Panchakarla Ramesh Babu: పంచకర్ల వెళ్లిపోవడం వల్ల వైసీపీకి ఏ రేంజ్లో పంక్చర్ అయిందంటే..
ABN, First Publish Date - 2023-07-18T12:58:53+05:30
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం జిల్లా నూతన అధ్యక్షుడి కోసం అన్వేషిస్తోంది. ఎన్నికలకు ముందు సమర్థుడైన నాయకుడిని అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తోంది. అందుకోసం కొందరు సీనియర్ నేతల పేర్లను పరిశీలిస్తోంది. అయితే వారంతా పార్టీ పగ్గాలు చేపట్టాలంటే తమకు భవిష్యత్తులో ఎలాంటి న్యాయం చేస్తారో చెప్పాలని అడుగుతున్నారు. దీంతో అధిష్ఠానం ఆలోచనలో పడింది.
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం జిల్లా నూతన అధ్యక్షుడి కోసం అన్వేషిస్తోంది. ఎన్నికలకు ముందు సమర్థుడైన నాయకుడిని అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తోంది. అందుకోసం కొందరు సీనియర్ నేతల పేర్లను పరిశీలిస్తోంది. అయితే వారంతా పార్టీ పగ్గాలు చేపట్టాలంటే తమకు భవిష్యత్తులో ఎలాంటి న్యాయం చేస్తారో చెప్పాలని అడుగుతున్నారు. దీంతో అధిష్ఠానం ఆలోచనలో పడింది. మరోవైపు అధ్యక్ష పదవి కోసం బెహరా భాస్కరరావుతోపాటు కొండా రాజీవ్గాంధీ తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు.
వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా వున్న పంచకర్ల రమేష్బాబు అకస్మాత్తుగా అధ్యక్ష పదవితోపాటు పార్టీ సభ్వత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి ఎంపికపై పార్టీ విశాఖ జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ నెల 14, 15, 16 తేదీల్లో పలుమార్లు నేతలతో చర్చించారు. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని ఎమ్మెల్సీ వంశీకృష్ణశ్రీనివాస్ను కోరగా తాను ఎనిమిదేళ్లపాటు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశానని, ఇప్పుడు తనకు ఆసక్తి లేదని సున్నితంగా తిరస్కరించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్కుమార్ను అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని వైవీ సుబ్బారెడ్డి కోరగా, తాను గతంలో ఎమ్మెల్యేగా, వైసీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేసినందున వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తానని హామీ ఇస్తే పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తానని షరతు పెట్టినట్టు కొందరు చెబుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే రెహమాన్ పేరు కూడా అధిష్ఠానం పరిశీలించిందని, ఆయన కూడా తనకు దక్షిణ నియోజకవర్గంలో పోటీకి అవకాశం ఇస్తే, అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటానని చెప్పినట్టు నేతల్లో చర్చ జరుగుతోంది. మరో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ అధిష్ఠానం అంతగా మొగ్గుచూపడం లేదని నేతలు పేర్కొంటున్నారు.
ఇదిలా వుండగా తమకు అవకాశం ఇస్తే పార్టీ కార్యాలయ నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరులను తామే సమకూర్చుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేస్తామమని జీవీఎంసీ కో-ఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు, వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్గాంధీలు అధిష్ఠానాన్ని కోరుతున్నట్టు తెలిసింది. తాను ఎనిమిదేళ్లుగా పార్టీ అధికార ప్రతినిధిగా డిబేట్లలో పాల్గొని సత్తా చాటుతున్నానని, మరోవైపు యువజన కాంగ్రెస్ నగర అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లు పనిచేసినందున అవకాశం ఇవ్వాలని కొండా రాజీవ్గాంధీ నేరుగా వైవీ సుబ్బారెడ్డితో పాటు విజయసాయిరెడ్డిని కోరినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.
సామాజిక వర్గాలను బేరీజు వేసుకుని అధ్యక్ష పదవిని కేటాయించాల్సి ఉండడంతో మంత్రి అమర్నాథ్, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులతో వైవీ సుబ్బారెడ్డి ఈ అంశంపై పలుమార్లు చర్చించి, సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టిలో పెట్టి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.
Updated Date - 2023-07-18T12:59:19+05:30 IST