Parliament Security Breach: సెక్యూరిటీ పోస్ట్ భర్తీకి కేంద్రం నిర్ణయం.. రాష్ట్రాలకు లేఖ
ABN, Publish Date - Dec 18 , 2023 | 02:52 PM
లోక్సభలో భద్రతా ఉల్లంఘనపై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవనం సెక్యూరిటీ ఇన్చార్జి నియామకానికి నిర్ణయించింది. జాయింట్ సెక్రటరీ (సెక్యూరిటీ) పోస్ట్ కోసం సీనియర్ సివిల్ సర్వెంట్ల పేర్లు ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
న్యూఢిల్లీ: లోక్సభలో భద్రతా ఉల్లంఘన (Lok sabha security breach)పై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవనం సెక్యూరిటీ ఇన్చార్జి నియామకానికి నిర్ణయించింది. జాయింట్ సెక్రటరీ (సెక్యూరిటీ) పోస్ట్ కోసం సీనియర్ సివిల్ సర్వెంట్ల పేర్లు ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఈనెల 14న అన్ని రాష్ట్రాలకు (కేంద్రపాలిత ప్రాంతాలు, గోవా, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ మినహా) 10 లైన్ల లేఖ రాసింది. అర్హత కలిగిన, ఆసక్తి ఉన్న ఐపీఎస్ అధికార్ల నామినేషన్లు పంపాలని ఆ లేఖలో రాష్ట్రాలను హోం శాఖ కోరింది.
కాగా, జాయింట్ సెక్రటరీ (సెక్యూరిటీ) పోస్టు సుమారు రెండు నెలలుగా ఖాళీగా ఉంది. చివరిసారిగా ఉత్తరప్రదేశ్కు చెందిన 1997 బ్యాచ్ అధికారి రఘుబీర్ లాల్ ఈ బాధ్యతలు చేపట్టారు. ఆయన గత నవంబర్ మొదట్లో తన సొంత రాష్ట్రానికి బదిలీ అయ్యారు. ఈనెల 13న పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో గ్యాలరీ నుంచి సాగర్ శర్మ అనే వ్యక్తి లోక్సభలోకి దూకి నానా హంగామా చేయడం, ఇదే సమయంలో విజిటర్స్ గ్యాలరీలో ఉన్న డి.మనోరంజన్ అనే వ్యక్తి గ్యాస్ డబ్బాలను విసరడం సంచలనమైంది. వీరితో పాటు దాదాపు ఇదే సమయంలో పార్లమెంటు వెలుపల స్మోక్ క్యానిస్టర్లతో నిరసనకు దిగిన నీలందేవి, అమోల్ షిండేలను భద్రతా సిబ్బంది, పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న లలిత్ ఝాను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరినీ ఏడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు ఆదేశించింది.
Updated Date - Dec 18 , 2023 | 02:52 PM