Siddaramaiah: జేపీ నడ్డా వ్యాఖ్యలకు సిద్ధరామయ్య స్ట్రాంగ్ కౌంటర్.. మరి ప్రధాని మోదీ చేసిందేమిటంటూ సూటి ప్రశ్న
ABN, First Publish Date - 2023-09-16T18:39:30+05:30
‘ఇండియా’ కూటమి ఇటీవల 14 మంది న్యూస్ యాంకర్లను బాయ్కాట్ చేస్తూ ఓ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ న్యూస్ యాంకర్ల షోలకు తమ ప్రతినిధుల్ని పంపకూడదని, అలాగే తమ పొలిటికల్ కార్యకలాపాలకు...
‘ఇండియా’ కూటమి ఇటీవల 14 మంది న్యూస్ యాంకర్లను బాయ్కాట్ చేస్తూ ఓ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ న్యూస్ యాంకర్ల షోలకు తమ ప్రతినిధుల్ని పంపకూడదని, అలాగే తమ పొలిటికల్ కార్యకలాపాలకు వాళ్లను పిలవకూడదని.. ఇండియా కూటమికి చెందిన ఓ సబ్-గ్రూప్ నిర్ణయించింది. ఈ అంశంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతోంది. ముఖ్యంగా.. బీజేపీ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బాగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియా’ కూటమి నాజీల తరహాలో జర్నలిస్టులపై బెదిరింపులకు పాల్పడుతోందంటూ ఆరోపించారు.
ఇందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్విటర్ (X ప్లాట్ఫామ్) మాధ్యమంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “మిస్టర్ జేపీ నడ్డా.. ప్రధాని మోదీ గత పదేళ్ల నుంచి ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించకుండా, ప్రతీ భారతీయ జర్నలిస్ట్ను బాయ్కాట్ చేశారు’’ అంటూ సిద్ధరామయ్య పేర్కొన్నారు. అలాంటప్పుడు.. ఒక రాజకీయ పార్టీకి డప్పు కొడుతూ, మీడియా నైతికతతో రాజీపడిన 14 మంది జర్నలిస్టులను బహిష్కరించడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. అంతేకాదు.. అసలు మీడియాపై దాడి అంటే ఏంటో తాము ఒక అసలైన డేటాను ఇస్తామన్నారు. బహుశా మీరు మర్చిపోయినా.. ఇండియా కూటమి ఎప్పుడూ మర్చిపోదని చెప్పారు.
నిజాలు మాట్లాడిన పాపానికి.. సిద్ధిఖ్ కప్పన్, మహమ్మద్ జుబేర్, అజిత్ ఓఝా, జస్పాల్ సింగ్, సాజద్ గుల్, కిశోర్చంద్ర వాంగ్ఖేన్, ప్రశాంత్ కానోజా వంటి జర్నలిస్టులను అరెస్ట్ చేశారని సిద్ధరామయ్య మండిపడ్డారు. అలాగే.. రాకేశ్ సింగ్, శుభమ్ మణి త్రిపాఠి, జీ మోసెస్, పరాగ్ భుయాన్, గౌరి లింకేశ్ వంటి జర్నలిస్టులను అన్యాయంగా చంపేశారని తెలిపారు. గతంలో పోలిస్తే.. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతీయ మీడియా స్థానం దిగజారుతూ వచ్చిందంటూ సిద్ధరామయ్య ఒక జాబితాను విడుదల చేశారు. 2015లో మీడియా 136వ స్థానంలో ఉంటే.. 2019లో 140వ స్థానం, 2022లో 150వ స్థానం, ఇప్పుడు 2023లో 161వ స్థానానికి పడిపోయిందని చురకలంటించారు.
కాగా.. అంతకుముందు 14 మంది జర్నలిస్టులను ఇండియా కూటమి బ్యాన్ చేయడంపై జేపీ నడ్డా మాట్లాడుతూ.. ‘‘ఈరోజుల్లో ఇండియా కూటమి కేవలం రెండే రెండు పనులు చేస్తోంది. సనాతన ధర్మాన్ని అవమానించడం, మీడియాను బెదిరించడం. నాజీల తరహాలో కొందరు జర్నలిస్టులను టార్గెట్ చేసుకొని, వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీల్లో ఎమర్జెన్సీ యుగం మైండ్సెట్ సజీవంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య మండిపడుతూ.. పైవిధంగా కౌంటర్ వేస్తూనే, పెద్ద చిట్టా విప్పారు. మరి, ఇందుకు బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో?
Updated Date - 2023-09-16T18:39:30+05:30 IST