AP News: 3,4 తేదీల్లో వడగాడ్పులు
ABN, First Publish Date - 2023-06-02T21:17:09+05:30
రాష్ట్రంలో రోహిణి కార్తెలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రతకు ఉక్కపోత తోడుకావడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
విశాఖపట్నం: రాష్ట్రంలో రోహిణి కార్తెలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రతకు ఉక్కపోత తోడుకావడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం పది మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 105 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. అనేకచోట్ల 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి, టి.నరసాపురం, విజయనగరం జిల్లా కొత్తవలస, ప్రకాశం జిల్లా కొనకమిట్లలో 44.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, శనివారం 256, ఆదివారం 127 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తులు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శనివారం అల్లూరి సీతారామరాజు, కడప, అనకాపల్లి, అనంతపురం, బాపట్ల, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. కాగా, శుక్రవారం రుతుపవనాలు మాల్డీవులు, అరేబియా, బంగాళాఖాతంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. ఎండ తీవ్రత, సముద్రం మీదుగా వస్తున్న గాలులతో వాతావరణ అనిశ్చితి నెలకొని అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Updated Date - 2023-06-02T21:17:09+05:30 IST