రెండు ఇసుక ట్రాక్టర్ల సీజ్
ABN, Publish Date - Feb 02 , 2025 | 11:41 PM
ధారూరు అటవీ రేంజ్ పరిధి గుండా అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు రేంజర్ రాజేందర్ అదివారం తెలిపారు.
ధారూరు, పిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ధారూరు అటవీ రేంజ్ పరిధి గుండా అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు రేంజర్ రాజేందర్ అదివారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. రేంజ్ పరిధిలోని రాస్నం అటవీ ప్రాంతం నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గస్తీ తిరుగుతున్న ఎఫ్బీవో వీరబాబు, సిబ్బంది ఒమేర్, శ్రీధర్లు ట్రాక్టర్లను పట్టుకున్నారు. యాలాల మండలం, దేవనూర్ గ్రామానికి చెందిన పాషా, నరేందర్లు అనుమతులు లేకుండా దేవనూర్ వాగు నుంచి ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా అటవీ ప్రాంతం గుండా ధారూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని రేంజ్ కార్యాలయానికి తరలించారు. జిల్లా అటవీశాఖ అధికారికి నివేదిక పంపించి తదుపరి చర్యలు తీసుకుంటామని రేంజర్ రాజేందర్ వివరించారు.
Updated Date - Feb 02 , 2025 | 11:41 PM