25 రోజులు మృత్యువుతో పోరాడి...
ABN, Publish Date - Feb 19 , 2025 | 12:51 AM
రోడ్డుప్రమాదంలో గాయపడి 25రోజులుగా మృత్యువుతో పోరాడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నుమూశాడు.
హుజూర్నగర్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): రోడ్డుప్రమాదంలో గాయపడి 25రోజులుగా మృత్యువుతో పోరాడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నుమూశాడు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎస్ఐ ముత్తయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్కు చెందిన మక్కెన శ్రీనికేతన్(24) తాత కట్టా భాస్కర్రావు మృతి చెందడంతో జనవరి 24న సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం శ్రీనివాసపురం గ్రామానికి అమ్మమ్మ వద్దకు వచ్చారు. అదేరోజు సాయంత్రం గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో కారులో పక్క గ్రామానికి వెళ్లి వస్తుండగా కారు అదుపు తప్పి పల్టీలు కొట్టి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఎడమవైపున కూర్చున్న శ్రీనివాసరావుకు గాయాలు కాగా, కారు నడుపుతున్న మక్కెన శ్రీనికేతన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వారిని హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి,, అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో చికిత్సపొందుతూ మంగళవారం శ్రీనికేతన్ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. శ్రీనికేతన్ కొన్నాళ్లు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశాడు. హైదరాబాద్లో పనిచేయాలనే ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. సుమారు 25రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెం దాడు. నెలరోజుల వ్యవధిలోనే తాత భాస్కర్రావు, మనవడు శ్రీనికేతన్ మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడి బంధువు కట్టా గోపాల్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
Updated Date - Feb 19 , 2025 | 12:51 AM