Mining Accidents: భద్రత లేదు.. భరోసా లేదు
ABN, Publish Date - Feb 25 , 2025 | 05:15 AM
అయినా సరే వారికి భద్రత ఉండదు. భరోసా ఉండదు. చివరికి ఇచ్చే కొద్దిపాటి జీతాలు కూడా సమయానికి ఇవ్వరు. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ప్రైవేటు కంపెనీల్లో మైనింగ్ పనుల్లో పాల్గొంటున్న కార్మికుల వెతలివి.
వెట్టి చాకిరి, భయం గుప్పిట్లో పని
మూడు నెలలకు అరకొర జీతం
ఓ కంపెనీలో వలస కార్మికుల వేదన
మహబూబ్నగర్, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మనిషి బతకడానికి అత్యవసరమైన ఆక్సిజన్ సరిగా ఉండని ప్రదేశంలో పని. అనుక్షణం ప్రమాదం అంచునే పని చేయాలి. అయినా సరే వారికి భద్రత ఉండదు. భరోసా ఉండదు. చివరికి ఇచ్చే కొద్దిపాటి జీతాలు కూడా సమయానికి ఇవ్వరు. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ప్రైవేటు కంపెనీల్లో మైనింగ్ పనుల్లో పాల్గొంటున్న కార్మికుల వెతలివి. ఇటీవల ఎస్ఎల్బీసీ టన్నెల్లో పని జరుగుతుండగా పైకప్పు కూలి 8 మంది అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారిని రక్షించడానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓ కంపెనీ ఈ టన్నెల్ నిర్మాణ పనులను చేపడుతోంది. ఇందులో కార్మికులు, హెల్పర్లు, ఆపరేటర్లు ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ- కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల నుంచి వచ్చారు. ఈ కంపెనీలో కార్మికులు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం వారిని పలకరించింది. సొంత ఊరిలో ఉపాధి లేక కట్టుకున్న వాళ్లని, కన్న పిల్లలను వదిలి ఇంత దూరం వస్తే కంపెనీలు తమతో వెట్టిచాకిరి చేయిస్తూ సరిగా వేతనాలు కూడా ఇవ్వడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు నెలకు రూ. 15 వేలు, కొంత టెక్నికల్ వర్క్ తెలిసిన ఆపరేటర్లు, హెల్పర్లకు మరో రూ. 2 వేల నుంచి రూ. 2500 వరకు అదనంగా జీతం ఇస్తున్నారు.
అయితే మూడు నెలలకు ఒకసారి ఒక నెల జీతం ఇవ్వడమో లేదా ఆరు నెలలకు ఒకసారి రెండు నెలల జీతం ఇవ్వడమో చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో కుటుంబసభ్యులకు డబ్బు పంపించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఉండేందుకు క్యాంపు వద్ద ఒక రేకుల షెడ్డు నిర్మించి ఇచ్చారు తప్ప వంట చేసుకునేందుకు కనీస సామగ్రి కూడా సమకూర్చలేదని వారు వాపోయారు. వంట సామగ్రి కోసం అడ్వాన్సులు ఇవ్వమని అడిగినా కంపెనీ చిల్లిగవ్వ కూడా ఇవ్వడంలేదని ఆవేదన చెందుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉండటంతో పాములు, ఇతర జంతువులు తరచూ ఇబ్బందులు పెడుతున్నాయని, కనీస వసతులు లేవని పేర్కొంటున్నారు. నిత్యం సవాళ్లతో కూడిన పనిచేయడానికి వెళ్తున్నప్పటికీ. సరైన రక్షణ చర్యలు కంపెనీ కల్పించడం లేదంటున్నారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదం నుంచి తప్పించుకుని భయం(ట్రామా)లో ఉన్నామని అయినా సరే పనిచేయాలని కంపెనీ ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చి ఇక్కడ ఎవరికీ చెప్పుకోలేక అవస్థలు పడుతున్నామన్నారు. ఇన్ని నెలలు పనిచేసి జీతం వదిలి వెళ్లలేక అలాగే పని చేస్తున్నామని ఆంధ్రజ్యోతికి తెలిపారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్ పిటిషన్పై తీర్పు రిజర్వ్..
TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Feb 25 , 2025 | 05:15 AM