శృతి మించుతున్న రియల్టర్ల ఆగడాలు
ABN, Publish Date - Jan 29 , 2025 | 11:47 PM
జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. భూముల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఖాళీ జాగ కనిపిస్తే చాలు....అది పట్టా భూమైనా సరే కబ్జాలకు పాల్పడుతున్నారు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, భూముల చెరపడుతున్నారు.
- నకిలీ డాక్యుమెంట్లతో కబ్జాలకు యత్నం
- పట్టా భూములనూ వదలని వైనం
- రేట్లు పెరగడంతో ఖాళీ భూములపై కన్ను
మంచిర్యాల, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. భూముల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఖాళీ జాగ కనిపిస్తే చాలు....అది పట్టా భూమైనా సరే కబ్జాలకు పాల్పడుతున్నారు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, భూముల చెరపడుతున్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వ, ఇనాం, అసైన్డ్, చెరువు శిఖం, వాగులు, నాలాల కబ్జాలకు పాల్పడిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రస్తుతం పట్టా భూములను సైతం వదలడం లేదు. సంవత్సరాల తరబడి ఖాళీగా ఉన్న భూములు, స్థానికంగా ఉండని యజమానుల స్థలాలే లక్ష్యంగా అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలోని హమాలివాడలో పట్టా భూమిపై కన్నేసిన కొందరు దాన్ని హస్తగతం చేసుకొనేందుకు అందులోని పెంకుటిళ్లను కూల్చివేయగా, బాధితుడు లబోదిబోమంటున్నాడు.
ఖాళీ స్థలాలే లక్ష్యం...
యజమానులు అందుబాటులో లేని ఖాళీ స్థలాలపై కన్నేస్తూ వాటిని అక్రమ పద్ధతుల్లో చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు అవినీతి అధికారుల అండదండలతో సదరు భూములకు నకిలీ డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఆ డాక్యుమెంట్ సహాయంతో మున్సిపాలిటీలో ఇంటి నిర్మాణ అనుమతులకు ధరఖాస్తు చేసుకుంటారు. ఇంటి పర్మిషన్ రాగానే, దాని ఆధారంగా భూమిని అమ్మకానికి పెట్టి అందిన కాడికి దండుకుంటారు. అప్పటి వరకు అదే స్థలంలో ఉన్న ఇంటికి మున్సిపల్ అనుమతులున్నా... మళ్లీ నంబర్లు జారీ చేయడం జిల్లా కేంధ్రంలో ఆనవాయితీగా వస్తోంది. ఇలా హమాలివాడలోని గర్మిళ్ల శివారులోగల సర్వే నంబర్ 315/అ లోని సుమారు ఎకరం స్థలంపై కన్నేసి దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సదరు భూమిని ఆకుల నారాయణ, అతని వారసుల వద్ద గోదావరిఖనికి చెందిన పూదరి మల్లాగౌడ్ అనే వ్యక్తి 24-08-2007న కొనుగోలు చేశాడు. అందులో రెండు పురాతన ఇళ్లు, కాంపౌండ్, షట్టర్లు ఉన్నాయి. 25-03-2019న ఇళ్ల యాజమాన్య మార్పిడి కూడా జరిగింది. యజమాని స్థానికంగా ఉండని కారణంగా దానిపై ఇతరుల కళ్లు పడ్డాయి. 08-11-2024న గేటు తొలగించడంతో బాధితుడు 100కు డయల్ చేయడంతోపాటు మరునాడు మంచిర్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు సైతం చేశాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయినప్పటికీ 20 రోజుల అనంతరం అందులోని ఇళ్లను కూడా కూల్చివేశారు. అంతటితో ఆగకుండా షట్టర్లను కూడా కూల్చివేయడంతో విధిలేని పరిస్థితుల్లో బాధితుడు 27-11-2024న మళ్లీ పోలీసులను ఆశ్రయించాడు. అయితే మూడు నెలలు నెలలు కావస్తున్నా బాధితుడికి న్యాయం జరుగకపోగా, ఎదుటి వ్యక్తులు భూమి వదిలి వెళ్లిపోవాలంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు వాపోయాడు. అయితే తన భూమిపై కన్నేసిన వ్యక్తులు 315/బీ1 సర్వే నంబరుతో పత్రాలు సృష్టించి వారి పేరిట పట్టా ఉందని అధికారులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు బాధితుడు తెలిపాడు. అసలు గర్మిళ్ల శివారులో 315/బీ1 సర్వే నంబరుతో భూములే లేవని తెలుస్తోంది. అయినా డాక్యుమెంట్లు పుట్టుకురావడం గమనార్హం. సదరు భూమి విలువ సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇదిలా ఉండగా పట్టా భూములను కబ్జా చేయడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. గతంలో స్థానిక జన్మభూమినగర్లోనూ ఓ పట్టా భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా, బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కబ్జాకు యత్నించిన వారు సదరు స్థలం వద్దనే మకాం వేసి జల్సాలు చేసుకుంటూ భయబ్రాంతులకు గురిచేయడం గమనార్హం.
భూములు కొనేందుకు జంకుతున్న జనం....
జిల్లా కేంద్రంలో పదుల సంఖ్యలో పట్టా భూముల వివాదాలు నెలకొనడంతో వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు రావడంలేదు. ఒక్కో భూమిపై రెండు, మూడు వర్గాలవారు కన్నేయడంతో వివాదాలు నెలకొంటున్నాయి. మందీమార్భలంతో అసలు యజమానులను బెదిరిస్తూ కబ్జాకు యత్నిస్తున్నారు. భూముల్లో నెలకొన్న వివాదాల కారణంగా అవసరానికి వాటిని అమ్ముకునే పరిస్థితి కూడా యజమానులకు లేకుండా పోయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అసలు యజమానులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అధికారులు న్యాయం చేయాలి..
- పూదరి మల్లాగౌడ్
తాను చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిని ఇతరులు హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదు. అసలు రికార్డుల్లో లేని సర్వే నంబర్లతో పత్రాలు సృష్టించినా పట్టించుకొనేవారు లేకుండా పోయారు. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను.
Updated Date - Jan 29 , 2025 | 11:47 PM