SLBC Tunnel Collapse: అడుగడుగునా అవాంతరాలు
ABN, Publish Date - Feb 25 , 2025 | 05:28 AM
సహాయక బృందాలకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. టన్నెల్ పైకప్పు కూలిన ప్రమాద స్థలం చాలా దూరంలో ఉండటంతో శకలాలు, మట్టి దిబ్బలు, బురద తొలగింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కావడంలేదు.
టన్నెల్లో తొలగని బురద.. మరింత పెరిగిన ఊటనీరు
బయటకు పంపేందుకు పనిచేయని కన్వేయర్ బెల్టు
పొక్లెయినర్ పంపినా మట్టి, రాళ్లు తరలించే వ్యవస్థ కరువు
13.62 నుంచి 13.63 కి.మీ. వరకు వీక్జోన్గా నిర్ధారణ
సహాయక చర్యల్లో ర్యాట్హోల్ మైనర్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
ఫుష్ కెమెరాలు, ప్రోబోస్కో్పలతో గ్యాప్లు గుర్తించే ప్రక్రియ
అర్ధరాత్రి నుంచి రాళ్ల తొలగింపు ప్రారంభమయ్యే అవకాశం
మహబూబ్నగర్/అచ్చంపేట/దోమలపెంట, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు వేగంగా సాగడంలేదు. సహాయక బృందాలకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. టన్నెల్ పైకప్పు కూలిన ప్రమాద స్థలం చాలా దూరంలో ఉండటంతో శకలాలు, మట్టి దిబ్బలు, బురద తొలగింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కావడంలేదు. సొరంగంలో ఇంకా 2.5 మీటర్ల మేర బురద అలాగే ఉండటంతో అక్కడి నుంచి ఘటనా స్థలం వద్దకు నడవడం చాలా కష్టంగా మారింది. పైగా, ఆదివారంతో పోల్చితే ఊటనీరు మరింత పెరిగింది. ఇప్పటికీ నిమిషానికి దాదాపు 3500 లీటర్ల చొప్పున నీరు ఉబికి వస్తుండటంతో నిల్వ పేరుకుపోతోంది. 13 కిలోమీటర్ల లోపలి నుంచి దాదాపు ఐదు దశలుగా డీ వాటరింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. సోమవారం మరో 100 హెచ్పీ మోటార్ను ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్లోని సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం రప్పించారు. అయితే శనివారం రాత్రే రెస్క్యూ ఆపరేషన్ పనులు ప్రారంభమైనా.. ఇప్పటివరకు యాక్షన్ ప్లాన్ కొలిక్కి వచ్చినట్లు కనిపించడంలేదు. లోపల ఉన్న పరిస్థితులపై పూర్తి అవగాహన రాకుండా చర్యలు చేపడితే మళ్లీ టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే పక్కాగా ప్రణాళికలు చేసుకొని సహాయక చర్యల్లో వేగం పెంచే యోచనలో ఉన్నాయి.
పూర్తిస్థాయి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు సహాయక బృందాలు సోమవారం మధ్యాహ్నం 3.40 గంటలకు పూర్తి ప్రణాళికతో టన్నెల్ లోపలికి వెళ్లాయి. ఉదయం కొంతమంది, మధ్యాహ్నం మరికొంత మంది చొప్పున దాదాపు 35 మంది కార్మికులు లోపల గ్యాస్ కట్టర్లతో ఐరన్ షీట్లు, పైపులు, చువ్వలను తొలగిస్తున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేకంగా తయారుచేసిన వ్యాగన్ ట్రాలీలో ప్రొక్లెయిన్ను లోపలికి పంపించారు.
ప్రధాన సమస్యగా కన్వేయర్ బెల్టు..
