణా శాఖాధికారులు
సీబుక్లు మార్చకుండా అమ్మకాలు
బుక్కయిపోతున్న అసలు యజమాని
ఆన్లైన్ చలానా.. కేసులూ వారికే
నగరంలో వందలాది షోరూమ్లు
ప్రతి రోజూ వందలాది బైక్ల అమ్మకాలు
మోసపోతున్న జనం
అయినా పట్టించుకోని అధికారగణం
గతంలో రాజమహేంద్రవరంలో ఒక ఫైనాన్స్ కంపెనీలో బైక్ను తీసుకున్న వ్యక్తి కొంత కాలం ఆ బైక్ వినియోగించి అదే ఫైనాన్స్ కంపెనీకి తిరిగిచ్చేశాడు. మరొక కొత్త బైక్ను అతను కొనుగోలు చేశాడు. అయితే అతను చేసిన పొరపాటు ఏమిటంటే ఫైనాన్స్ కంపెనీకి ఇచ్చిన బైక్ రికార్డు ట్రాన్స్ఫర్ విషయంలో ఆ నిర్వాహకుల మాటవిని నిర్లక్ష్యం వహించాడు. కట్ చేస్తే రెండు నెలల తర్వాత ఆ బైక్ను వేరొక జిల్లాకు చెందిన వాళ్లు కొనుగోలు చేసుకుని యాక్సిడెంట్ చేశారు. ఆ ప్రమాదంలో ఒకరి కాలువిరిగింది. బైక్ ఆపకుండా పరారవ్వడంతో.. బైక్ నెంబర్ ఆధారంగా అసలు సంబంధంలేని మొదటి యజమానిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఫైనాన్స్ కంపెనీ వాళ్లు జారుకోగా మొదటి యజమాని కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఇది ఉదాహరణ మాత్రమే ఇలాంటి మతలబులు చాలానే ఉన్నాయి.
ఆన్లైన్లో రూ.10 వేలకే బైక్ అంటూ పోస్టులు చూస్తుంటారు.. బైక్ కొత్తగా ఉండడంతో ఆశపడతారు.. తీరా ఆ బైక్ కొనుగోలుకు వెళితే ముందు సొమ్ములు ఫోన్ పే చేయమంటాడు.. సొమ్ములు వెళ్లాయా ఆ నెంబర్ ఇక పనిచేయదు.. అంతటితో సరి.. అంతే కాదండోయ్.. ఆన్లైన్లో పెట్టే బైక్ ఒకటి.. అమ్మే బైక్ మరొకటి.. ఎవరైనా ఆశపడి ఆన్లైన్ కొనుగోలు చేశారా ఇక అంతే.. చాసిస్ నెంబర్లు మార్చి దొంగతనం చేసిన వాహనాలు అంటగట్టేస్తున్నారు.. ఇటువంటి మోసాలు కోకొల్లలు.. అందుకే పాత బైక్ కొంటున్నారా! తస్మాత్ జాగ్రత్త..?
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 25 : బైక్ అనేది ప్రస్తుతం నిత్యావసరం.. ఇంట్లో ఒక బైక్.. ఒక స్కూటర్ ఉంటేనే పనవుతుంది. లేదంటే ఇబ్బందే. దీంతో ప్రతి ఒక్కరూ సెకండ్ హ్యాండ్ బైక్ల కొనుగోలుపై ఆసక్తి కన బరుస్తున్నారు.. ఎందుకంటే కొత్త బైక్ కొనాలంటే రూ.లక్ష పైనే ఖర్చవుతుంది. అదే సెకండ్ హ్యాండ్ బైక్ అయితే రూ. 50 వేల లోపే తేలిపోతుంది. దీంతో చాలా మంది సెకండ్ హ్యాండ్ బైక్ల కొనుగోలుపై ఆసక్తి కన బరుస్తున్నారు.ప్రతి రోజూ రాజమహేంద్రవరంలో వేలా ది బైక్లు అమ్మకాలు జరుగుతాయంటే అతిశయోక్తి కాదేమో. మీరూ సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటు న్నారా తస్మాత్ జాగ్రత్త.. ఏమైనా జరగొచ్చు..?
నగరంలో వందలాది షోరూమ్లు..
