భూమి జగన్దా.. మీదా?
ABN, Publish Date - May 06 , 2024 | 03:57 AM
‘భూమి మీదా.. సీఎం జగన్దా...? భూమిపైన హక్కు మీదా.. జగన్దా..?’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు.
దానిపై హక్కు ఆయన తాత, నాన్న ఇచ్చారా?
మన భూములు అమ్ముకోవాలంటే సీఎం పర్మిషన్
కావాలంట.. ఆయనిచ్చే జిరాక్స్ పనికిరాదు
మనమంతా బానిసలమనుకుంటున్నారు
ఓటు దెబ్బకు గూబ గుయ్మనాలి
ఇంటి వద్ద పింఛన్ ఇవ్వకుండా వేధిస్తున్నారు
కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయేనే.. జగన్కూ
అర్థమైంది.. కూటమికి 160 సీట్లు ఖాయం
ధర్మవరం, అంగళ్లు, అనంత సభల్లో బాబు
అనంతపురం-ఆంధ్రజ్యోతి/కురబలకోట, మే 5: ‘భూమి మీదా.. సీఎం జగన్దా...? భూమిపైన హక్కు మీదా.. జగన్దా..?’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. పట్టాదారు పాసుపుస్తకం మీద ఆయన ఫొటో ఏమిటని నిలదీశారు. ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా హాజరైన సభలోను, తర్వాత అన్నమయ్య జిల్లా అంగళ్లు, అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాగళం భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. జనం భూములపై హక్కు జగన్ తాత, నాన్న.. నానమ్మ.. అమ్మమ్మ ఏమైనా ఇచ్చారా అని మండిపడ్డారు. ఆయన ఇచ్చిన పాసుపుస్తకాలను చింపేసి చెత్తబుట్టలో వేయాలని పిలుపిచ్చారు. జగనన్న భూ హక్కు పుస్తకాన్ని చూపించి, దాన్ని చింపేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాగానే.. కొత్తవి ఇస్తామని.. ప్రజల ఫొటోలే వాటిపై ముద్రిస్తానని హామీ ఇచ్చారు. ‘కొత్త చట్టం తీసుకొచ్చాడట. భూములన్నీ ఆన్లైన్లో ఉంటాయంట. అవి ప్రైవేటు కంపెనీల ఆధీనంలో ఉంటాయంట. మీరు అమ్ముకోవాలంటే జగన్ పర్మిషన్ కావాలంట. అడంగల్, పట్టాదారు పాసుపుస్తకం లేదు. మీకు జిరాక్స్ కాపీ ఇస్తాడంట. అది ఎందుకూ పనికిరాదు. మనమంతా బానిసలమని ఆయన అనుకుంటున్నారు. ఒక్కొక్కరూ ఓటుతో దెబ్బవేస్తే గూబ గుయ్మనాలి’ అని అన్నారు. గత ఎన్నికలకు ముందు కోడి కత్తి డ్రామా ఆడారని.. ఇప్పుడేమో గులకరాయి డ్రామాకు తెరలేపారని.. అది రక్తి కట్టకపోవడంతో కొత్త నాటకం ఆడాలని ఆలోచిస్తున్నారని, ఎవరినో ఒకరిని చంపేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం, పిల్లల భవిష్యత్ కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భేషజాలకు పోకుండా కలిసికట్టుగా పనిచేయాలని, ఈ నెల 13న జరిగే పోలింగ్తో జగన్ హింసాకాండకు ముగింపు పలకాలని పిలుపిచ్చారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేయకుండా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఏమన్నారంటే..
ఎక్స్గ్రేషియా డిమాండ్కు జవాబేదీ?
