Andhra Pradesh: జోక్యం చేసుకోండి.. కేంద్రానికి షర్మిల సంచలన లేఖ..
ABN, Publish Date - Dec 04 , 2024 | 03:53 PM
ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల కేంద్రానికి సంచలన లేఖ రాశారు. ఏపీలో అదానీ గ్రూప్ కంపెనీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రం మరింత నష్టపోతుందని లేఖలో పేర్కొన్నారు.
విజయవాడ: సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల సంచలన లేఖ రాశారు. ఏపీలో అదానీ గ్రూప్ కంపెనీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నందున ఒప్పందాన్ని రద్దు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 2021లో అదానీ, ఏపీ రాష్ట్ర డిస్కమ్ల మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయని.. ఈ ఒప్పందాల వ్యవహాలంలో అదానీ ద్వారా అప్పటి సీఎం జగన్ కు రూ. 1750 కోట్లు ముడుపులు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థ నిర్ధారించిందని పేర్కొన్నారు.
వేల కోట్ల భారం..
ఈ ఒప్పందాల వల్ల గత ప్రభుత్వం ఏపీ ప్రజలపై వేల కోట్ల భారం మోపిందని లేఖలో తెలిపారు. యూనిట్కు రూ. 2.49 చొప్పున 7000 మెగావాట్ల సౌర విద్యుత్ను సరఫరా చేయాలని సంతకం చేశారని.. సెప్టెంబర్ 2024 నుండి 25 సంవత్సరాల కాలానికి భారాలు వసూళ్లు చేసేలా ఒప్పందం సంతకం చేశారని వెల్లడించారు.
జోక్యం చేసుకోవాలి:
అధునాతన సాంకేతికతల రాకతో, రోజురోజుకు అధిక-నాణ్యత గల విద్యుత్ను పొందడం సులభం అవుతుందన్నారు. ఇది ఆటోమేటిక్గా చౌకగా మారుతుందనేది వాస్తవమని.. 25 సంవత్సరాల కాలానికి ఒప్పందాలు కుదుర్చుకోవడం సహేతుకం కాదని తన అభిప్రాయాన్ని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని నష్టం అయితే, ఆ భారం చివరికి ఏ తప్పు చేయని ప్రజలపై పడుతుందని లేఖలో వివరించారు. శాశ్వత ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి భారీ ఉపశమనం కలిగించే మీరు జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు.
Updated Date - Dec 04 , 2024 | 03:53 PM