Kaleshwaram: కాళేశ్వరం రుణాలను సర్కారే చెల్లిస్తుంది
ABN, Publish Date - Jan 22 , 2025 | 04:07 AM
కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న రుణాలకు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిందని, అందువల్ల.. వడ్డీతో సహా ఆర్థిక శాఖ తిరిగి చెల్లింపులు చేస్తుందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు స్పష్టం చేశారు.
ఆ మేరకు కార్పొరేషన్కు పూచీకత్తు ఇచ్చింది
ఈ ఏడాది రూ.6,519 కోట్ల వడ్డీ,
రూ. 7,382 కోట్ల అసలు చెల్లించాం
ఆదాయం పెరగడానికి కొంత సమయం..
వడ్డీ భారం తగ్గించేందుకు ప్రయత్నాలు
జస్టిస్ ఘోష్ కమిషన్కు ఆర్థిక శాఖ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వివరణ
హైదరాబాద్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న రుణాలకు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిందని, అందువల్ల.. వడ్డీతో సహా ఆర్థిక శాఖ తిరిగి చెల్లింపులు చేస్తుందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీల రూపంలో రూ.6,519 కోట్లు, అసలు కింద రూ.7,382 కోట్ల చెల్లించామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణ అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మంగళవారం ఆయన హాజరయ్యారు. క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా.. ఆదాయం లేకపోయినా కాళేశ్వరం కార్పొరేషన్కు ఏవిధంగా రుణాలు తీసుకున్నారు!? ఆదాయం లేకుండా రుణాలను తిరిగి చెల్లించడం ఎలా సాధ్యం? అన్న ప్రశ్నలకు ఆయన పైవిధంగా జవాబిచ్చారు. అవసరమైన నిధుల సమీకరణకే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీఎల్) ఏర్పాటైందని, బయటి రుణాలతోపాటు రాష్ట్ర బడ్జెట్ నిధులతో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని వివరించారు. రుణాల సమీకరణ బాధ్యత కాళేశ్వరం కార్పొరేషన్దేనని, ఈ విషయమై ప్రభుత్వం, కేఐపీసీఎల్ మధ్య అవగాహన కుదిరిందని చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్కు తగిన రీతిలో ఆదాయ వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకోవాలని 2016 అక్టోబరు 6న జీవో 145 జారీ చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఔనని బదులిచ్చారు. మరి.. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించగా.. పారిశ్రామిక అవసరాలకు నీటి కేటాయింపులతో రూ.7 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆదాయం పెరగడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.
అన్ని సంవత్సరాలకు సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను తయారు చేసిందా? వాటిని మీరు పరిశీలించారా? అని ప్రశ్నించగా.. తనకు సమాచారం లేదని రామకృష్ణారావు బదులిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 2021-22లో తీసుకున్న రూ.35,257 కోట్ల బడ్జెటేతర రుణాలను బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపారని, కానీ, 2022-23లో రూ.9,596 కోట్లు, 2023-24లో రూ.2,545 కోట్ల బడ్జెటేతర రుణాలను ఎందుకు చూపలేదని కమిషన్ ప్రశ్నించింది. దాంతో.. ప్రభుత్వ గ్యారెంటీలతో తీసుకున్న బడ్జెటేతర రుణాలన్నింటినీ తెలపాలని అప్పట్లో కేంద్రం కోరిందని, ఆ రుణాలను బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపితే రాష్ట్ర రుణ పరిమితికి కేంద్రం కోతలు విధించే అవకాశం ఉందని, అందుకే వాటిని చూపలేదని రామకృష్ణారావు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలను 9-10.5 శాతం వార్షిక వడ్డీలతో తీసుకున్నారని, ఆ భారాన్ని తగ్గించడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించగా.. గత ప్రభుత్వంలో అలాంటి ప్రయత్నం జరగలేదని, ఈ ప్రభుత్వం వచ్చాక చేస్తున్నామని తెలిపారు.
నేడు వి.ప్రకాష్ విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టును సంపూర్ణంగా సమర్థిస్తూ అఫిడవిట్ దాఖలు చేసిన తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకా్షను బుధవారం కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది.
బ్యారేజీల నిర్మాణ పనుల్లో తీవ్ర ఉల్లంఘనలు
బ్యారేజీల నిర్మాణం టర్న్కీ పద్ధతిలో కట్టాలని జీవో 145 పేర్కొంటుండగా, ప్రభుత్వం తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిందని కమిషన్ తప్పుబట్టింది. దాంతో, జీవోలో అలా పేర్కొన్నప్పటికీ.. ప్రాజెక్టులో మాత్రం ఒక్కో పనిని ప్రత్యేకంగా (పీస్ రేటు విధానం)లో కట్టారని రామకృష్ణారావు తెలియజేశారు. 2015లో జారీ చేసిన ఓ జీవో ప్రకారం ఏర్పాటు చేసిన కోర్ కమిటీ తరచూ మీతో సమావేశమై ప్రాజెక్టు పురోగతిని వివరించిందా? అని కమిషన్ అడగగా, కమిటీలోని ఇంజనీర్లు తనను కలిసి, ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని వివరించి బిల్లులకు నిధులను కోరేవారని బదులిచ్చారు. ఆ సమావేశాల మినిట్స్ ఏమయ్యాయని కమిషన్ మళ్లీ ప్రశ్నించగా, వాటికి రికార్డులు ఏమీ లేవని తెలిపారు. అలాగే, ఆర్థిక శాఖకు ఫైళ్లను పంపించకుండానే అనేక పనులు చేశారా? అని ప్రశ్నించగా.. ఆ విషయం తన దృష్టికి రాలేదని జవాబిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Updated Date - Jan 22 , 2025 | 04:24 AM