రాజమహేంద్రవరంలో సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్ల వాహన షోరూమ్లు వందలాదిగా ఉంటాయి. మార్కె ట్లోకి వచ్చిన కొత్త బైక్ రెండు రోజుల్లోనే సెకండ్ హ్యాండ్ షోరూమ్లలో దర్శనమిస్తోంది.ఈ షోరూమ్ లలో దొరకని బైక్ అంటూ ఏమీ ఉండదు. ఏ రకం కావాలన్నా ఎంత పాతదైనా ఇట్టే దొరికేస్తుంది. ఈ షోరూమ్లకు వెళితే ఏ బైక్ కావాలని అడగరు. ఎంత ధరలో బైక్ కావాలని మాత్రమే అడుగుతారు. రూ.10 వేలలోపు కావాలంటే రికార్డులు లేని బైక్లు చూపిస్తా రు. రికార్డు అంతా సక్రమంగా ఉన్న బైక్ తీసుకుంటే ఆ బైక్ పార్టులు మార్చేసి విక్రయిస్తుంటారు. ఇదంతా పెద్ద మాయాజాలం. అయినా రవాణా శాఖాధికారులు.. పోలీ సులు అటు వైపు కన్నెత్తి చూడరు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టించుకోరు. దీంతో ఆ వ్యాపారం మూడు మోసాలు.. ఆరు దొంగబైక్లగా సాగిపోతోంది. ఇకనైనా అధికారులు రాజమహేంద్రవరంలో సెకండ్ హ్యాండ్ బైక్ల మార్కెట్పై ఒక కన్నేసి ఉంచాలి.
బైక్ కొనుగోలులో ఆశ్రద్ధ వద్దు
సెకండ్ హ్యాండ్ బైక్లు, స్కూటీలను కొనుగోలు చేసే వారు ప్రస్తుతం ఇబ్బందుల్లో పడుతున్నారు. ఉభ య తెలుగు రాష్ట్రాలకు చెందిన బైక్లు కొన్ని పైనాన్స్ కంపెనీలకు వస్తున్నాయి. ఆయా కంపెనీలకు వెళ్లి బైక్లను కొనుగోలు చేసుకునేటప్పుడు వాటి ట్రాక్ రికార్డు పరిశీలించ కుండా కొనుగోలు చేసుకుంటే నష్టపోయేది వినియోగాదారుడే. ఆన్లైన్ చలానా ఎలా ఉంది.. గతంలో ఆ బైక్ వాడిని వ్యక్తి నుంచి సదరు పైనాన్స్ కంపెనీకి సీ బుక్ట్రాన్సఫర్ అయ్యిందా..లేదా? బైక్, స్కూటీలు యాక్సిడెంట్ లోనివా,లేక కండిషన్తో ఉన్నాయా.. ఆ బైక్పై కేసు ఏమైనా ఉందా లేదా అనేది తెలుసుకోవడం ప్రధానం. ఇదంతా కాదు సీబుక్ ట్రాన్స్ఫర్ అయితేనే బైక్ కొనుగోలు చేసుకోవడం మంచిది. ఏ మాత్రం ఆశ్రద్ధ చేశామా మన మెడకూ చుట్టుకునే ప్రమాదం ఉంది.
ఆన్లైన్లో
మెరిపించి.. ముంచేసి..
ఇటివల కాలంలో అన్ని వస్తువులు ఆన్లైన్లోనే కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది. గతంలో బయట మార్కెట్లో దొరకని వాటిని మాత్రమే ఆన్లైన్ యాప్లో బుక్ చేసుకుని కొనుగోలు చేసుకునేవారు కానీ ఇప్పుడు అన్ని ఆన్లైన్లోనే కొనుగోళ్లు చేస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు కార్లు, బైక్లు, స్కూటీలు, వంటివి కూడా ఆన్లైన్లో చూసుకుని కొనుగోలుకు ఆన్లైన్లోనే చాటింగ్ మెస్సెజ్తో బేరాలు ఆడుతున్నారు.వాస్తవానికి వాటిని స్వయంగా చూశాక మాత్రమే టెస్ట్డ్రైవ్ చేసి బేరాలు ఆడాలి కాని ఇక్కడ కొనుగోలు చేసే వారి ఆసక్తిని బట్టి ఆన్లైన్ యాప్లో రూ.లక్ష విలువ చేసే బైక్, స్కూటీలను కేవలం రూ.20 వేలకు పెట్టడం, కార్ల ను సైతం రూ.40 వేల నుంచి రూ.80 వేల మధ్యలో మంచి రంగుతో మెరిసిపోతున్నవాటి ఫొటోలను పోస్టు చేయడంతో వెనకముందు చూడకుండా ఆసక్తి కనబరు స్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని ఫోన్ చేశామా మీకు కావాలంటే అడ్వాన్సు పేచేయాలని.. లేకుండా మీరు రానవసరంలేదు. ట్రాన్స్పోర్టు చార్జీలతో పాటు తమకు అమౌంట్ ఫోన్పే చేస్తే పంపించేస్తామని నమ్మబలికి వేలాది రూపాయాలు నొక్కేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు అనునిత్యం జరుగుతూనే ఉన్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆన్లైన్ యాప్లలో కొన్ని ఉపయోగపడేవి ఉన్నాయి. కొన్ని నష్టం కలిగించేవి ఉన్నాయి.ప్రతిదానిని నిశితంగా పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలి. లేదంటే డబ్బులు పోయిన తరు వాత గగ్గోలు పెట్టినా ఉపయోగం ఉండదు .
