‘పురుమల్ల’కు షోకాజ్ నోటీసు
ABN, Publish Date - Jan 07 , 2025 | 01:38 AM
కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి, గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్పై బహిష్కరణ వేటు తప్పదని తెలుస్తోంది.
ఫ పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ సీరియస్
ఫ వారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశం
ఫ లేకకపోతే కఠిన చర్యలు తీసకుంటామని స్పష్టీకరణ
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి, గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్పై బహిష్కరణ వేటు తప్పదని తెలుస్తోంది. ఇటీవల ఆయన డీసీసీ కార్యాలయంలో తన అనుచరగణంతో సమావేశం ఏర్పాటు చేసి జిల్లా మంత్రులు, జిల్లా ఇన్చార్జి మంత్రి, డీసీసీ అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిపై చేసిన వ్యాఖ్యలను పార్టీ సీరియస్గా పరిగణించింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి పురుమల్ల శ్రీనివాస్కు ఈ విషయమై షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారంలోగా వివరణ ఇవ్వాలని, లేకపోతే పార్టీ నియమాలు, మార్గదర్శకాలను అనుసరించి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఫ డీసీసీ కార్యాలయంలో సమావేశం.. వ్యాఖ్యలు
పురుమల్ల శ్రీనివాస్ డిసెంబరు 18న డీసీసీ కార్యాలయంలో తన అనుచరులతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్బాబు, జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వి రాజేందర్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్య తీసుకోవాలని పార్టీ నాయకులు కొందరు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేస్తూ డీసీసీ అధ్యక్షుడికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సమావేశం నిర్వహించడంతోపాటు పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, డీసీసీ అధ్యక్షునిపై ఘాటైన వ్యాఖ్యలు చేయడాన్ని ప్రశ్నించారు. అదేరోజు ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు రాజ్భవన్ మార్చ్ను నిర్వహిస్తే దానికి హాజరుకాకుండా డీసీసీ కార్యాలయంలో పురుమల్ల శ్రీనివాస్ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశారన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దని, క్రమశిక్షణ కమిటీ పదేపదే హెచ్చరిస్తున్నా వైఖరి మార్చుకోవడం లేదని, ఇలాగే కొనసాగితే క్రమశిక్షణ కమిటీ చర్య తీసుకుంటుందని షోకాజ్లో పేర్కొన్నారు. షోకాజ్ నోటీసు వచ్చిన తేదీ నుంచి వారంలోపు వివరణ ఇవ్వాలని, వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొనడం జిల్లా కాంగ్రెస్లో చర్చకు దారితీసింది.
ఫ నామినేటెడ్ పదవుల కోసం ఇన్చార్జి మంత్రికి లేఖ
అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా పురుమల్ల శ్రీనివాస్ రంగప్రవేశం చేసి కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని పొందారు. ఆ సమయంలో ప్రస్తుత సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు అండదండలతో కరీంనగర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించుకునేందుకు ప్రయత్నించారు. పురుమల్ల శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుడితో ఉన్న సాన్నిహిత్యంతో ప్రయత్నం ప్రారంభించగా, కోమటిరెడ్డిని వ్యతిరేకించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనవైపే మొగ్గు చూపించారు. దీంతో పురుమల్ల శ్రీనివాస్ అభ్యర్థిత్వం ఖరారై పోటీచేశారు. ఆ ఎన్నికల్లో పరాజయంపాలై నియోజకవర్గ ఇన్చార్జి అయ్యారు. ఏడాదిపాటు మంత్రి పొన్నం ప్రభాకర్ వెన్నంటి ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తూ ఆయన వర్గంగానే గుర్తింపు పొందారు. నియోజకవర్గంలో పురుమల్ల శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవితోపాటు మరికొన్ని పదవులు తాను సూచించినవారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై నేరుగా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి లేఖ రాయడం మంత్రి పొన్నంకు ఆగ్రహం తెప్పించిందని సమాచారం. ఆ తర్వాత నుంచి పురుమల్ల శ్రీనివాస్ మంత్రులకు వ్యతిరేకంగా బాహాటంగా మాట్లాడారు. చివరకు డీసీసీలోనే సమావేశం ఏర్పాటు చేసి తన అసంతృప్తిని వెలిబుచ్చడంతోపాటు మంత్రులపై, పీసీసీ, డీసీసీ అధ్యక్షులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం సృష్టించింది. ప్రధానంగా మంత్రి పొన్నం ప్రభాకర్ను టార్గెట్ చేసి మాట్లాడిన కొన్ని అంశాలు పార్టీలో ఆయనను అప్రతిష్టపాలు చేసేవిగా ఉండడంతో విషయం సీరియస్గా మారింది. మంత్రి పొన్నం అనుచరులు ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, గడువు ఇచ్చినా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించవద్దని పదేపదే సూచించినా మార్పు రావడం లేదని షోకాజ్లోనే పేర్కొనడంతో ఆయనపై ఇక వేటు తప్పదనే అభిప్రాయమే పార్టీ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతున్నది. పురుమల్లపై పార్టీ బహిష్కరణ వేటు వేస్తే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఎవరవుతారన్నది ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది.
Updated Date - Jan 07 , 2025 | 01:38 AM