Educational Facilities : తాగునీరు లేదు.. టాయ్లెట్లు లేవు!
ABN, Publish Date - Feb 19 , 2025 | 05:25 AM
‘‘హైదరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో బోలెడు సమస్యలున్నాయి. ఐదేళ్లకోసారి పాలకులు మారుతున్నా విద్యా సంస్థల్లోని ఇబ్బందులు తీరడం లేదు. ఒకచోట తాగునీటి
మధ్యాహ్న భోజనం బాగుండడం లేదు.. తినలేకపోతున్నాం
ఉపాధ్యాయుల కొరతతో సిలబస్ పూర్తి కావడం లేదు
కళాశాలల్లో లెక్చరర్లు, ల్యాబ్ల కొరత.. ప్రాక్టికల్స్ లేవు
రాష్ట్ర విద్యా కమిషన్కు తెలిపిన విద్యార్థులు, ఎన్జీవోలు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి18 (ఆంధ్రజ్యోతి): ‘‘హైదరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో బోలెడు సమస్యలున్నాయి. ఐదేళ్లకోసారి పాలకులు మారుతున్నా విద్యా సంస్థల్లోని ఇబ్బందులు తీరడం లేదు. ఒకచోట తాగునీటి కోసం తండ్లాట.. మరోచోట మరుగుదొడ్ల లేక అవస్థలు.. ఇంకోచోట టీచర్ల కొరత.. ఇలా చెప్పుకుంటే పోతే చాలా సమస్యలున్నాయి’’అని విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు తెలంగాణ విద్యాకమిషన్ ఎదుట మొర పెట్టుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో కనీస విద్య అందడం లేదని, హైస్కూళ్లు, కాలేజీల్లో నైపుణ్య విద్య కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో నిధులు కేటాయించి.. సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో సభ్యులు పీఎల్ విశ్వేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, జ్యోత్స జిల్లాలవారీగా పర్యటిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి అధ్యక్షతన బహిరంగ విచారణ చేపట్టారు. వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తమ సమస్యలను కమిటీ సభ్యులకు తెలియజేశారు.
పలువురు ప్రస్తావించిన సమస్యలు
ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజు రెగ్యులేటరీ కమిటీలను నియమించాలి.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగుపరచాలి. ఉదయం అల్పాహారం అందించాలి.
స్కూళ్లు, కాలేజీల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు సిబ్బందిని నియమించాలి.
విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్లను అందజేయాలి. అమ్మాయిల సమస్యలను తెలియజేసేందుకు ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలి.
హైస్కూళ్లు, కాలేజీల్లో పీఈటీలు, పీడీ పోస్టులను భర్తీ చేసి, ఆట స్థలాలను ఏర్పాటు చేయాలి.
షిఫ్ట్ విధానాన్ని ఎత్తివేసి ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 వరకు తరగతులు పెట్టాలి.
సైన్స్, డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలి.
హాజరుశాతం పెంచేందుకు పేరెంట్స్ కమిటీ సమావేశాన్ని ప్రతినెల నిర్వహించాలి.
కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూయేషన్ (సీసీఈ) విధానాన్ని ఎత్తివేయాలి.
నాణ్యమైన విద్య అందించాలి: మురళి
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సూచిం చారు. తాము దాదాపు 260 విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకున్నామ ని చెప్పారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రాయడం, మాట్లాడడం రావాలన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి, ఇంటర్ విద్యాధికారి వడ్డెన్న పాల్గొన్నారు.
అన్నం నీలం రంగులో..
మా స్కూల్లో మధ్యాహ్న భోజనం బాగుండడం లేదు. కొన్నిసార్లు అన్నం నీలిరంగులో ఉంటుండడంతో చాలామంది తినడం లేదు. ఒకసారి సాంబారులో ఈగలు కనిపించాయి. మాకు హిందీ టీచర్ లేరు.
- ప్రజ్వల్, జీహెచ్ఎ్స (నంబర్-1), అమీర్పేట్
సైన్స్ ల్యాబ్ లేదు
పుస్తకాల బ్యాగు బరువు ఎక్కువగా ఉండడంతో మెడ, నడుం కండరాల నొప్పికి గురవుతున్నాం. పుస్తకాల సైజు తగ్గించి, డిజిటల్ బోధనకు కృషి చేయాలి. మా స్కూల్లో సైన్స్ ల్యాబ్ లేదు. సరిపడా టీచర్లు లేరు.
- నిఖిల్, జీహెచ్ఎ్స, బోరబండ
కాలేజీల్లో భోజనం అందించాలి
పాఠశాలల్లో మాదిరిగా కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. ఉదయం పూట అల్పాహారం అందించాలి. తాగునీటి సమస్యలను పరిష్కరించాలి.
- తులసి, సీఈసీ ఫస్టియర్,
న్యూ గవర్నమెంట్ కాలేజీ, మలక్పేట్
సర్కారీ విద్యపై నమ్మకం పోతోంది
చాలా ప్రభుత్వ కాలేజీల్లో సైన్స్ ల్యాబ్లు లేవు. మా కాలేజీ విద్యార్థులకు ప్రయోగాలంటే తెలియదు. పరీక్షల్లో వేరే చోటకు తీసుకెళ్లి హాజరువేసి మార్కులు ఇస్తున్నారు. సర్కారు కళాశాలలపై నమ్మకం పోతోంది.
- సయ్యద్ కరీం, బీపీసీ, సెకండియర్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, చంచల్గూడ
నర్సింగ్ కాలేజీకి గుర్తింపు లేకున్నా...
హుమాయున్నగర్లోని నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్కు ప్రభుత్వ గుర్తింపు లేకున్నప్పటికీ దర్జాగా నడిపిస్తున్నారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో కూర్చునే ఓ అధికారి ఈ కాలేజీ పేరు చెప్పి పంపిస్తున్నారు. ఈ కాలేజీకి రోజు ఆహారం కూడా ఉస్మానియా ఆస్పత్రి నుంచి వస్తుందని చెబుతున్నారు. నర్సింగ్ పాసైన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారు.
- లుబ్నా సర్వత్, సామాజిక కార్యకర్త
డేటా ఎంట్రీకే పరిమితం
కొంతకాలంగా డీఈవోలపై పనిభారం పెరిగింది. వివిధ కార్యక్రమాల వల్ల డేటా ఎంట్రీ ఆ పరేటర్లుగా పనిచేయాల్సి వస్తోంది. రోజంతా ఆఫీసులో కూర్చుని ఫైల్స్ క్లియర్ చేయడమే పనిగా మారింది. స్కూళ్లను పర్యవేక్షించలేకపోతున్నాం.
- రోహిణి, జిల్లా విద్యాశాఖాధికారి
Also Read:
నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్టెల్కు గట్టి
మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు..
2 విడతల్లో డీఏ..? భారీ పెరగనున్న పెన్షన్లు, జీతాలు..!
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Feb 19 , 2025 | 05:25 AM