శాంతించినది!
ABN, Publish Date - Jul 25 , 2024 | 12:59 AM
ముంపు వీడలేదు.. ముప్పు వీడ లేదు.. గోదావరి వరద ఉధృతి తగ్గలేదు..అటు భద్రాచలం .. ఇటు ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. దీంతో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ఇంకా భయం భయంగానే గడుపుతున్నారు.
14.40 అడుగులకు నీటిమట్టం
13.61 లక్షల క్యూసెక్కులు దిగువకు
ఇంకా రెండో ప్రమాద హెచ్చరిక
నేడు విరమించే అవకాశం
నీట మునిగిన గోదావరి ఘాట్లు
బారికేడ్లతో మూసివేత
నీటి ముంపులోనే లంకలు
భద్రాచలం వద్ద తగ్గిన వరద
రాజమహేంద్రవరం సిటీ/కొవ్వూరు, జూలై 24 : ముంపు వీడలేదు.. ముప్పు వీడ లేదు.. గోదావరి వరద ఉధృతి తగ్గలేదు..అటు భద్రాచలం .. ఇటు ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. దీంతో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ఇంకా భయం భయంగానే గడుపుతున్నారు. ఎగువన భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టినా ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది.. ధవళేశ్వరం వద్ద బుధవారం తెల్లవారుజామున 14.90 అడుగుల వరకు పెరిగిన నీటిమట్టం ఆపై 8 గంటల పాటు నిలకడగా కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటలకు నెమ్మదిగా తగ్గుముఖం పడుతూ రాత్రి 7 గంటలకు 14.60 అడుగులుగా నమోదైంది. రాత్రి 11 గంటలకు 14.40 అడుగులకు నీటిమట్టం చేరింది. కాటన్ బ్యారేజ్ నుంచి 13,61,297 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి ప్రవహిస్తుంది.ఈ సారి కాటన్బ్యారేజ్ నుంచి అత్యధికంగా 14,56,651 క్యూసెక్కులు ప్రవాహం సముద్రంలోకి ప్రవహించింది. ప్రస్తుతం ప్రమాద హెచ్చరికలు కొనసాగుతుండగా నీటిమట్టం తగ్గుముఖం పడుతూ ఉండడ ంతో గురువారం ఉదయానికి రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించేస్థాయికి నీటి మట్టం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే భద్రాచలం నుంచి వరద ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి చేరుకోవడానికి సుమా రు 18 గంటలు పడుతుంది. దీంతో అఖండ గోదావరి ఇంకా ఉధృతంగానే పొంగి ప్రవహిస్తుంది. రాజమహేం ద్రవరంలోని హేవ్లాక్ బ్రిడ్జి, ఆర్చ్ బ్రిడ్జిల మధ్య వరద ప్రవాహం చాలా వేగంగా వెళుతోంది. పుష్కరాలరేవులో గోదావరి వరద 55 అడుగులకు చేరింది.పుష్కరాల రేవు నుంచి ఎగువ కాతేరు వైపు గోదావరి వస్తున్న తీరు భయానకంగా ఉంది. కనుచూపుమేరలో అంతా వరదనీరే కనిపిస్తుంది.కొవ్వూరు గోష్పాదక్షేత్రంలోని ఆలయాలన్నీ రెండో రోజు వరద ముం పులోనే ఉన్నాయి. రాజమహేంద్రవరంలో కోటిలింగాలరేవు, చింతాలమ్మరేవు, పుష్కరాలరేవు, జీవకారుణ్యం రేవు, టీటీడీ ఘాట్, శ్రద్ధానంద ఘాట్, లాంచీల రేవు, పిండాలరేవు,దోబీఘాట్, సరస్వతి ఘాట్, గౌతమి ఘా ట్లు మునిగిపోయాయి.దీంతో ఆయా రేవులను మూసివేశారు.పుష్కరాలరేవులో నిత్య హారతిచ్చే ఘాట్ మొత్తం నీటమునిగింది. అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి ఘాట్లో పోలీస్ పహరా ఏర్పాటు చేశారు.గోష్పాదక్షేత్రానికి వెళ్ళే అన్ని రహదారులు బారికేడ్లు ఏర్పాటుచేసి మూసివేశారు.పోలీసు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది 24 గంటలు మూడు షిప్టులుగా పర్యవేక్షిస్తున్నా రు.మెడికల్ క్యాంపులు కొనసాగిస్తున్నారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద వరదను డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
మద్దూరులంకలో ఏటిగట్టు పటిష్టత..
