chenetha చేనేతకు పూర్వవైభవం..!
ABN, Publish Date - Aug 29 , 2024 | 11:52 PM
వ్యవసాయం తరువాత అత్యధికంగా ప్రజలు ఆధారపడ్డ చేనేత రంగానికి పూర్వవైభవం సంతరించుకుంటోంది. పట్టు వస్ర్తాల తయారీలో దేశంలోనే ప్రతిభకల్గిన చేనేతలు ఉమ్మడి జిల్లా సొంతం. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేనేత రంగాన్ని నిర్వీర్యం చేయడంతో నేతన్నల ప్రతిభ, జిల్లా ఖ్యాతి మసక బారింది.
పట్టువస్ర్తాల తయారీకి కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం
మగ్గాలు, పరికరాల పంపిణీకి శ్రీకారం
వర్క్షెడ్ల నిర్మాణాలు, పాత మగ్గాల ఆధునికీకరణకు ప్రణాళిక
అధికారులతో వరుస సమావేశాలు
అనంతపురం సెంట్రల్, ఆగస్టు 29: వ్యవసాయం తరువాత అత్యధికంగా ప్రజలు ఆధారపడ్డ చేనేత రంగానికి పూర్వవైభవం సంతరించుకుంటోంది. పట్టు వస్ర్తాల తయారీలో దేశంలోనే ప్రతిభకల్గిన చేనేతలు ఉమ్మడి జిల్లా సొంతం. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేనేత రంగాన్ని నిర్వీర్యం చేయడంతో నేతన్నల ప్రతిభ, జిల్లా ఖ్యాతి మసక బారింది. 2014-19వరకు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన చేనేత పథకాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, రాయితీలను ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వ నిధులను సైతం పక్కదారి పట్టించింది. ఏడాదికి రూ.24వేలు చెల్లించే నేతన్న నేస్తం పథకాన్ని మాత్రమే అమలు చేసింది. ఈ పథకంలోనూ అర్హులకు అన్యాయంచేస్తూ వైసీపీ కార్యకర్తలు, నాయకులకు రూ.24వేలను కట్టబెట్టింది. వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ అనేకసార్లు చేనేతలు రోడ్లెక్కి నిరసనలు, ర్యాలీలు చేశారు. తాము అధికారంలోకి వస్తే చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకువస్తామని టీడీపీ హామీనిచ్చింది. ఆ మేరకు చేనేత రంగాన్ని ప్రోత్సహించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
క్షేత్రస్థాయి పర్యటనలు
చేనేత కార్మికులకు స్థిరమైన ఉపాధిని కల్పించే వస్త్ర తయారీ రంగాన్ని బలోపేతం చేసేదిశగా కూటమి ప్రభుత్వం ప్రోత్సాహకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రాంతాలవారిగా క్లస్టర్లుగా విభజిస్తున్నారు. జిల్లా చేనేత, జౌళిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఒక్కో క్లస్టర్లో 300 మందికిపైగా తగ్గకుండా చేనేతలను గుర్తిస్తున్నారు. వారికి నూతన మరమగ్గాలు, పరికరాలు అందజేసేలా వివరాలను క్రోడీకరిస్తున్నారు. స్థానిక వనరులకు అనుగుణంగా వర్క్షెడ్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటితోపాటు పాత మగ్గాలను గుర్తించి వాటిని ఆధునికీకరించేందుకు అవసరమైన పరికరాలను అందజేసేందుకు వివరాలను సేకరిస్తున్నారు. రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ వివరాలను తీసుకుంటున్నారు.
