Nagoba Maha Jatara : వైభవంగా నాగోబా మహాజాతర
ABN, Publish Date - Jan 29 , 2025 | 04:49 AM
మెస్రం వంశీయుల అల్లుళ్లు కోనేరులోని నీటిని తోడి మట్టికుండల్లో నింపగా, ఆ కుండలను మహిళలు తలపై పెట్టుకొని వరుసగా నాగోబా ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం పక్కనే ఉన్న పాత మట్టి పుట్టల వద్ద నుంచి అల్లుళ్లు మట్టిని తీసుకొని రాగా
ఇంద్రవెల్లి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): మెస్రం వంశీయుల అల్లుళ్లు కోనేరులోని నీటిని తోడి మట్టికుండల్లో నింపగా, ఆ కుండలను మహిళలు తలపై పెట్టుకొని వరుసగా నాగోబా ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం పక్కనే ఉన్న పాత మట్టి పుట్టల వద్ద నుంచి అల్లుళ్లు మట్టిని తీసుకొని రాగా ఆడపడుచులు తెచ్చిన నీటితో మట్టిని కలిపి పుట్టలను తయారు చేశారు. తయారు చేసిన పుట్టల నుంచి మట్టిని ఉండల రూపంలో తీసుకుని ఏడు వరుసలతో బౌలదేవతను తయారు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా మహాజాతర మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదీవాసీల ఆరాధ్య దైవమైన నాగోబాకు పవిత్ర గోదావరి జలాలతో ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, పూజారీ (కటోడ) మెస్రం దేవ్రావు, మెస్రం కోసురావు పూజలు నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు బేటింగ్ (కొత్త కోడళ్ల పరిచయం), భక్తుల దర్శనం, ప్రత్యేక పూజలు కొనసాగాయి. కాగా, మంగళవారం ఆలయ ప్రాంగణం గేటు వద్ద పాము ప్రత్యక్షమైంది. పామును చూసేందుకు భక్తులు ఎగబడ్డారు.
Updated Date - Jan 29 , 2025 | 04:49 AM