పురుషోత్తపట్నం దేవస్థానం భూముల్లో మళ్లీ రాజుకున్న రగడ
ABN, Publish Date - Aug 17 , 2024 | 12:25 AM
ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాద్రి రామయ్య భూముల్లో మళ్లీ ఆక్రమణలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో రాష్ట్ర హైకోర్టు భద్రాద్రి దేవస్థానంకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా దానిని నిర్ణీత సమయంలో అమలు చేయకపోవడంతో భద్రాద్రి దేవస్థానం రాష్ట్రీయ వానరసేన కోర్టు దిక్కరణ పిటీషన్ హైకోర్టులో దాఖలు చేశాయి.
కోర్టు దిక్కారణ కేసున్నా పురుషోత్తపట్నంలో ఆగని నిర్మాణాలు
భద్రాద్రి దేవస్థానం ఈవోపై దాడికి యత్నం, అడ్డుకున్న సిబ్బంది
ఎటపాక ఆగస్టు 16 : ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాద్రి రామయ్య భూముల్లో మళ్లీ ఆక్రమణలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో రాష్ట్ర హైకోర్టు భద్రాద్రి దేవస్థానంకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా దానిని నిర్ణీత సమయంలో అమలు చేయకపోవడంతో భద్రాద్రి దేవస్థానం రాష్ట్రీయ వానరసేన కోర్టు దిక్కరణ పిటీషన్ హైకోర్టులో దాఖలు చేశాయి. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు చోటుచేసుకోకుండా చూడాల్సిన రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛ గా అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నాయని దేవస్థానం అధికార వర్గాలు ఆరోపిస్తున్నాయి. పురుషోత్తపట్నంలోని శ్రీగోకులంకు ఎదురుగా ఉన్న ఖాళీ భూముల్లో గత రెండు నెలలుగా అక్రమ నిర్మాణాలు చోటుచేసుకుంటున్నా రెవెన్యూశాఖ అధికారులు ఏ మాత్రం స్పందించకపోవడంతో శుక్రవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి, తన సిబ్బంది అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణంను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో భద్రాద్రి దేవస్థానం ఈవో ఎల్.రమాదేవిపై దాడికి ప్రయత్నించగా దేవస్థానం సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సమయంలో పలువురు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా నిర్మాణంలో ఉన్న ఇంటి గోడలను తొలగించే ప్రయత్నం సిబ్బంది చేస్తుండగా వాటిని ఇంటి నిర్మాణదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మళ్లీ వాగ్వివాదం, దూషణలు చోటుచేసుకున్నాయి. ఎస్ఐ పార్ధసారధి తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని నిర్మాణం చేస్తున్న వారిని పనులు ఆపాలని స్పష్టం చేశారు.
మీరు తొలగిస్తారా.. ...మేమే తొలగించాలా..
ఎటపాక ఆర్ఐతో దేవస్థానం ఈవో రమాదేవి
నేను కూడా రెవెన్యూ డిపార్టుమెంటు నుంచే వచ్చాను....దేవస్థానం భూముల్లో నిర్మాణాలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారని ఆర్ఐ బాపిరాజును దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి నిలదీశారు. రామాలయ భూముల్లో ఇళ్లు కట్టేందుకు పట్టా ఉందా....లేక అనుమతులు ఉన్నాయా.. మేము తీసేందుకు వస్తే మాత్రం మీరొస్తున్నారు... అక్కడి వారు నిర్మాణ పనులు చేస్తుంటే మీరు దగ్గరుండి ఏం చేస్తున్నారని ఈవో ఆర్ఐని ప్రశ్నించారు. మీ వ్యక్తిగత ఆసక్తి ఏమైనా ఉందా, రెవెన్యూ శాఖ తరపున మీరేం చేస్తున్నారని ఆర్ఐని ఈవో నిలదీశారు. రాముడి భూములంటే మీకు బాధ్యత లేదా, గత ప్రభుత్వ హయాంలో అధికారులు పట్టించుకోలేదు. ప్రభుత్వం మారిన తరువాత ఇరువురు సీఎంలు భూముల విషయమై చర్చిస్తున్నారు. ఈ సమయంలో కూడా మీరు ఎందుకు పట్టించుకోవడంలేదని ఆమె ప్రశ్నించారు.
