Tummala Nageshwarrao: ‘అమెరికాకు ధీటుగా తెలంగాణలో అభివృద్ధి’
ABN, First Publish Date - 2023-04-24T12:59:05+05:30
కేసీఆర్ను మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఖమ్మం: కేసీఆర్ను (CM KCR) మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Former Minister Tummala Nageshwar Rao) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రానికి ఏం కావాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. గోదావరి జలాలు త్వరలోనే సత్తుపల్లికి రాబోతున్నాయన్నారు. ఎన్నికల ముందే గోదావరి జలాలతో సత్తుపల్లి రైతుల కాళ్ళు కడుగుతానని అన్నారు. ‘‘సీతారామ ప్రాజెక్ట్ నా లక్ష్యం.. నా కల.. నా రాజకీయ లక్ష్యం’’ అని స్పష్టం చేశారు. అమెరికాకు ధీటుగా నేడు తెలంగాణలో అభివృద్ది జరుగుతోందని అన్నారు. ఖమ్మం జిల్లాకు నలువైపులా జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. 1997లోనే గ్రామ గ్రామానికీ త్రాగునీరు అందించామని, రహదారులు నిర్మించామని గుర్తుచేశారు. ఎత్తిపోతల పథకాలతో ఇరవై ఏళ్ల క్రితమే రైతాంగానికి సాగునీరందించామన్నారు. ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసిన కేసీఆర్కు సహకరిద్దామని.. అండగా నిలబడదామని పిలుపునిచ్చారు. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా తెలంగాణలో సాగునీటి రంగం అభివృద్ధికి కృషి చేశారన్నారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం కష్టపడే హరీష్రావు అంటే తనకు ఇష్టమని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Updated Date - 2023-04-24T12:59:05+05:30 IST