వృద్ధులకు ఇంటి వద్దే పింఛన్ ఇవ్వకుండా గత నెలలో సచివాలయాల చుట్టూ తిప్పుకొని.. 33 మందిని చంపేశారు. ఇవి ప్రభుత్వ హత్యలే. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశాం. ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తే.. ఈ నెలలో బ్యాంకుల్లో డబ్బులు వేసి బ్యాంకుల చుట్టూ వృద్ధులను తిప్పుతున్నారు. జగన్ నిర్వాకంతో రాష్ర్టానికి రాజధాని ఏదీ అంటే చెప్పలేని దౌర్భాగ్య స్థితికి రావడం బాధేస్తోంది. రాజధాని అమరావతికే కట్టుబడి ఉన్నామని అమిత్షా ప్రకటించారు. జగన్ అవినీతితో పోలవరం ఆలస్యమైందని, పూర్తిచేసే బాధ్యత తమదని అమిత్షా హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం సహకారంతో అమరావతిని దేశంలో నంబర్ వన్ చేస్తా. జే బ్రాండ్ మద్యంతో జగన్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇసుకలో కూడా డబ్బులు కొట్టేసిన దుర్మార్గుడు. కరెంటు చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చి, 9 సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి, ఆర్థిక భారం మోపారు. జగన్ ఇడుపులపాయలో 600 ఎకరాలు, స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో కడపలో 1,000 ఎకరాలు, సిమెంటు కంపెనీల పేరుతో 80వేల ఎకరాలు, రాజధాని పేరుతో విశాఖలో విలువైన భూములు కొట్టేశారు.
ఓడిపోతామని జగన్కు తెలిసిపోయుంది..
సూపర్ సిక్స్ పథకాలను చూసి ఈ ఎన్నికల్లో ఓడిపోతామని ఆయనకు ముందే తెలిసిపోయింది. సర్వేలన్నీ ఎన్డీయే ఏకపక్షంగా గెలుస్తుందని తేల్చాయి. కేంద్రంలో, రాష్ట్రంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వాలే. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని కాబోతున్నారు. రాష్ట్రంలో పాతికకు పాతిక ఎంపీ సీట్లు మనమే గెలవాలి. 160 అసెంబ్లీ సీట్లు గెలవబోతున్నాం. ఈ వారం రోజులూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భేషజాలు మాని కలిసికట్టుగా కష్టపడాలి.
హలో ఏపీ.. బైబై జగన్..
‘హలో అనంతపూర్... బైబై వైసీపీ. హలో ఏపీ.. బై బై జగన్..’ ఇదే మనందరి నినాదం కావాలి. ఈ నెల 13న జరిగే పోలింగ్లో ఫ్యాన్కు ఉరివేయండి. జగన్ పార్టీని తరిమేయండి. వైసీపీ, జగన్ హింసా రాజకీయాలకు ఈ నెల 13న ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉండాలి. రాతియుగానికి బై చెప్పి.. స్వర్ణయుగానికి స్వాగతం పలకాలి. జగన్ రూపంలో రాష్ర్టానికి పట్టిన శని విరగడైపోతుంది. జగన్ పెట్టుబడులను తరిమేశారు. డీఎస్సీ పెట్టలేదు. మేం వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతా. ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా.
పెద్దిరెడ్డికి కొవ్వు ఎక్కువైంది..
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదవుల కోసం ఒకప్పుడు కిరణ్కుమార్రెడ్డి పాదాల కింద కూర్చున్నాడు. ఇప్పుడవన్నీ మర్చిపోయి.. తానో పెద్ద మొనగాడిని అనుకుంటున్నాడు. ఆయనకు కొవ్వు ఎక్కువైంది. నా జీవితంలో ఎప్పుడూ జరగని అవమానం.. అంగళ్లులో జరిగింది.. ఎప్పటికీ మర్చిపోను.. తప్పకుండా బదులు తీర్చుకుంటా. పదేపదే అంగళ్లుకు వస్తా.. ఎవరేం చేస్తారో చూస్తా. జూన్ 4న ఈ దుర్మార్గపు ప్రభుత్వం పోతుంది. అప్పుడు ఒక్కొక్కరి కథా చెబుతా. పెద్దిరెడ్డీ నీక కొమ్ములు వచ్చాయనుకుంటున్నావేమో? వాటిని కత్తిరిస్తా. ప్రాజెక్టుల పేరుతో పెద్దిరెడ్డి కుటుంబం దోపిడీ చేస్తోంది. మేం రాగానే.. ఆ లెక్కలన్నీ తేలుస్తాం.
ఇప్పటికీ కొందరు పోలీసులు, అధికారులు అధికారపార్టీకి ఏకపక్షంగా పని చేస్తూ ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి వాళ్లపై నేను కూడా ఏకపక్షంగానే వ్యవహరిస్తా.
- చంద్రబాబు
Updated Date - May 06 , 2024 | 03:57 AM