అనుమతి లేని పాఠశాలలను సీజ్ చేయాలి
ABN, Publish Date - May 16 , 2024 | 11:23 PM
జిల్లాలో అనుమతి లేని స్కూళ్లను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణయ్య, ప్రధానకార్యదర్శి కుళ్లాయిస్వామి, ఇతర నాయకులు ఏడీ క్రిష్ణయ్యను డీఈఓ కార్యాలయంలో కలిశారు.
అనంతపురం విద్య, మే 16 : జిల్లాలో అనుమతి లేని స్కూళ్లను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణయ్య, ప్రధానకార్యదర్శి కుళ్లాయిస్వామి, ఇతర నాయకులు ఏడీ క్రిష్ణయ్యను డీఈఓ కార్యాలయంలో కలిశారు. పలు కార్పొరేట్ స్కూళ్లు నిబంధనలను పూర్తిగా విస్మరిస్తున్నాయని, ఒకటి, రెండు బ్రాంచులకు అనుమతి తీసుకుని, ఆరు.. ఏడు బ్రాంచులు నడుపుతున్నారని అన్నారు. పుస్తకాల పేరుతో రూ. 10 వేల నుంచి రూ. 15 వేలు లాగేస్తున్నారని, ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులను యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయన్నారు. వెంటనే ఒక అధికారిని నియమించి అన్ని స్కూళ్లలో తనిఖీలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే స్కూళ్లను సీజ్ చేయాలని కోరారు. ఈ మేరకు ఏడీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మంజునాథ్, ఉమామహేష్, వంశీ, రారాజు, హర్ష, పవన పాల్గొన్నారు.
Updated Date - May 16 , 2024 | 11:23 PM