ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో సింగరేణి రెస్క్యూ బృందాలు
ABN, Publish Date - Mar 01 , 2025 | 12:36 AM
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీశైలం ఎస్ఎల్బీసీ వద్ద కీలక రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి బృందాలు పాల్గొంటున్నాయి. శుక్రవారం సొరంగ మార్గంలో జరుగుతున్న రెస్క్యూ పనులను సీఎండీ ఎన్ బలరామ్ స్వయంగా పరిశీలించారు.
- 250 మంది సిబ్బంది కేటాయింపు
- సొరంగ మార్గంలో రెస్క్యూ పనులను పరిశీలించిన సీఎండీ బలరాం
గోదావరిఖని, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీశైలం ఎస్ఎల్బీసీ వద్ద కీలక రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి బృందాలు పాల్గొంటున్నాయి. శుక్రవారం సొరంగ మార్గంలో జరుగుతున్న రెస్క్యూ పనులను సీఎండీ ఎన్ బలరామ్ స్వయంగా పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ కల్నల్తో కలిసి సింగరేణి సీఎండీ 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో ప్రమాద స్థలి చేరువ వరకు పరిస్థితిని సహాయక చర్యలను పరిశీలించారు. సింగరేణి రెస్క్యూ బృందాల ఆధ్వర్యంలో జరుగుతున్న గ్యాస్ కటింగ్ పనులను సీఎండీ పర్యవేక్షించారు. ట్రాక్ పునరుద్ధరణ జరగాలంటే దానిపై కూలిన టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) భాగాలను తొలగించాల్సి ఉంటుంది. ఈపనిలో సింగరేణి రెస్క్యూ సిబ్బంది తమ వద్ద గల అత్యాధునిక గ్యాస్ కటింగ్ యంత్రాల ద్వారా ఇనుప పైపులను, గడ్డర్లను కత్తిరిస్తూ వేరుచేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకోవడం కోసం ఈ ట్రాక్ పునరుద్ధరణ అత్యవసరం కావడంతో దీనిపై సింగరేణి రెస్క్యూ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. అదే సమయం లో ట్రాక్ మీద పేరుకుని ఉన్న బురద మట్టిని కూడా రెస్క్యూ బృందాలు తొలగిస్తున్నాయి. మొత్తం 250మంది సింగరేణి రెస్క్యూ సభ్యులు 24గంటలు ఈ పనిలో పాల్గొనేందుకు వీరిని నాలుగు షిఫ్టులుగా కేటాయించారు. రక్షణ సూత్రాలు పాటిస్తూ సమర్థంగా పనులు పూర్తిచేయాలని సీఎండీ రెస్క్యూ సిబ్బందికి సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకోవడానికి భూమి తొలిచే యంత్రాల (గ్రౌండ్ పెనట్రేటింగ్ ఇన్స్ర్టుమెంట్స్)ద్వారా ఐదు అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ ప్రదేశాల్లో తవ్వకాన్ని సమర్థంగా నిర్వహిం చడం కోసం ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలకు పనులు అప్పగించారు. సింగరేణి రెస్క్యూ బృందాలు అలుపెరగకుండా పనులు నిర్వహిస్తున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రత్యక్ష పరిశీలన, పర్యవేక్షణలో సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్తో పాటు జనరల్ మేనేజర్(రెస్క్యూ) శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
- సింగరేణి ఆర్జీ-1 బృందం..
శ్రీశైలం ఎస్ఎల్బీసీ సొరంగం సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సింగరేణి ఆర్జీ-1 బృందం జీఎం కార్యాలయం నుంచి శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే సింగరేణి సీఎండీ ఎన్ బలరాం ఆదేశాల మేరకు రెస్క్యూ టీమ్, ఉద్యోగుల బృందాన్ని వెంటనే సహాయక చర్యలలో పాల్గొనేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆర్జీ-1 ఏరియా నుంచి 30మంది జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో బస్సు ద్వారా శ్రీశైలం టన్నెల్కు వెళ్లారు. ఈ సంద్భంగా జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ సహాయక చర్యలలో పాల్గొనే ఉద్యోగులు రక్షణతో పనులను నిర్వహించా లని, రెస్క్యూ అధికారులు, సూపర్వైజర్ల పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఓటూ జీఎం గోపాల్ సింగ్, పర్సనల్ మేనేజర్ రవీందర్రెడ్డి, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, సీనియర్ పీఓ శ్రావణ్ కుమార్, సంక్షేమ అధికారులు గణేష్, ఇక్బాల్ షరీఫ్ పాల్గొన్నారు.
Updated Date - Mar 01 , 2025 | 12:36 AM