25న జాంపేట అర్బన్ బ్యాంక్ ఎన్నిక
12 డైరెక్టర్ పదవులకు 37 నామినేషన్లు దాఖలు
రాజమహేంద్రవరం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి) : జాంపేట కోపరేటివ్ అర్బ న్ పాలక వర్గ ఎన్నికలకు శుక్రవారం మొత్తం 37 మంది నామినేషన్లు దాఖలు చేసినట్టు రాజమహేంద్రవరం డివిజనల్ కోపరేటివ్ అధికారి, ఎన్నికల అధికారి ఎం.జగన్నాథరెడ్డి తెలిపారు. చైర్మన్ అభ్యర్థి బొమ్మన జయకుమార్తోపాటు ప్రస్తుత పాలకవర్గ డైరెక్టర్ ప్రసాదుల హరనాథ్ తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు. బ్యాంక్కు సంబంధించిన మొదటి నియోజకవర్గంలో 10 డైరె క్టర్ పదవులకు 30మంది నామినేషన్లు దాఖలుచేయగా, 2వ నియోజక వర్గం లో ఒక పదవి కోసం ఇద్దరు, మూడో నియోజకవర్గంలో ఒక పదవి కోసం ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం స్ర్కూట్నీ ఉంది. ఆదివారం నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి గడువు ఉంది. జాంపేట ప్రధాన బ్యాంక్ పరిధిలోని 10మంది కంటే ఎక్కువమంది నిలబడితే ఎన్నిక తప్పదు. మిగతాచోట్ల ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నా పోలింగ్ తప్పదు. 25న పోలింగ్ నిర్వహిస్తారు. చైర్మన్ అభ్యర్థి బొమ్మన జయకుమార్కు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు హాజరయ్యారు. బ్యాంక్లో సుమారు 32వేలకుపైగా ఓటర్లు ఉండగా 12 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారన్నారు. ప్రధాన బ్రాంచి జాంపేట, మోరంపూడి ధవళేశ్వరం, సీతంపేట, అనపర్తి, గోకవరం, పెద్దాపురం, కాకినాడ, ఏలూరు, కొవ్వూరుల్లో మొత్తం 10 బ్రాంచిలు ఉన్నాయన్నారు. ఈ బ్యాంక్ పరిధిలోని బ్రాంచిలను మూడు నియోజకవ ర్గాలుగా విభజించారు. మొదటి నియోజకవర్గంలో జాంపేట మెయిన్ బ్రాంచి ఒకటి. ఇక్కడ 15,623 మంది ఓటర్లు ఉన్నారు. మోరంపూడి బ్రాంచిలో 2142 మంది ఓటర్లు, ధవళేశ్వరం బ్రాంచిలో 3221 మంది ఓటర్లు, సీతంపేట బ్రాంచిలో 2766 మంది ఓటర్లు కలిపి మొత్తం 23,752 మంది ఉన్నారు. వీరు మొత్తం 10 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఇక నియోజకవర్గం 2 పరిధిలో మొత్తం 1901 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఒక డైరెక్టర్ను ఎన్నుకుంటారు. ఈ నియోజకవర్గం పరిధిలో రెండు బ్రాంచిలు ఉన్నాయి. అనపర్తిలో 963 మంది ఓటర్లు ఉన్నారు. గోకవరం బ్రాంచిలో 938 మంది ఉన్నారు. మూడో నియోజకవర్గంలో నాలుగు బ్రాంచిలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 2071 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా ఒక డైరెక్టర్ ను ఎన్నుకుంటారు. పెద్దాపురం బ్రాంచిలో 963 మంది, కాకినాడ బ్రాంచిలో 834 మంది, ఏలూరు బ్రాంచిలో 480 మంది, కొవ్వూరు బ్రాంచిలో కేవలం ఏడుగురు ఓటర్లు ఉన్నారు
Updated Date - Aug 17 , 2024 | 12:25 AM