భూమికి భూమి ఇవ్వాలి
ABN, Publish Date - Jan 10 , 2025 | 12:59 AM
భూమికి భూమి ఇచ్చి, బహిరంగ మార్కెట్ ప్రకారం పరిహారం చెల్లించాలని త్రిపుల్ఆర్ నిర్వాసితులు డిమాండ్ చేశారు.
లేదా బహిరంగ మార్కెట్ ప్రకారం పరిహారం చెల్లించాలి
త్రిపుల్ఆర్ నిర్వాసితుల డిమాండ్
చౌటుప్పల్లో హైవేపై రాస్తారోకో
రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
చౌటుప్పల్ టౌన్, భువనగిరి రూరల్, జనవరి 9(ఆంధ్రజ్యోతి): భూమికి భూమి ఇచ్చి, బహిరంగ మార్కెట్ ప్రకారం పరిహారం చెల్లించాలని త్రిపుల్ఆర్ నిర్వాసితులు డిమాండ్ చేశారు. గురువారం చౌటుప్పల్ పట్టణంలోని 65వ నెంబరు జాతీయ రహదారిపై త్రిపుల్ ఆర్ నిర్వాసితులు ఐదారు నిమిషాలపాటు రాస్తారోకో చేశారు. దీంతో జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హైవేపై భైఠాయించిన భూ నిర్వాసితులను తొలగించి 10 నిమిషాల్లో వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. దీంతో ఆందోళనకు వచ్చిన మహిళలు విధుల్లో ఉన్న మహిళా పోలీ్సలతో వాగ్వాదానికి దిగారు. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు నిర్వాసితులను అక్కడినుంచి శాంతి యుతంగా పంపించి వేశారు. అంతకుముందు ఆర్డీవో కార్యాలయం ఎదుట చౌటుప్పల్, వలిగొండ మండలాలకు చెందిన త్రిపుల్ఆర్ నిర్వాసితులు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రిపుల్ఆర్లో కోల్పోయే భూమికి భూమి ఇవ్వాలని, లేదంటే బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు. లేదంటే అలైన్మెంట్ మార్చాలని భూ నిర్వాసితులు డిమాండ్చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మొహరించడంతో భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బూరుగు కృష్ణా రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, భూ నిర్వాసితుల ఐక్య వేదిక ఆర్గనైజర్ దబ్బటి రామ్ గౌడ్, భూ నిర్వాసితులు జి. సురేందర్ రెడ్డి, సందగళ్ల మల్లేశ్, జాల వెంకటేశ్, మారుపాక లింగం తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని, మొదటి గెజిట్ అలైన్మెంట్ ప్రకారమే ఆర్ఆర్ఆర్ నిర్మాణం చేపట్టాలని నిర్వాసిత రైతు ప్రతినిధులు తంగెళ్లపల్లి రవికుమార్, అవిశెట్టి పాండు యాదవ్, కె.భద్రయ్య, ధర్మేశ్ డిమాండ్ చేశారు.
భువనగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన
భువనగిరి మండలం రాయిగిరి, ఎర్రంబెల్లి, తుక్కాపురం, గౌస్నగర్, పెంచికల్ పహాడ్ గ్రామాలకు చెందిన ఆర్ఆర్ఆర్ నిర్వాసిత రైతులు గురువారం భువనగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అలైన్మెంట్ మార్చే వరకు తమ పోరాటాలు కొనసాగిస్తామన్నారు. 2022 ఆగస్టులో విడుదల చేసిన గెజిట్ ప్రకారమే ఆర్ఆర్ఆర్ నిర్మాణం చేపట్టే విధంగా జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపాలన్నారు. అనంతరం భువనగిరి ఆర్డీవో ఎం.కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. రైతులు ఎం.వెంకట్ రెడ్డి, గొర్ల వెంకటేశ్ పాల్గొన్నారు.
Updated Date - Jan 10 , 2025 | 12:59 AM