సీసీఎల్ఏ ప్రక్షాళన!
ABN, Publish Date - May 17 , 2024 | 03:35 AM
భూ పరిపాలనా ప్రధాన కమిషనరేట్(సీసీఎల్ఏ)లో ప్రక్షాళన మొదలైంది. సుదీర్ఘకాలంగా ఒకేస్థానంలో పనిచేస్తోన్న సీనియర్ అధికారులను బదిలీ చేయడంతోపాటు వారు పర్యవేక్షిస్తోన్న విభాగాలను కూడా మార్చారు. ఈ మేరకు సీసీఎల్ఏ సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు అదనపు అసిస్టెంట్
ఐదుగురు అసిస్టెంట్ కమిషనర్ల బదిలీ.. ఈ మార్పుల వెనుక కీలక పరిణామాలు
ఎన్నికల వేళ 132 మందికి పదోన్నతులు కట్టబెట్టే యత్నం
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆ ఫైలును నిలిపేసిన సీసీఎల్ఏ
అప్పుడే ప్రక్షాళన చేస్తారని సంకేతాలు..
ఎన్నికలు ముగియడంతో అంతర్గత ప్రక్షాళన మొదలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
భూ పరిపాలనా ప్రధాన కమిషనరేట్(సీసీఎల్ఏ)లో ప్రక్షాళన మొదలైంది. సుదీర్ఘకాలంగా ఒకేస్థానంలో పనిచేస్తోన్న సీనియర్ అధికారులను బదిలీ చేయడంతోపాటు వారు పర్యవేక్షిస్తోన్న విభాగాలను కూడా మార్చారు. ఈ మేరకు సీసీఎల్ఏ సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు అదనపు అసిస్టెంట్ కమిషనర్(ఏఏసీ)లను మార్చారు. సుదీర్ఘకాలంగా విజిలెన్స్ విభాగం ఏఏసీగా ఉన్న కృష్ణమూర్తిని అలియనేషన్ విభాగానికి మార్చారు. ఆ పోస్టులో ఉన్న సీహెచ్ శారదను విజిలెన్స్ ఏఏసీగా మార్చారు. రెవెన్యూ ఉద్యోగుల సర్వీసు విషయాలు చూసే డి.రమాదేవిని కోనేరు రంగారావు కమిటీ(కేఆర్ఆర్సీ)కి మార్చారు. పరిపాలనా విభాగం నుంచి ఎంవీ రమణను సర్వీసెస్ విభాగానికి బదిలీ చేశారు. పరిపాలనా విభాగానికి చెందిన మహాలక్ష్మీకి ఆ విభాగం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఎంఆర్ఏలో ఏఏసీగా టి.జగన్నాధరావును నియమించారు. గ్రేడ్-1 సూపరింటెండెంట్ ఆర్.దుర్గాప్రసాద్ను పెన్షన్ విభాగానికి మార్చారు. ఈ బదిలీలు, విభాగాల మార్పుల వెనుక అనేక కీలక పరిణామాలు జరిగాయి. ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా 132 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతులు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయి. దానికి ఎన్నికల నిర్వహణ అనే అత్యవసర కారణాలను చూపించారు. సీసీఎల్ఏను కూడా తప్పుదోవ పట్టించి ఫైలును నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి నేతృత్వంలోని స్ర్కీనింగ్ కమిటీకి పంపించారు.
నిబంధనల ప్రకారం ఫైలు సీసీఎల్ఏ కార్యాలయం నుంచి రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రఽధాన కార్యదర్శి అజయ్జైన్కు వెళ్లాల్సి ఉండగా, ఆయనకు తెలియకుండానే నేరుగా స్ర్కీనింగ్ కమిటీకి పంపించారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వార్తను ప్రచురించడంతో ఫైలును సీసీఎల్ఏ నిలిపివేశారు. దీంతోపాటు ఎన్నికల కోడ్ రావడానికి కొద్ది రోజుల ముందు రెవెన్యూశాఖలో డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్లు, ఇతర సిబ్బందిపై ఉన్న అవినీతి, అక్రమాల కేసులను అధికారులు ఎత్తివేశారు. పెద్ద శిక్షలు పడే కేసులను సైతం చిన్నవిగా చూపి అభియోగాలను ఉపసంహరించారు. రాష్ట్రవ్యాప్తంగా 182 మంది అధికారులపై కేసులు ఎత్తివేసేందుకు ఆరు నెలల కాలంలో అనేక ప్రయత్నాలు చేశారు. విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటుపరం కావడంలో కీలకపాత్ర పోషించిన డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లపై ఉన్న క్రమశిక్షణా చర్యలు, అభియోగాలను ప్రభుత్వం ఉపసంహరించేలా అడ్డగోలుగా సిఫారసులు చేశారు. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సిఫారసులు ఇప్పించడం, వాటి ఆధారంగా తక్షణమే కేసులను ఎత్తివేసేలా ఫైళ్లు నడిపించారు. ఈ పరిణామాలపైనా ‘ఆంధ్రజ్యోతి’ వరసగా వార్తలను ప్రచురించింది. కాగా, డైరెక్ట్ రిక్రూటీ, పదోన్నతి ద్వారా వచ్చిన వారికి తహసీల్దార్గా పదోన్నతులు ఇచ్చే విషయాల్లో వివాదాలున్నాయి. ఓ అధికారి రెండు గ్రూపులతో వ్యవహారాలు నడిపి పదోన్నతులివ్వాలని శతవిధాలా ప్రయత్నాలు చే శారు. ఇందుకు ఉన్నతస్థాయి అధికారుల పేర్లను కూడా లాగారు. ఈ విషయం బయటకు రావడంతో సీసీఎల్ఏ సాయిప్రసాద్ పదోన్నతుల ఫైలును నిలిపివేశారు. ఎన్నికలయ్యేవరకు ఏ ఒక్కరికీ పదోన్నతులు ఇవ్వడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారు. పదోన్నతుల ఫైళ్లే తనకు పంపొద్దని ఆదేశించారు. ఆ సమయంలోనే సీసీఎల్ఏలో కీలక మార్పులు చేస్తారని అంతా భావించారు. అయితే, ఎన్నికల హడావుడి ఉండటంతో అధికారులు వేచిచూసినట్లు తెలిసింది. ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అంతర్గత ప్రక్షాళన మొదలుపెట్టినట్లు సమాచారం.
Updated Date - May 17 , 2024 | 08:28 AM