TSPSC Paper Leak Row: రద్దయిన పరీక్షలకు మళ్లీ ఫీజ్ కట్టక్కర్లేదు.. కేటీఆర్ ఇంకా ఏం చెప్పారంటే..
ABN, First Publish Date - 2023-03-18T14:06:29+05:30
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై (TSPSC Paper Leak) మంత్రి కేటీఆర్ (Minister KTR) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై (TSPSC Paper Leak) మంత్రి కేటీఆర్ (Minister KTR) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేపర్ లీక్పై నిపుణులతో చర్చించామని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో రివ్యూ చేశామని తెలిపారు. పేపర్ లీక్పై కేసీఆర్కు నివేదిక ఇచ్చామని, TSPSC ద్వారా 155 నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు. TSPSC ద్వారా 37 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, 10 లక్షల మందికి ఒకేసారి పరీక్ష నిర్వహించిన ఘనత ఉందని చెప్పుకొచ్చారు. ఇద్దరు చేసిన తప్పునకు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వచ్చిందని, పేపర్ లీకేజీ వెనుక ఎంతటివారున్నా వదిలిపెట్టేది లేదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. రద్దయిన పరీక్షలకు మళ్లీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఇకపై జరిగే పరీక్షలను మరింత పటిష్టంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. గతంలో హాజరైన వారిని అర్హులుగా గుర్తిస్తామని, కోచింగ్ మెటీరియల్ను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.
నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని, 2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని కేటీఆర్ ప్రకటించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అపోహలు సృష్టించేవారిని నమ్మొద్దని మంత్రి కేటీఆర్ తెలంగాణ యువతకు సూచించారు. పేపర్ లీక్ వెనుక కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడు రాజశేఖర్రెడ్డి బీజేపీ కార్యకర్త అని తెలిపారు. లీకేజ్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ‘‘ఐటీ మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయాలి. అసలు ఐటీ మంత్రి ఏం చేస్తారో మీకు తెలుసా?’’ అని ప్రశ్నించారు. ఉద్యోగాల గురించి బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు నిందితులను సిట్ కస్టడీకి అప్పగించారు. 9 మంది నిందితులను 6 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. చంచల్గూడ జైలు నుంచి నిందితులను సిట్ అదుపులోకి తీసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలపై సిట్ కూపీ లాగనుంది. ప్రశ్నాపత్రం ఎవరెవ్వరికి విక్రయించారనే దానిపై సిట్ ఆరా తీయనుంది. నిందితులను మార్చి 23 వరకు సిట్ అధికారులు విచారణ చేయనున్నారు.
Updated Date - 2023-03-18T15:08:02+05:30 IST