చాసిస్ నెంబర్లు మార్చేస్తున్నారు..
బైక్లు,స్కూటీలు,కార్లకు అతిముఖ్యమైనది చాసిస్ నెం బరు. బండి నెంబరు పేట్లు ఎన్ని మార్చినా గతంలో చాసిస్ నెంబర్ల ఆధారంగానే ఆ బండి సమాచారాన్ని ఆర్టీవో శాఖ తెలిపేది. కానీ ఇటీవల చాలా ఘోరాలు జరుగుతున్నాయి.బైక్లు, స్కూటీలు,కార్లు చాసిస్ నెం బర్లు మార్చేసే ముఠాలు వచ్చేశాయి.ఈ ముఠాలు చాలా సూనాయాశంగా చాసిస్ నెంబర్లు మార్చేస్తున్నా యి. అంటే దొంగబైక్లను తీసుకువచ్చి వినియోగంలో లేని పాత బైక్లు, కార్లు చాసిస్ నెంబర్లు వేసి.. నెం బరు ప్లేట్లు మా ర్చేసి చలామణి చేస్తున్నారు. ఈ తరహా వ్యాపారం జరుగుతుంది.ఈ వాహనాలను గుర్తుపట్టడం అధికారుల వల్ల కూడా కాదు. ఇతర రాష్ట్రాల్లో దొంగలు కొట్టేసిన కార్లను ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చి వాటి చాసిస్ నెంబరు..ఇక్కడ రిజిస్ర్టేషన్ నెంబర్లు తగి లించి అమ్మేయడం చేస్తున్నారు. ఈ విషయంలో వాహనదారులు అప్రమత్తంగా లేకపోతే నష్టపోవడంతో కేసు లు ఎదుర్కొనాల్సి వస్తోంది.
సీ బుక్ మార్చుకోలేదు.. చిక్కుల్లో పడ్డా..
నగరంలో ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి నా బైక్ను 2020లో అమ్మేశా. ఆ బైక్ సీబుక్ ట్రాన్స్ఫర్ పెద్ద సమస్య కాదని ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులు రికార్డు తీసుకుని నన్ను పంపించివేశారు. ఏడాది గడిచాక పార్వతీపురం నుంచి పోలీసులు వచ్చి నా బైక్తో ఒక వ్యక్తిని గుద్దేశారని స్టేషన్కు రావాలని చెప్పారు. నాకేం అర్ధం కాలేదు. పార్వతీపురంలో నేను యాక్సి డెంట్ చేయడమేంటో అర్ధం కాలేదు. అక్కడకు వెళ్లాక నేను అమ్మేసిన బైక్తో ఎవరో గుద్దేశారని తెలిసింది. ఆ బైక్కు నాకు సంబంధం లేదని చెప్పినా పోలీసులు వినలేదు. సంబంధలేని కేసులో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.
- జె.అరుణ్కుమార్, రాజమహేంద్రవరం
అన్ని పక్కాగా చూసుకోవాలి..
ప్రజలు పాత వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు అన్ని పక్కాగా చూసుకోవాలి.చాసిస్ నెంబర్ల సమస్య ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాల్లో ఉంటుంది. ఇతర రాష్ట్రాల వాహనాలకు మనం రిజిస్ట్రేషన్ చేసేది ఉండదు. ఎన్వోసీ తీసుకుని బదిలీ చేసుకుంటారు. ఇదంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు దానికి సంభందించిన టెక్నిషియన్ ,అన్ని తెలిసిన మెకానిక్లను తీసుకుని వెళితే ఇబ్బంది ఉండదు. ఆన్లైన్ యాప్లలో చూసి నమ్మకూడదు. పాత వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే తెలిసి తెలిసి ప్రమాదంలో పడినట్టే.
- కేఎస్ఎంవీ కృష్ణారావు, జిల్లా రవాణా అధికారి
Updated Date - Aug 26 , 2024 | 12:30 AM