సొరంగంలో టీబీఎం పనిచేస్తున్నప్పుడు వచ్చే మట్టి, రాళ్లను బయటకు తరలించేందుకు టన్నెల్ పొడవునా కన్వేయర్ బెల్టు ఉంది. అయితే రెండుసార్లు సొరంగంలో మట్టి దిబ్బలు కూలడంతో 2 కి.మీ. మేర కన్వేయర్ బెల్టు పూర్తిగా దెబ్బతిన్నది. అయినా.. ప్రస్తుతం అక్కడ పేరుకుపోయిన మట్టి, రాళ్లు, బురద, ఇనుప చువ్వలు, ఐరన్షీట్లు, పైపులను బయటకు తరలించడానికి ఉన్న ఏకైక మార్గం కన్వేయర్ బెల్టు మాత్రమే. ట్రెయిన్ కూడా 12 కి.మీ. వద్దకే వెళుతోంది. అక్కడి నుంచి బురద పేరుకుపోయింది. ప్రొక్లెయినర్ వెళ్లినా బురద క్లియర్ కాకుండా పనులు చేపట్టే అవకాశం లేదని ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మట్టి, రాళ్లు, బురద తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. కానీ, కచ్చితంగా కన్వేయర్ బెల్టు పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందని తెలుస్తోం ది. కాగా, చిన్న చిన్న సందుల్లో కూడా దూరిపోయి ఎలుకల్లాగా రెస్క్యూ ఆపరేషన్లు చేయగలిగి, ఉత్తరాఖండ్ ప్రమాదంలో విజయవంతంగా ప్రాణాలు కాపాడటంలో సహాయపడిన ర్యాట్ హోల్ మైనర్స్ను ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దింపింది. అయితే ఇందుకోసం కూడా మట్టి దిబ్బల మధ్య గ్యాప్లను గుర్తించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో ఉపయోగించిన ఫుష్ క్యామ్, ప్రొబోస్కోప్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించనున్నారు. దాదాపు ఉన్నచోటు నుంచి 100-150 మీటర్ల వరకు గ్యాప్లను గుర్తించి 360 డిగ్రీల వ్యూతో అటువైపు గ్యాప్ల పరిస్థితిని తెలుసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది. ఉత్తరాఖండ్ ప్రమాదంలోనూ ఈ టెక్నాలజీ విజయవంతంకావడంతో పిలిపించారు. ఎల్అండ్టీ కంపెనీకి చెందిన నలుగురు, సొలినాస్ కంపెనీకి చెందిన ఇద్దరు సాయంత్రం 3.40 గంటలకు టన్నెల్ లోపలికి వెళ్లారు. వారు పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాతే ప్రణాళికను రచించనున్నారు.
రెస్క్యూ ఆపరేషన్ ఇలా..
ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు లోపలికి వెళ్లిన సహాయక బృందాలు రాత్రి 7:30 గంటలకు తిరిగి వచ్చాయి. ఆదివారం రాత్రి 12 గంటలకు లోపలికి వెళ్లిన మరో బృందం సోమవారం ఉదయం 7:30 గంటలకు తిరిగి వచ్చింది. సహాయక చర్యలు ప్రారంభమైనప్పటి నుంచి ఏడు మార్లు బృందాలు లోపలికి వెళ్లి బయటకు వచ్చాయి.
సోమవారం ఉదయం 7:30 గంటలకు 16 మంది కార్మికులను లోపలికి తరలించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:15 గంటలకు మరో 15 మంది కార్మికుల బృందాన్ని తీసుకెళ్లారు.
ఉదయం 10 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్రెడ్డి, బాలునాయక్ వచ్చారు. పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. రెస్క్యూ ఆపరేషన్లో వేగం పెంచడానికి రాబిన్ కంపె నీ ప్రతినిధులతో మాట్లాడి అమెరికా నుంచి నిపుణులను పంపించాలని సూచించారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రొక్లెయినర్ను లోపలకు తీసుకెళ్లడానికి వీలుగా ట్రాలీ వ్యాగన్ చుట్టూ మరికొన్ని అమరికలు బిగించారు.
సాయంత్రం 3.40 గంటలకు 26 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జియోలాజిస్టు, ఎల్అండ్టీ, సొలినాస్ కంపెనీ ప్రతినిధుల బృందం లోపలికి వెళ్లింది.
సాయంత్రం 4.20 గంటలకు ట్రెయిన్ ట్రాలీపై ప్రొక్లెయినర్, జనరేటర్ను లోపలికి పంపించారు.
ఆ 10 మీటర్లు ఇప్పటికీ ప్రమాదమే..
ప్రస్తుతం టన్నెల్ లోపల 12 కి.మీ. వరకు ట్రెయిన్ వెళ్తోంది. ఆ తర్వాత మొత్తం తడకలు, థర్మకోల్ తెప్పల సాయంతో ముందుకు వెళ్లాల్సివస్తోంది. అలా వెళ్లిన కార్మికులు కటింగ్ పనులు చేస్తున్నారు. అయితే కంపెనీ ఇచ్చిన జియోలాజికల్ సర్వే ప్రకారం 13.622 కి.మీ. నుంచి 13.633 కి.మీ. వరకు.. మధ్యలో 10 మీటర్లు ఇప్పటికీ సున్నితంగానే ఉన్నట్లుగా, దీనిని వీక్ జోన్గా గుర్తించారు. అదే ఇప్పుడు తొలగింపు ప్రక్రియ వేగంగా జరగకుండా అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. లోపలి నుంచి కమ్యూనికేషన్ కోసం ట్రెయిన్కు ప్రత్యేకంగా యాంటినా సెట్ను అమర్చి తీసుకెళ్లారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోయినా ఇబ్బంది కాకుండా ఉండేందుకు జనరేటర్ను కూడా తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్ పిటిషన్పై తీర్పు రిజర్వ్..
TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Feb 25 , 2025 | 05:28 AM