నేటి నుంచి నిరంతర మంచినీటి సరఫరా
ABN, Publish Date - Jan 24 , 2025 | 01:52 AM
స్మార్ట్సిటీ పథకంలో భాగంగా కరీంనగర్లో నిరంతర నీటి సరఫరా చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే నగరంలో ప్రతిరోజూ నగరపాలక సంస్థ మంచినీటిని అందిస్తోంది. మరో అడుగు ముందుకేసి ప్రతి రోజూ 24 గంటలపాటు శుద్ధి చేసిన మంచినీటిని ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేసింది.
- కరీంనగర్ హౌసింగ్బోర్డులో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం
- రూ.18 కోట్లతో రిజర్వాయర్లు, డీఎంఏలు, పైపులైన్ల నిర్మాణాలు
- 3,500 ఇళ్లకు మీటర్ల బిగింపు... నీటి వాడకాన్ని బట్టి నల్లా బిల్లులు
- నేడు ప్రారంభించనున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
స్మార్ట్సిటీ పథకంలో భాగంగా కరీంనగర్లో నిరంతర నీటి సరఫరా చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే నగరంలో ప్రతిరోజూ నగరపాలక సంస్థ మంచినీటిని అందిస్తోంది. మరో అడుగు ముందుకేసి ప్రతి రోజూ 24 గంటలపాటు శుద్ధి చేసిన మంచినీటిని ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. హౌసింగ్ బోర్డుకాలనీలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్శాఖ మంత్రి మోహన్లాల్ ఖట్టర్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు.
ఏర్పాట్లు పూర్తి
హౌసింగ్బోర్డు కాలనీలో హెచ్డిపీ డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లు వేశారు. కాలనీలోని 4,055 ఇళ్లకు ఒకొక్కరికి ప్రతిరోజు 150 లీటర్ల చొప్పున నీటిని నల్లా నీటిని అందించేందుకు ఇంటింటికి పైపులైన్లు వేశారు. ప్రజలు నివాసముంటున్న 3,500 ఇళ్లకు మీటర్లను బిగించారు. 20 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు రిజర్వాయర్లను నిర్మించారు. కాలనీ మొత్తాన్ని నాలుగు డీఎంఏ (డైరెక్టర్ మానిటరింగ్ అథార్టీ)లుగా విభజించి వాటిని రిజర్వాయర్తో అనుసంధానం చేసి ఆటోమెటిక్ ఆన్ ఆఫ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. నీటి వాడకాన్ని బట్టి నల్లా బిల్లులను వసూలు చేసేందుకు రిజర్వాయర్లోనే ఎవరు ఎంత నీటిని వాడుకున్నారనేది ఆన్లైన్లోనే తెలుసుకునే విధంగా చర్యలు చేపట్టారు. అవసరమైనపుడు కాలనీ మొత్తానికి నీటి సరఫరాను నిలివేయడం, లేదా ఒక్కో డీఎంఏకు నిలిపివేయడం లేదా సరఫరా చేసే విధంగా ఆటోమెటిక్ యంత్రాలను అమర్చారు. పైపులైన్లు లీకేజీలు కాకుండా, నీరు కలుషితం, వృఽథాగా పోకుండా చర్యలు తీసకుఉన్నారు. శుక్రవారం నుంచి హౌసింగ్బోర్డుకాలనీలోని మూడు డీఎంఏల పరిధిలోని 2,200 నల్లాల ద్వారా 24 గంటలపాటు నిరంతర నీటిని సరఫరా చేసి, ఆ తర్వాత మరో డిఎంఏ పరిధిలోనూ నీటిని సరఫరా చేయనున్నారు.
నీటిని పొదుపుగా వాడుకోవాలి
- మేయర్ యాదగిరి సునీల్రావు
నిరంతరం మంచినీటి సరఫరాకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ 3,500 కనెక్షన్లకు 24 గంటలపాటు నిరంత రాయంగా నల్లానీటిని ఇచ్చే నగరం లేదు. హౌసింగ్బోర్డు కాలనీలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నాం. ప్రజలు ఇకపై నీటిని నిలువ చేసుకోకుండా ఎప్పటికప్పుడు నల్లా తిప్పి నీటిని వాడుకోవచ్చు. నీటిని పొదుపుగా వాడుకుంటే నల్లా బిల్లు తక్కువగా వస్తుంది. నగరపాలక సంస్థకూ ఖర్చు ఆదా అవుతుంది. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలి.
నేడు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం:
స్మార్ట్సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రులు మోహన్లాల్ ఖట్టర్, బండి సంజయ్కుమార్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 1 గంట వరకు అంబేడ్కర్ స్టేడియం ఆవరణలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ పార్కును ప్రారంభిస్తారు. అనంతరం హౌసింగ్బోర్డుకాలనీలో నిరంతర నల్లానీటి సరఫరా, కుమార్వాడీ పాఠశాలలో ఈ క్లాస్ రూమ్స్ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు పాల్గొని హైదరాబాద్కు బయలు దేరి వెళ్తారు.
Updated Date - Jan 24 , 2025 | 01:52 AM