భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
ABN, Publish Date - Jan 09 , 2025 | 01:01 AM
భక్తులకు ఇబ్బందులు కలగకుండా మహాశివరాత్రి జాతరను నిర్వహించాలని, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంబందిత అధికారులను ఆదేశించారు.
- ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు మహాశివరాత్రి జాతర
- పారిశుధ్య నిర్వహణకు ప్రాఽధాన్యం
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- కలెక్టర్, ఎస్పీతో కలిసి రివ్యూ మీటింగ్
వేములవాడ కల్చరల్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): భక్తులకు ఇబ్బందులు కలగకుండా మహాశివరాత్రి జాతరను నిర్వహించాలని, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంబందిత అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్లో కలెక్టర్ సందీప్కుమార్ ఝా తో కలిసి మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు మూడు రోజులు పాటు జరిగే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై శాఖల వారీగా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించాలని, నిర్ధేశించిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సన్వయంతో పనిచేయాలన్నారు. రాజన్న సన్నిదికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు నీడ, తాగునీటి సరఫరా, పారిశుధ్యం పెంపోందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. ఆలయానికి వచ్చే వీఐపీలను ప్రత్యేక లైన్లో తీసుకుని వెళ్లాలని అన్నారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్య దృష్ట పటిష్ఠ భద్రత వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు. గతం కంటే ఎక్కువగా వేములవాడకు 30 శాతం బస్సులను అధికంగా నడపాలని, భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రూట్లో అదనపు సర్వీసులు నడపాలని సూచించారు.
- సమన్వయ లోపాలను పరిష్కరించుకోవాలి
అధికారులు వివిధ శాఖల మధ్య ఉన్న సమన్వయ లోపాలను పరిష్కరించుకుని పకడ్బందీగా మహాశివరాత్రి జాతర నిర్వహించేందుకు ముందుకు సాగాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబందిత అధికారులను ఆదేశించారు. వేములవాడ ఆలయానికి సమీపంలో అందుబాటులో వున్న ఖాళీ స్థలాలు, పొలాలను రైతులు సంపూర్ణ సహాకారంతో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, పట్టణానికి వచ్చే అన్ని ప్రధాన రోడ్లలో ఉన్న గుంతలను వెంటనే పూడ్చి వేయాలని సూచించారు. భక్తుల కోసం అవసరమైన మేర పందిర్లు ఏర్పాటు చేయాలని, తాగునీటి ఇబ్బందులు కలుగకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన ఆలయం, తిప్పాపూర్ బస్టాండ్, కోరుట్ల బస్టాండు, జాగిత్యాల రోడ్డు, పార్కింగ్ దగ్గర అవసరమైన హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలన్నారు. నోడల్ అధికారుల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
- భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ఆంక్షలు..
మహాశివరాత్రి జాతరను పురష్కరించుకుని రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా ఆంక్షలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ అఖిల్మహాజన్ అన్నారు. ప్రసాదం కౌంటర్లను మరిన్ని చోట్ల ఏర్పాటు చేయాలని అన్నారు. గతం కంటే అధికంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని సూచించారు. బద్దిపోచమ్మ ఆలయం వద్ద రోడ్డు ఆక్రమణలు కాకుండా డ్రైవ్ నిర్వహించాలని అన్నారు.
- మహాశివరాత్రి జాతర ప్రత్యేక కార్యక్రమాల వివరాలు..
మహాశివరాత్రి జాతర సందర్భంగా రాజన్న ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు భీమాశంకర్ శర్మ వివరించారు. ఫిబ్రవరి 25న రాత్రి 7 గంటలకు ప్రభుత్వం, రాత్రి 7.30 గంటలకు తిరుమల, తిరుపతి దేవస్థానం వారిచే పట్టు వస్ర్తాల సమర్పణ ఉంటుందన్నారు. ఫిబ్రవరి 26 తెల్లవారు జామున 12 గంటల నుంచి 2.30 గంటల వరకు పురజనులకు సర్వదర్శనం, తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులకు దర్శనం ఉంటుందని అన్నారు. ఉదయం 3.30 నుంచి 3.40 గంటల వరకు మంగళవాయిద్యాల ప్రదర్శన, ఉదయం 3.40 నుంచి 4.30 గంటల వరకు సుప్రభాత సేవ, ఆలయ శుద్ధి, ఉదయం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాతఃకాల పూజ, అనువంశిక అర్చకుల దర్శనం ఉంటుందని తెలిపారు. మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తేదిన సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శివదీక్ష స్వాముల దర్శనం, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మహాలింగార్చన, రాత్రి 11.35 గంటలకు లింగోద్భావకాలం నందు శ్రీస్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేఽశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఈవో వినోద్రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, మున్సిపల్ వైస్చైర్మన్ బింగి మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jan 09 , 2025 | 01:02 AM