అవినీతి అధికారులపై విచారణ
ABN, Publish Date - Jun 15 , 2024 | 12:54 AM
వీఆర్వోల నుంచి తహశీల్దార్..కలెక్టరేట్ వరకూ రెవెన్యూ అధికారులు చేసిన అవినీతి, అన్యా యాలపై విచారణ జరిపిస్తామని.. వైసీపీ నేతలతో కుమ్మక్కయి తప్పులు చేసిన అధికారుల భరతం పడతామని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్పష్టం చేశారు.
రాజమహేంద్రవరం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : వీఆర్వోల నుంచి తహశీల్దార్..కలెక్టరేట్ వరకూ రెవెన్యూ అధికారులు చేసిన అవినీతి, అన్యా యాలపై విచారణ జరిపిస్తామని.. వైసీపీ నేతలతో కుమ్మక్కయి తప్పులు చేసిన అధికారుల భరతం పడతామని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్పష్టం చేశారు. తన స్వగృహంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ మొదలు అవినీతికి పాల్పడిన వారందరినీ చట్టప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో రెవెన్యూ అధికారులు అనేక మంది ఎక రాల కొలదీ భూములను అన్యాక్రాంతం చేశారన్నారు. అవన్నీ బయటకు రప్పించి చట్టప్రకారం దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు. సీనియర్ ఎమ్మెల్యేనైన నాకు కూడా ప్రొటోకాల్ పాటించకుండా ఇబ్బందులు పెట్టారని వాపోయారు. రాజమహేంద్రవరం రూరల్ పరిసర గ్రామాల విలీన ప్రక్రి యను పూర్తి చేసి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిపిస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఐదు హామీల అమలు ఫైళ్లపై సంతకం చేశారన్నారు. డిసెంబర్ లోపు మెగా డీఎస్పీ పూర్తి చేయడానికి ఆదేశాలిచ్చారన్నారు. మంచి సేవల ద్వారా ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. బాఽధితులకు అండగా నిలబడతానన్నారు.
గోదావరి ప్రక్షాళనకు ప్రాజెక్టు..
రాజమహేంద్రవరం సిటీ/రూరల్, జూన్ 14 : రాజమహేంద్రవరంలో రామకృష్ణనగర్, నేతాజీ నగర్, రైల్వేస్టేషన్,ఆవ చానల్లు కొత్త ముంపు ప్రాంతాలుగా మారాయని వాటికి ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పఽథకాన్ని ఏర్పాటు చేయాలని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సూచించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎస్ఈ పాండురంగారావు , ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఆయన శుక్రవారం ఆవచానల్, ధవళేశ్వరం సాయిబాబా ఆలయం వద్ద గల మురుగుకాలువను పరిశీలించారు. గత రెండేళ్లుగా ఎత్తిపోతల పఽథకాన్ని అధికారులు పెండింగ్లో పెట్టారని దీంతో వర్షం పడినప్పుడల్లా కొత్త ముంపు ప్రాంతాలు తయారవుతున్నాయన్నారు.ఈ ప్రాజెక్ట్ త్వరితగిన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.గతంలో గంగా కాలుష్య నివారణ పథకంలో గోదావరి ప్రక్షాళన కార్య క్రమానికి నాంది పలకడం జరిగిందని.. అది సుమారు వెయ్యి నుంచి రూ.1200 కోట్లు ప్రాజెక్ట్ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రాజెక్ట్ పూర్తి చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. అది పెండింగ్లో ఉందని ఈ సారి దానిని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నామన్నారు.ఆయన వెంట గోరంట్ల కుమార్తె కంఠమనేని శిరీష, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మచ్చేటి ప్రసాద్, టీడీపీ నాయకులు, అధికారులు ఉన్నారు.
Updated Date - Jun 15 , 2024 | 12:55 AM