పల్లీ రైతుకు మద్దతు ధర కల్పించాలి
ABN, Publish Date - Feb 01 , 2025 | 11:25 PM
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేయూతనివ్వడంలో విఫలం అయ్యిందని, పల్లీ రైతులకు మద్దతు ధర కల్పించాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు.
గద్వాల/గద్వాల న్యూటౌన్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేయూతనివ్వడంలో విఫలం అయ్యిందని, పల్లీ రైతులకు మద్దతు ధర కల్పించాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం గద్వాల వ్యవసాయమార్కెట్లో పల్లీ కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు లభిస్తున్న ధరను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసమర్థత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని, విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 412 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందేనన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని అన్నారు. వేరుశనగకు మద్దతు ధర రూ.6,783 ఉంటే వ్యాపారులు రూ. 3, 4 వేలలోపే ధర చెల్లిస్తుండ టంతో రైతులు పెట్టుబడి కూడా రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలో ఉంటే మద్దతు ధర కంటే మరో రూ. 3 నుంచి రూ. 4 వేల అధికంగా రెతులకు లాభం వచ్చేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు, నాగర్దొడ్డి వెంకట్రాములు, పటేల్ విష్ణువర్ధన్రెడ్డి, పటేల్ జనార్ధన్రెడ్డి, గంజిపేట రాజు, కుర్వ పల్లయ్య, తిరుమలేష్, బీచుపల్లి, టవర్ మక్బూల్ తదితరులు ఉన్నారు.
Updated Date - Feb 01 , 2025 | 11:25 PM