Rains: బంగాళాఖాతంలో ఆవర్తనం.. 13 జిల్లాలకు భారీ వర్షసూచన
ABN, Publish Date - Dec 17 , 2023 | 09:29 AM
నైరుతి బంగాళాఖాతం ఆనుకొని హిందూ మహాసముద్రం మీద ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 1.5 కి.మీ
ప్యారీస్(చెన్నై): నైరుతి బంగాళాఖాతం ఆనుకొని హిందూ మహాసముద్రం మీద ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తుకు విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని రామనాథపురం సహా 13 జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు స్థానిక నుంగంబాక్కంలోని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఉపరితల ఆవర్తనం కదిలే దిశలో ఉన్న ప్రాంతాలు, దక్షిణ, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఆదివారం నుంచి తూర్పు గాలులు వీస్తాయని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా కడలూరు, మైలాడుదురై, తంజావూరు, తిరువారూరు, పుదుకోట, రామనాఽథపురం, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్నియాకుమారి, నాగపట్టినం జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముంది. ఇక విల్లుపురం, తెన్కాశి, విరుదునగర్, మదురై, తేని, దిండుగల్, శివగంగ, తిరుచ్చి, కరూర్, పెరంబలూర్, అరియలూర్, కళ్లకుర్చి జిల్లాలు, పుదుచ్చేరిలో ఈనెల 18 నుంచి 21వ తేది వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, అందువల్ల కోస్తా తీరప్రాంతాలకు చెందిన జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే మిచౌంగ్ తుఫాను సృష్టించిన బీభత్సంతో నగర రోడ్లు ధ్వంసం కాగా, మళ్లీ వర్షం పడితే పరిస్థితి ఏంటని అటు ప్రజలు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం ఆందోళన చెందుతున్నారు.
Updated Date - Dec 17 , 2023 | 09:29 AM