తలశిల, నందిగం కనుసన్నల్లోనే ‘బోట్ల’ కుట్ర
ABN, Publish Date - Sep 10 , 2024 | 04:01 AM
ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను ఢీకొట్టిన ఇనుప బోట్ల వెనుక కుట్ర ఉన్నట్లు పోలీసులు తేల్చారు.
ఈ కేసులో ఉషాద్రి, రామ్మోహన్ల అరెస్టు
ఒకరు తలశిల మేనల్లుడు, ఇంకొకరు నందిగం అనుచరుడు
వారి స్కెచ్తోనే ప్రవాహంలోకి బోట్లు.. దర్యాప్తు బృందాల నిర్ధారణ
నిందితులకు రిమాండ్.. జైలుకు తరలింపు
విజయవాడ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను ఢీకొట్టిన ఇనుప బోట్ల వెనుక కుట్ర ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మాజీ సీఎం జగన్ సన్నిహితుడు, వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేశ్ కనుసన్నల్లోనే కార్గో బోట్లు నదిలోకి కదిలి వచ్చాయని దర్యాప్తు బృందాలు నిర్ధారణకు వచ్చాయి. మూడు కౌంటర్ వెయిట్ల ధ్వంసానికి కారణమైన ఇద్దరిని సోమవారం అరెస్టు చేశారు. వన్టౌన్ ఇన్స్పెక్టర్ గురుప్రకాశ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలం సూరాయిపాలెం గ్రామానికి చెందిన కోమటి రామ్మోహన్, గొల్లపూడి గంగానమ్మ ఆలయం ప్రాంతానికి చెందిన వక్కలగడ్డ ఉషాద్రిని అరెస్టు చేసి ఇక్కడి చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి రాజశేఖర్ వారికి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం వారిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. ప్రకాశం బ్యారేజీకి ఇటీవల 11.47 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు ఐదు బోట్లు కొట్టుకుని వచ్చి కౌంటర్ వెయిట్లను ఢీ కొట్టిన విషయం తెలిసిందే. 67, 69 గేట్ల వద్ద ఉండే కౌంటర్ వెయిట్లు మధ్యకు విరిగిపోగా, 70వ నంబరు కౌంటర్ వెయిట్కు పగుళ్లు వచ్చాయి. ఈ మూడింటి స్థానంలో కొత్త స్టీల్ కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 5 బోట్లలో ఒకటి ప్రవాహంలో కొట్టుకుపోగా.. మూడు మాత్రం కౌంటర్ వెయిట్లను ఢీకొని అక్కడే నిలిచిపోయాయి. ఇంకోటి గేటు కింద ఇరుక్కుపోయి ఉంటుందని భావిస్తున్నారు.
మూడింటినీ కలిపి కట్టారు..
బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్ల బాగోతాన్ని పోలీసులు వెలికితీశారు. కేవీఎం ఏపీ-4-ఎం-ఎ్సబీ0022, కేవీపీ ఏపీ-4-ఎం-ఎ్సబీ0017, కేఎ్సపీ ఏపీ-4-ఎం-ఎ్సబీ0023 రిజిస్ట్రేషన్ నంబర్లు ఉన్న బోట్లు వక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా గుర్తించారు. ఈ బోటు ఒక్కొక్కటి 40-50 టన్నుల బరువు ఉంటుంది. ఈ మూడింటినీ కలిపి గొల్లపూడిలోని శ్మశాన వాటిక వద్ద కట్టారు. నాలుగో బోటు భవానీపురానికి చెందిన కర్రి నరసింహస్వామికి చెందినదని, ఐదో బోటు విజయవాడకు చెందిన గూడూరు నాగమల్లేశ్వరికి చెందినదని పోలీసులు తేల్చారు. ఈ రెండు బోట్లకు వేర్వేరుగా లంగరు వేశారు. గతంలో జగన్ కార్యక్రమాల అమలును పర్యవేక్షించి.. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న తలశిల రఘురాంకు కోమటి రామ్మోహన్ మేనల్లుడు. రామ్మోహన్కు ఉషాద్రి ముఖ్య అనుచరుడు. మరో బోటు యజమాని కర్రి నరసింహస్వామి బీజేపీ నేత బబ్బూరి శ్రీరామ్కు అనుచరుడు. నదిలో మొత్తం 60-70 కార్గో బోట్లు తిరుగుతున్నాయి. ఇవన్నీ అమరావతి బోటు సొసైటీ కింద రిజిస్టర్ అయ్యాయి. తలశిల, నందిగం స్కెచ్తోనే రామ్మోహన్, ఉషాద్రి బోట్లను శ్మశాన వాటిక వద్ద కట్టారని తెలుస్తోంది. భారీగా వరదలు వచ్చే సూచనలు ఉన్నా ఇలా చేయడం సర్వత్రా అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ మూడు బోట్లు మరో రెండు బోట్లను తోసుకుని నదిలోకి వచ్చాయి. రామ్మోహన్, ఉషాద్రి ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు.
నందిగం లారీల్లో ఇసుక లోడింగ్..
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితఇసుక పాలసీని మార్చేసింది. నదిలో ఇసుకను తవ్వుకోవడానికి అనుమతులు ఇవ్వలేదు. ఉషాద్రి మాత్రం కోమటి రామ్మోహన్ ద్వారా అప్పటి బాపట్ల ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ రఘురాంను సంప్రదించాడు. ఉషాద్రి వైసీపీ నేత కావడంతో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వుకునేందుకు బోట్లను నదిలోకి దింపారు. నందిగంకు ముఖ్యఅనుచరుడిగా ఉన్న ఉద్దండరాయుపాలేనికి చెందిన యోహాన్ నిరంతరం అతడితో ఉండేవాడు. అక్రమంగా తవ్విన ఇసుకను నందిగం సురేశ్కు చెందిన లారీల్లో ఉషాద్రి లోడ్ చేసేవాడు. ఈ లోడింగ్ ప్రక్రియ రాత్రిపూట నిర్వహించేవారు. లాస్య బోట్ సొసైటీ అధినేత, టీడీపీ నేత ఆలూరి హరికృష్ణ చౌదరి.. ఉషాద్రి చేస్తున్న అక్రమాలను వ్యతిరేకించాడు. తలశిల, రామ్మోహన్ కలిసి ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టడం గమనార్హం.
Updated Date - Sep 10 , 2024 | 04:01 AM