Nelloreలో YCP రాజకీయాలు రసవత్తరం..ఫ్యాక్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారా..!?
ABN, First Publish Date - 2023-01-31T11:20:55+05:30
తలపండిన రాజకీయ నేతలకు నెల్లూరు నిలయం కావడంతో పొలిటికల్గా హీట్ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో..
అసెంబ్లీ ఎన్నికలకు ముందే నెల్లూరు రాజకీయాలు హీటెక్కుతున్నాయా?.. ఆనం, నేదురుమల్లి ఫ్యామిలీల మధ్య ఫైట్ మళ్లీ మొదలైందా?.. సీనియర్ నేత ఆనంను జగన్రెడ్డి డైరెక్ట్గానే టార్గెట్ చేశారా?.. ఆనం పొమ్మన్నా పోవడం లేదని వెంకటగిరిలో ఫ్యాక్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారా?.. వైసీపీ పెద్దల తీరుతో అధికారులు, ప్రజలు తలలు పట్టుకుంటున్నారా?.. ఇంతకీ.. నెల్లూరు రాజకీయాలు ఎందుకు హీటెక్కాయి?.. ఫ్యాక్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టిందెవరు?.. అసలు.. ఆనంను టార్గెట్ చేయడానికి కారణాలేంటి?..అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్సైడ్లో తెలుసుకుందాం..
ప్రభుత్వ తీరును బహిరంగంగా ప్రశ్నించడంతో హీట్
తలపండిన రాజకీయ నేతలకు నెల్లూరు నిలయం కావడంతో పొలిటికల్గా హీట్ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో.. నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా.. ఆనమోళ్ల ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆనం రామనారాయణరెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆర్అండ్బీ, పర్యాటక, మున్సిపల్, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీలోనున్న ఆనం.. ఇటీవల ప్రభుత్వ తీరుని బహిరంగంగా ప్రశ్నించడం హీట్ పెంచింది. ఫించన్లు ఇస్తే ఓట్లు వేస్తారా?.. అలాగైతే గత ప్రభుత్వాలూ ఫించన్లు ఇచ్చాయంటూ హాట్ కామెంట్స్ చేశారు. అందరికీ మేలు జరిగేవి ఏమీ చేయకుండా.. జనాల్లోకి వెళ్లి ఓట్లు ఎలా అడగాలంటూ ప్రతిపక్ష నేతల మాదిరిగా స్వపక్ష నేతే ప్రశ్నల వర్షం కురిపించడం ప్రభుత్వ పెద్దల్లో ప్రకంపనలు రేపింది.
ఆనం.. జగన్కు డైరెక్ట్గానే టార్గెట్
ఇక.. ప్రశ్నించే వారిని వేధించడం జగన్రెడ్డికి కొత్తమేకాదు. ఇంకేముంది.. ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ఆనంపై వరస వేధింపులు, కక్ష్యసాధింపులు మొదలయ్యాయి. అంతేకాదు.. ఆనం వ్యవహారం.. జగన్కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దాంతో.. ఆనం.. జగన్కు డైరెక్ట్గానే టార్గెట్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేసినా.. ఎన్ని కోట్లు ఖర్చు అయినా.. ఆయన్ను ఓడించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి ఇప్పటినుంచే వ్యూహాలు మొదలయ్యాయనే చర్చ సాగుతోంది. దీనిలో భాగంగా.. వెంకటగిరి ఎమ్మెల్యేగా ఆనం ఉండగానే.. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను వైసీపీ పెద్దలు అనూహ్యంగా నేదురుమల్లి రాంకుమార్రెడ్డికి అప్పగించారు.
ఆనం వ్యూహాత్మకంగా అడుగులు
మరోవైపు... ఆనం రామనారాయణరెడ్డిని ఉద్దేశించి నేదురుమల్లి రాంకుమార్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొమ్మన్నా పార్టీని పట్టుకు వేలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లెక్కన.. ఆనంను పార్టీ నుంచి ఎలాగైనా బయటకు పంపాలని వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. నియోజకవర్గంలో ఆనంకు దార్లు మైసుకుపోయేలా నేదురుమల్లి వ్యవహరిస్తున్నారు. అయితే.. వైసీపీ నేతల చర్యలను పసిగట్టిన ఆనం.. వారికి షాకిచ్చేలా కసరత్తు చేశారు. ఉప ఎన్నికకు అవకాశం ఇవ్వకుండా ఆనం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నిజానికి.. ఆనంకు వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు సిటీ, రూరల్లో పట్టు ఉంది. ఎన్నికల్లో ఆనం ప్రభావం తప్పక ఉంటుందని నెల్లూరు జనం అంచనాలు వేస్తున్నారు.
ఇదిలావుంటే.. జగన్రెడ్డి నిర్ణయంతో వెంకటగిరి వైసీపీలో ఆనం, నేదురుమల్లి వర్గాలు తయారయ్యాయి. గతంలో తటస్థంగా ఉండే వారూ.. ఇప్పుడు ఏదో ఒకవైపు రాక తప్పడం లేదు. గ్రామాల్లో ఫ్యాక్షన్ పోకడలు పడగ విప్పుతున్నాయి. బాలాయపల్లి మండలం మన్నూరులో ఇటీవల గౌరీదేవి పూజలు జరిగాయి. ఆ కార్యక్రమంలో ఆనం, నేదురుమల్లి వర్గాలు ఘర్షణకు దిగి కొట్లాడుకున్నారు. రాపూరులోనూ క్రీడా పోటీల విషయంలో రెండు వర్గాలు కాలుదువ్వుకున్నాయి. అలా పలు గ్రామాల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఫ్యాక్షన్ పోకడలకు జగన్ నిర్ణయమే ప్రధాన కారణమనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఎక్కడైనా ప్రజలు ఎన్నుకున్నవారే ఎమ్మెల్యే.. వాళ్లు చెప్పినట్టే అధికారులు వింటుంటారు.
ఎమ్మెల్యే ఆనంతో గిట్టలేదని.. కొత్తగా నేదురుమల్లిని తెచ్చిపెట్టడంపై ప్రజలు, అధికార యంత్రాంగంలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఎలెక్టెడ్ ఆనం.. సెలెక్టెడ్ నేదురుమల్లి అంటూ జనం సెటైర్లు వేస్తున్నారు. తాము ఆనంను ఎన్నుకుంటే.. సీఎం నేదురుమల్లిని పెత్తనం చేయమనడం ఏంటని?.. ఇదెక్కడి రాజ్యాంగం.. అంటూ ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అటు.. అధికారుల పని అడకత్తెరలో పడ్డట్టు అయింది. కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం అన్న చందంగా తయారైంది. అదే సమయంలో.. ఇటీవల సీఎం జగన్ సొంత టీమ్లు సర్వేలు చేపట్టగా.. నేదురుమల్లిపై ప్రజలు అంత ఆశక్తి చూపలేదని వెల్లడైనట్లు తెలుస్తోంది. దాంతో.. వెంకటగిరి విషయంలో వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.
Updated Date - 2023-01-31T11:35:11+05:30 IST