కీసర ఆర్డీవోగా వెంకట ఉపేందర్రెడ్డి
ABN, Publish Date - Jan 11 , 2025 | 12:16 AM
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర డివిజన్ ఆర్డీవోగా వెంకట ఉపేందర్రెడ్డి తిరిగి బదిలీపై రావడం అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
మేడ్చల్ ప్రతినిధి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర డివిజన్ ఆర్డీవోగా వెంకట ఉపేందర్రెడ్డి తిరిగి బదిలీపై రావడం అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వెంకట ఉపేందర్రెడ్డి బదిలీ అయిన రెండు నెలల్లోనే తిరిగి అదే స్థానంలోకి రావడం.. తెరవెనుక ప్రభుత్వంలో కీలక నేతకు అత్యంత సన్నిహితుడు చక్రం తిప్పినట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2024 అక్టోబరు 28న వెంకట ఉపేందర్రెడ్డి కీసర డివిజన్ నుంచి సిరిసిల్లకు బదిలీపై వెళ్లారు. మేడ్చల్ జిల్లా భూసేకరణ విభాగం అధికారి సైదులు కీసర డివిజన్ ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు. తిరిగి సైదులును సిరిసిల్లకు బదిలీ చేయగా, సిరిసిల్ల నుంచి వెంకట ఉపేందర్రెడ్డి కీసరకు బదిలీపై వచ్చారు. దీనివెనుక ప్రభుత్వంలోని ఓ కీలక నేతకు అత్యంత సన్నిహితుడు చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు నెలల్లోనే తనను బదిలీ చేయడంపై కీసర ఆర్డీవో సైదులు తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు కూడా కిమ్మనకుండా ఉండటం గమనార్హం. వెంకట ఉపేందర్రెడ్డి గతంలో కీసర తహసీల్దార్గా కూడా పనిచేశారు.
Updated Date - Jan 11 , 2025 | 12:16 AM