Flu alert: పంజా విసురుతోంది! జాగ్రత్త లేకపోతే..!
ABN, First Publish Date - 2023-03-24T14:25:41+05:30
కొవిడ్ తగ్గింది. ఎవరికి వారు జాగ్రత్తలను గాలికి వదిలేశారు. ఫంక్షన్లు పెరిగాయి. రద్దీ ప్రాంతాల్లో మునుపటి మాదిరిగా తిరుగుతున్నారు. భౌతిక దూరం, పరిశుభ్రత పాటించకపోవడంతో
వైరల్ ఫీవర్లతో జనం సతమతం
జ్వరం, తలనొప్పి, బాడీపెయిన్స్, గొంతునొప్పితో ఇబ్బంది
కొందరిలో వారం, రెండు వారాల వరకు ప్రభావం
భౌతికదూరం లేకే కేసులు..
హైదరాబాద్ సిటీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ తగ్గింది. ఎవరికి వారు జాగ్రత్తలను గాలికి వదిలేశారు. ఫంక్షన్లు పెరిగాయి. రద్దీ ప్రాంతాల్లో మునుపటి మాదిరిగా తిరుగుతున్నారు. భౌతిక దూరం, పరిశుభ్రత పాటించకపోవడంతో ఫ్లూ జడలు విచ్చుకుంటోంది. ఇలాంటి వాతావరణంతో జనంపై పంజా విసురుతోంది. సాధారణంగా ఫ్లూ పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది. ఈసారి ఫ్లూ భిన్నంగా వస్తోంది. బాధితులు నీరసించి పోతున్నారు. సత్తువ ఉండడం లేదు. విపరీతమైన గొంతునొప్పి, తలనొప్పి, బాడీపెయిన్స్, జలుబు, దగ్గు, విరేచనాలు, జ్వరంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఎవరికి వారే పారాసిటమాల్ వేసుకుంటున్నారు. అయితే, కొందరిలో తగ్గితూ, మరి కొందరిలో పెరుగుతోంది.
హై ఫీవర్తో..
ఫీవర్ వచ్చిన మొదటి రోజునే 103 నుంచి 104 డిగ్రీల సెల్సియస్ వరకు జ్వరం తీవ్రత ఉంటోంది. దీంతో వారికి వెంటనే మెడిసిన్ ఇచ్చి జ్వరం తగ్గించాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు. ఓపీలో 90 శాతం జ్వరాలకు సంబంధించిన కేసులు ఉంటున్నాయి. అప్పటికే ఉన్న ఇతర జబ్బుల కారణంగా చాలామంది వైరల్ ఫీవర్లతో ఇబ్బంది పడుతున్నారు.
సగానికి మించి వైరల్ ఫీవర్లే..
గ్రేటర్లో జ్వరాలతో ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య గతంలో కంటే రెట్టింపు అయింది. ఫీవర్ ఆస్పత్రికి ఓపీ కేసులు బాగా పెరిగాయి. రోజూ 500 మందికి మించి ఓపీ ఉంటోంది. ఫ్లూ, గొంతునొప్పి, శరీరపు నొప్పులు, విరేచనాలు, జ్వరంతో ఎక్కువగా వస్తున్నారని వైద్యులు తెలిపారు. ఇక ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు 2వేలకు మించి కేసులు ఉంటున్నాయి. ఇందులో సగానికంటే ఎక్కువ కేసులు వైరల్ ఫీవర్లవే. నిలోఫర్ ఆస్పత్రిలో పిల్లల ఓపీ పెరిగింది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, వాంతులు, విరోచనాలు, నుమోనియా, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులతో జనం క్యూ కట్టారు. ఇక కార్పొరేట్ ఆస్పత్రుల ఓపీ విభాగాలలో 90 శాతం వైరల్ ఫీవర్లే ఉంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులలో ఓపీ కేసులలో జ్వరాలకు సంబంధించి 60 శాతం, ఇతరాత్ర కేసులు 10 నుంచి 20 శాతం వరకు ఉంటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
రద్దీలో తిరగడం వల్లనే..
చాలా మంది రద్దీ ప్రాంతాల్లో ఎక్కువగా తిరగడం వల్ల ఫ్లూ సోకుతుంది. వైరల్ ఫీవర్లు పెరగడానికి ఇన్ఫ్లూంజా హెచ్3, ఎన్2 కారణం కావచ్చు. గతంలో కంటే కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి డాక్టర్ 10 నుంచి 15 కేసులను పరిశీలిస్తున్నారు. ఇది సీజన్ కాదు. కానీ, ఫ్లూ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మధుమేహం, కేన్సర్, కిడ్నీ బాధితులు రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలి. మాస్కులు ధరించాలి.
- డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, సీనియర్ జనరల్
ఫిజీషియన్, మెడికవర్ ఆస్పత్రి
లక్షణాలను బట్టి పరీక్ష..
ఓపీలో 30 నుంచి 40 శాతం ఫ్లూ కేసులే కనిపిస్తున్నాయి. బాధితులు తమ లక్షణాలను బట్టి పరీక్షలు చేయించుకోవాలి. బాధితులు ఏ రకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారో, నిర్ధారించుకుని దాని ప్రకారం మందులు వాడాలి.
- ప్రశాంత్ చంద్ర, ఇంటర్నల్ మెడిసిన్, కేర్ ఆస్పత్రి
Updated Date - 2023-03-24T14:25:41+05:30 IST