Malakpet: ఆడపడుచే చంపేసింది
ABN, Publish Date - Mar 06 , 2025 | 05:59 AM
హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు వినయ్, అతడి సోదరి కుమారుడు నిహాల్ సహకరించారని నిర్ధారించారు. ఏసీపీ శ్యామ్ సుందర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మలక్పేటలో శిరీష (34), ఆమె భర్త వినయ్ ఉంటున్నారు.
తరచూ శిరీష ఉద్యోగం మానేయడంపై సరిత నిలదీత.. ఇద్దరి మధ్య గొడవ
వివాహేతర బంధాల చిట్టా విప్పుతానని ఆడపడుచు సరితను హెచ్చరించిన శిరీష
శిరీషకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. ముఖంపై దిండు అదిమి హత్యచేసిన సరిత
చాదర్ఘాట్, మార్చి 5(ఆంధ్రజ్యోతి): నర్సు ముగాల శిరీష (34)ను చంపింది ఆమె భర్త వినయ్ కుమార్ కాదు.. ఆమె ఆడపడుచు సరిత అని పోలీసులు తేల్చారు. హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు వినయ్, అతడి సోదరి కుమారుడు నిహాల్ సహకరించారని నిర్ధారించారు. ఏసీపీ శ్యామ్ సుందర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మలక్పేటలో శిరీష (34), ఆమె భర్త వినయ్ ఉంటున్నారు. వినయ్ సోదరి సరిత తన భర్త లక్ష్మణ్ ఓమన్లో ఉండటంతో వీరి వద్దే ఉంటోంది. వినయ్, సరిత సోదరి గీత కుమారుడు, డిగ్రీ చదువుతున్న నిహాల్ కూడా వీరితోనే ఉంటున్నాడు. నర్సుగా తరచూ ఆస్పత్రులు మారుతుండటంతో శిరీషను ఇంట్లో శనివారం రాత్రి సరిత మందలించింది. ఇద్దరూ వినయ్, నిహాల్ సమక్షంలోనే గొడవ పడ్డారు. ఒకదశలో సహనం కోల్పోయిన శిరీష.. ‘నీ వివాహేతర సంబంధాల చరిత్రను నీ భర్త లక్ష్మణ్కు చెబుతా’నంటూ సరితను బెదిరించింది. కోపంతో ఊగిపోయిన సరిత ఆమెపై దాడికి దిగింది. కొద్దిసేపటికి ఇద్దరూ శాంతించి.. పరస్పరం క్షమాపణలు చెప్పుకున్నారు. కొద్దిసేపటికి శిరీష, సరిత వద్దకొచ్చి.. నిద్రపట్టడం లేదని, ఏదైనా మాత్ర ఉంటే ఇవ్వాలని అడిగింది. ఇదే అదనుగా భావించిన సరిత.. మిడాజోలమ్ అనే మత్తు ఇంజెక్షన్ను మోతాదుకు మించి శిరీషకు ఇచ్చింది. కొద్దిసేపటికే గాఢ నిద్రలోకి జారుకున్న శిరీషను ముఖమ్మీద దిండు పెట్టి.. ఊపిరాడకుండా చేసి చంపింది. ఉదయం విషయాన్నంతా వినయ్, నిహాల్కు వివరించింది.
ముగ్గురూ కలిసి.. శిరీష హత్యను గుండెపోటు మృతిగా చిత్రీకరించాలనుకున్నారు. శిరీషకు గుండెపోటు వచ్చిందని.. తానే సీపీఆర్ చేశానంటూ సరిత ఫోన్ చేసి అంబులెన్స్ను పిలిపించింది. అందులో మృతదేహాన్ని ఎక్కించుకొని ముగ్గురూ మలక్పేట మెట్రో క్యూర్ ఆస్పత్రికి బయలుదేరారు. అయితే దారిలోనే శిరీష మృతిచెందినట్లు ఆస్పత్రి వారికి ఫోన్ చేశారు. శిరీష గుండెపోటుతో చనిపోయిందని ఆమె మేనమామ మధుకర్కు ఫోన్ చేసి చెప్పారు. అనుమానించిన ఆయన వెంటనే మలక్పేటలోని మెట్రో క్యూర్ ఆస్పత్రికి వెళ్లగా.. అప్పటికే మృతదేహాన్ని అంబులెన్స్లో సొంతూరైన నాగర్కర్నూల్ జిల్లా దోమల పెంటకు తీసుకెళ్తున్నట్లుగా తెలుసుకున్నాడు. వెంటనే ఘటనపై ఆయన చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు వినయ్కు ఫోన్ చేసి.. అంబులెన్స్ను వెనక్కి పిలిపించారు. శిరీష మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నివేదికలో ఆమె హత్యకు గురైందని తేలింది. సరిత, వినయ్, నిహాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - Mar 06 , 2025 | 05:59 AM