కొవ్వూరు మండలం మద్దూరులంక గ్రామంలో బలహీనంగా ఉన్న ఏటిగట్టును ఇసుక బస్తాలతో మరింతగా పటిష్టపరిచారు. ఫ్లడ్ ప్రత్యేక అధికారి, టూరిజం శాఖ డిప్యూటీ కలెక్టర్ స్వామినాయుడు, కొవ్వూరు తహశీల్దార్ కె.మస్తాన్ పర్యవేక్షించారు. హెడ్వాటర్ వర్క్సు ఈఈ కాశీవిశ్వేశ్వరరావు, సిబ్బందితో మద్దూరులంక గ్రామాన్ని సందర్శించారు. వరద పరిస్థితిని చూశారు. గ్రామం చుట్టూ ఉన్న ఏటిగట్టును పరిశీలించి పటిష్ట పరచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. వరద ఉధృతి తగ్గకపోవడంతో మద్దూరులంక గ్రామంలో ప్రత్యేక శానిటేషన్, మెడికల్ క్యాంపులు కొనసాగిస్తున్నామని తహశీల్దార్ మస్తాన్ తెలిపారు. వరద మరలా పెరిగితే మద్దూరులంక, పల్లిపాలెం గ్రామాల్లో ముంపు బాధితులను తరలించడానికి మద్దూరు జడ్పీ హైస్కూల్లో పునరావాస కేంద్రాన్ని కొనసాగిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరంలో కేతావారిలంక, బ్రిడ్జిలంక, తదితర లంకల నుంచి సుమారు 400 మంది మత్స్యకారులను చందాసత్రం, మునిసిపల్ కల్యాణ మండపంలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి రేవులన్నీ అధికారులు మూసివేయడంతో ప్రజలు ఆయా రేవుల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు, కర్రలతో నిర్మించిన అడ్డుకట్టల నుంచే గోదావరిని తిలకిస్తున్నారు. నదీ ప్రవాహం ప్రమాదకర స్ధాయిలో ఉండడంతో ప్రజ లెవ్వరిని గోదావరి సమీపంలోకి అనుమతించడంలేదు.
ముంచేసిన కొవ్వాడ
తాళ్ళపూడి, జూలై 24 : కొవ్వాడ వరద ముంపు కారణంగా తాళ్ళపూడి మండలంలోని తిరుగుడుమెట్ట, అన్న దే వరపేట, గజ్జరం, ములకలపల్లి తదితర గ్రామాల్లో వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పంట పొలాల్లో నీరు బయటకు రాక రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాళ్ళపూడి మండలం లో 1448 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగినట్టు ఏవో రుచిత తెలిపారు.
పెరవలిలో వర్రీయే..
పెరవలి, జూలై 24 : ఎడతెరిపి లే కుండా కురిసిన వర్షాలతో కానూ రు, నడిపల్లి,ఉసులుమర్రు, కానూరు అగ్ర హారం గ్రామాల పరిధిలో పొలాలు ముంపునకు గురయ్యాయి.సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక నీరు నిలిచి పంటలు పాడయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. మంత్రి దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి ఆదేశాల మేరకు కానూరులో మురుగు డ్రెయిన్ తవ్వకం పనులు జరుగుతున్నాయి.ఉసులుమర్రు ప్రాంతంలో మా త్రం సుమా రు 1000 ఎకరాలు భూ ములు ఇంకా ముంపులోనే ఉన్నాయి.
Updated Date - Jul 25 , 2024 | 12:59 AM