90 శాతం రాయితీ
ఉమ్మడి జిల్లాలో దాదాపు 50వేల మగ్గాలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు నేతలు మగ్గం నేస్తున్నారు. అనేక మంది కార్మికులు వర్క్షెడ్లలో పనిచేస్తున్నారు. ఇలాంటి వారికి సొంత మగ్గం కలను ప్రభుత్వం నెరవేర్చనుంది. 10 శాతం పెట్టుబడి పెట్టిన నేతలకు 90శాతం రాయితీతో మగ్గాలను అందజేయనున్నారు. అదేవిధంగా శారీరక శ్రమను తగ్గించేందుకు రెండు, మూడు లివర్ల లిఫ్టింగ్ మిషనలు, జాకాట్లను కూడా 90 శాతం రాయితీతో పంపిణీచేయనుంది. వీటికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తాధ్వర్యంలో ముద్ర వంటి బ్యాంకు రుణాల పథకాలను కొనసాగిస్తున్నారు. వీటితోపాటు గత టీడీపీ ప్రభుత్వంలో అమలుచేసిన ఉచిత విద్యుత సరఫరా పథాకాన్ని తిరిగి పునఃప్రారంభించారు.
ఫిర్యాదుల స్వీకరణ...
చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు పారదర్శకంగా అర్హులకు అందించేందుకు కూటమి ప్రభుత్వం ఉపక్రమించింది. మగ్గమే జీవనాధారంగా కుటుంబాన్ని పోషించుకుంటున్న ఏ ఒక్క నేత కార్మికుడు ప్రభుత్వ సంక్షేమానికి దూరం కాకూడదన్న ఉద్దేశంలో ముందుకు సాగుతోంది. పథకాలు అందని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా చేనేత జౌళిఖ కార్యాలయాల్లో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయించింది.
టెక్స్టైల్, అపెరల్ పాలసీ
వస్త్ర తయారీని ఆధునికీకరించి ఉత్పాదకతను మెరుగు పరిచేందుకు 2015లో టెక్స్టైల్ అపెరల్ పాలసినీ రూపొందించారు. సీఐఐ, ఎఫ్ఏపీఎ్సఐఏ, ఏఎల్ఈఏపి, స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్సతో సంప్రదించి విధివిధాలను రూపొందించారు. తద్వారా టెక్స్టైల్ పరిశ్రమలు, మెగా ప్రాజెక్ట్స్, అపెరల్ పార్కులు, ఐఐటీల్లో డిజైనింగ్ కోర్సులు, శిక్షణ కేంద్రాలు ట్యూషన ఫీజురీయింబర్స్మెంట్ తదితర అంశాలను ఆమోదించారు. డిజైనింగ్ డైయింగ్, ప్రాసెసింగ్, స్పిన్నింగ్, గార్మెంట్, మెషిన కార్పెటింగ్, ఎంబ్రాయిడరీ, టెక్నికల్ టెక్స్టైల్, క్రింపింగ్, టెక్ట్సరైజింగ్, ట్విస్టింగ్, వైండింగ్, సిజింగ్ తదితర వాటికి రాయితీలను అందించారు. వైసీపీ ప్రభుత్వం వాటన్నిటిని ఎత్తివేసి నేరుగా నగదు బదిలీ పేరుతో నేతన్న నేస్తాన్ని తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి రావడంతో పాలసినీ సవరించి మరిన్ని సౌకర్యాలను చేర్చి మళ్లీ అమలుచేయనుంది.
ఐఎ్సఓ మార్కు తీసుకువస్తాం
దేశీయ, అంతర్జాతీయ డిమాండ్లకు అనుగుణంగా వస్త్ర తయారీలో నాణ్యతను పెంచి రాష్ట్ర చేనేత రంగానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన ఫర్ స్టాండర్డర్స్ (ఐఎ్సఓ) మార్క్ను తీసుకువస్తాం. ప్రతి నేత పట్టునేయడంలో అత్యంత ప్రతిభను కలిగివున్నాడు. గత వైసీపీ ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో మళ్లీపూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాం. క్లస్టర్ల వారిగా చేనేతల సంఖ్యకు అనుగుణంగా 90శాతం రాయితీతో నూతన మగ్గాలు పంపిణీచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పాత మగ్గాల ఆధునికీకరణకు కొత్త పరికరాలను అందజేసేలా సర్వే ప్రక్రియను చేపట్టాం.
-సవిత, రాష్ట్ర చేనేత జౌళిశాఖ మంత్రి
Updated Date - Aug 29 , 2024 | 11:52 PM