Health Tips: రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి?
ABN, Publish Date - Mar 06 , 2025 | 05:57 AM
ఈ ప్రశ్నలకు రకరకాల సమాధానాలు వినిపిస్తుంటాయి. పొద్దున నిద్ర లేవగానే ఎక్కువ నీళ్లు తాగాలని కొందరు చెబితే.. ప్రతీ రోజు ఇన్ని లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాల్సిందేనని మరికొందరు ఏదో ఓ అంకె చెప్పేస్తుంటారు.
ఇళ్లు, ఆఫీసుల్లో ఉండేవాళ్లు 2 లీటర్లు
ఎండలో పని చేసే వాళ్లు 4 లీటర్లు
బీపీ ఔషధాలు వాడేవాళ్లు 2.5 లీటర్లు
వైద్యుల సూచనలు
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : ఓ వ్యక్తి రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి? ఏం సమయంలో నీళ్లు తాగాలి ? ఈ ప్రశ్నలకు రకరకాల సమాధానాలు వినిపిస్తుంటాయి. పొద్దున నిద్ర లేవగానే ఎక్కువ నీళ్లు తాగాలని కొందరు చెబితే.. ప్రతీ రోజు ఇన్ని లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాల్సిందేనని మరికొందరు ఏదో ఓ అంకె చెప్పేస్తుంటారు. ఇందులో ఏది నిజమనే సంగతి పక్కనపెడితే.. వేసవి కాలం మొదలవుతుండడంతో ఈ నీటి లెక్క మరింత చర్చనీయాంశం కాబోతుంది. నిజానికి, ఓ మనిషి రోజుకు ఎన్ని నీళ్లు తాగాలనే దానికి స్పష్టమైన లెక్కలు లేవు. కానీ భౌగోళిక పరిస్థితులు, ఎండల తీవ్రత అంశాల ఆధారంగా ఓ మనిషి ఎన్ని నీళ్లు తాగాలనేది ఆధారపడి ఉంటుందని ఎక్కువ మంది వైద్య నిపుణుల అభిప్రాయం. ఓ మనిషి పని చేసే వాతావరణం ప్రకారం నీళ్లు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇక, తాగు నీటి పరిమాణం అందరిలోనూ ఒకే విధంగా ఉండదని హార్వర్డ్ మెడికల్ స్కూల్ స్పెషల్ హెల్త్ రిపోర్టు చెబుతోంది. ఓ మనిషి జీవన శైలి, పని ప్రదేశం, ఉష్ణోగ్రతలతోపాటు ఆరోగ్య సమస్యలు, తీసుకునే మందులు ఆధారంగానూ మంచి నీటిని తీసుకోవాలని ఆ నివేదిక పేర్కొంది.
నీళ్లు ఎప్పుడు తాగాలంటే...
నీళ్లు ఎప్పుడు తాగాలి అనే దానిపై వైద్యనిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. రాత్రి నిద్రపోయి ఉదయం నిద్ర లేచే సరికి ఓ మనిషి శరీరంలో నీటి నిల్వలు తగ్గుతాయి. అందువల్ల ఉదయాన్నే కొంచెం ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. సాధారణంగా మూత్రం కొద్దిగా లేత పసుపురంగులో ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగితే మూత్రం కూడా అదే రంగులో వస్తుంది. చాలా సేపు మంచినీళ్లు తాగకుండా ఉంటే మూత్రం ముదురు పసుపు రంగులోకి మారుతుంది. కొన్నిసార్లు మూత్రంలో మంట కూడా వస్తుంది. ఓ మనిషి రోజుకు కనీసం లీటరు నుంచి లీటరన్నర వరకు మూత్రం పోయాలని వైద్యులు చెబుతున్నారు. మూత్రం లేత పసుపు రంగు నుంచి ముదురు పసుపు రంగులోకి మారే వరకు ఆగకుండా నీరు తాగాలి. ఒకవేళ ముదురుపసుపు రంగులోకి మారితే కచ్చితంగా తగినన్ని నీళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే, ఎన్ని నీళ్లు తాగాలనేది.. సదరు వ్యక్తి పనిచేసే, ఉంటున్న వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. కార్యాలయాల్లో పని చేసే వారైతే రోజుకు 8 గ్లాసులు(అంటే రెండు లీటర్ల వరకు) నీళ్లు తాగాలని వైద్యులు చెబుతున్నారు. అదే తీవ్రమైన ఎండలో బహిరంగ ప్రదేశాల్లో పని చేసే వ్యవసాయ కూలీలు, కార్మికుల శరీరం నుంచి చెమట రూపంలో నీటి నిల్వలు శరీరం నుంచి బయటికి పోతాయి. అందువల్ల అలాంటి వారు రోజుకూ కనీసం 3-4 లీటర్ల నీళ్లు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అతిగా తాగినా ప్రమాదమే..
శరీరంలో నీటి నిల్వలు తగ్గకూడదని నీళ్లు అతిగా తాగినా ముప్పేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నీళ్లు ఎక్కువగా తాగితే శరీరంలోని సోడియం మూత్రంతో వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల అతిగా నీళ్లు తీసుకోవడం కూడా ముప్పే. ఇక, రక్తపోటు మందులు శరీరంలో సోడియం లెవెల్స్ను తగ్గిస్తాయి. రక్తపోటు మందులు తీసుకునే వారు నీళ్లు ఎక్కువగా తాగితే సోడియం లెవెల్స్ మరింత వేగంగా తగ్గుతాయి. అదే జరిగితే మెదడు దెబ్బ తిని మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్లే ముప్పు ఉంది. అందువల్ల రక్తపోటు మందులు వాడుతున్న వారు నీటిని తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు.
కనీసం 4 లీటర్లు తాగాలి
ఇళ్లలోనే ఉండేవాళ్లు రోజుకు కనీసం రెండు లీటర్లు, ఎండలో పని చేసే వాళ్లు కనీసం 4 లీటర్ల నీళ్లు తాగాలి. తీవ్రమైన ఎండలో పని చేసే వారైతే మజ్జిగలో ఉప్పు, నిమ్మకాయ పిండుకుని తాగాలి. నీళ్లు మరీ ఎక్కువగా తాగితే సోడియం స్థాయిలు తగ్గి, ఎముకల్లో ధృడత్వం తగ్గిపోతుంది. అటువంటి వారు సిరం ఎలకో్ట్రలైట్ పరీక్షలు చేయుంచు కోవాలి.
- డాక్టర్ ఎంవీ రావు, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషీయన్, యశోద ఆస్పత్రి, హైదరాబాద్
టీడీఎస్ 300కు తగ్గకూడదు
నీరు శరీరంలో షుగర్, ప్రోటీన్ లెవల్స్ పెరగకుండా నియంత్రిస్తుంది. బోర్ నీళ్లు తాగకుండా ఉంటే మంచిది. ఎక్కువ కాలం బోర్ నీళ్లు తాగితే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. తాగేనీటిలో టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్ (టీడీఎస్) స్థాయిలు కనీసం 300కు తగ్గకుండా ఉంటే మంచిది.
- డాక్టర్ తాడూరి గంగాధర్,
నెఫ్రాలజీ హెచ్వోడీ, నిమ్స్ ఆస్పత్రి
Updated Date - Mar 06 , 2025 | 05:57 AM