బల్దియాల్లో ప్రత్యేక పాలన..
ABN, Publish Date - Jan 26 , 2025 | 12:49 AM
బల్దియాల్లో పాలకవర్గాల గడువు ఆదివారంతో ముగియనుంది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
బల్దియాల్లో పాలకవర్గాల గడువు ఆదివారంతో ముగియనుంది. 27 నుంచి ప్రత్యేక పాలన ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఇక నుంచి నిర్ణయాలన్నీ ప్రత్యేక అఽధికారులు తీసుకోనున్నారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్లలో 39 వార్డులు, వేములవాడలో 28 వార్డుల్లో పోటా పోటీగా సాగిన పోరులో పాలక పగ్గాలను రెండు చోట్ల బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. రెండు మున్సిపాలిటీల్లో 67 వార్డుల్లో ఐదు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా, 62 వార్డుల్లో 274 మంది పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. బీఆర్ఎస్, రెబల్ అభ్యర్థుల మధ్యే పోటీ సాగింది. బీఆర్ఎస్ 38 సీట్లు, కాంగ్రెస్ మూడు సీట్లు, బీజేపీ 9 సీట్లు, స్వతంత్రులు 17 సీట్లు గెలుపొందడం గమనార్హం. సిరిసిల్ల, వేములవాడలో బీఆర్ఎస్కు చెందిన జిందం కళచక్రపాణి, రామతీర్థపు మాధవిలు చైర్పర్సన్లుగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిరిసిల్లలో కొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లారు. వేములవాడలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వలసలు వెళ్లారు. బీఆర్ఎస్కు చెందిన వై్ చైర్మన్ మధు రాజేందర్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన కౌన్సిలర్ బింగి మహేష్ వైస్చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఇలా పలు రాజకీయాల మధ్య బల్దియా పాలన గడువు ముగిసిపోయింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టితో అభివృద్ధి అశాజనకంగానే సాగింది. ప్రధాన రోడ్లతో పాటు జిల్లా కేంద్రానికి విద్యా సంస్థలు, కూడా వచ్చాయి. వేములవాడలో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు చేపట్టినా అంతంత మాత్రంగానే జరిగాయనే విమర్శలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అభివృద్ధి వైపు దృష్టిసారించారు. ప్రత్యేక అధికారుల పాలనలో అభివృద్ధి ఎలా జరగనుందోననే ఆసక్తి కూడా ప్రజల్లో నెలకొంది.
బల్దియా వైపు చూపు..
అధికారంలో ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పటికీ స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే కొనసాగడంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకుల్లో నిరాశగానే ఉండేది. మున్సిపల్ పాలకవర్గాల గడువుతో స్థానిక సంస్థల పాలనకు తెరపడి ప్రత్యేక అధికారుల పాలన ముందుకు వచ్చింది. ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇదేక్రమంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిల్కు కూడా ఎన్నికలు జరగనుండడంతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లోని ఆశావాహూలు దృష్టి పెట్టారు. వార్డుల్లో సంబంధాలు పెంచుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Updated Date - Jan 26 , 2025 | 12:49 AM