Padma Awards : 100 ఏళ్ల ధీరురాలు!
ABN, Publish Date - Jan 26 , 2025 | 12:12 AM
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా అనేక మంది మహిళలకు పద్మ అవార్డులు లభించాయి. వీరందరూ మన సమాజానికి ఏదో ఒక విధంగా తమ వంతు సేవ చేసిన వారే. వారి గురించి మీ కోసం..
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా అనేక మంది మహిళలకు పద్మ అవార్డులు లభించాయి. వీరందరూ మన సమాజానికి ఏదో ఒక విధంగా తమ వంతు సేవ చేసిన వారే. వారి గురించి మీ కోసం..
కొందరు మాతృభూమిపై ఉన్న మమకారంతో అలుపెరగకుండా పోరాడుతూ ఉంటారు. అలాంటి స్వాతంత్య్ర సమరయోధురాలే లిబియా లోబో సర్దేశాయ్. 100 ఏళ్ల వయస్సులో కూడా ఇంకా చురుకుగా ప్రజలలో స్ఫూర్తి నింపుతున్నారు. ఆమెకు శనివారం భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.
1955.. పోర్చుగీసు నుంచి స్వాతంత్య్రం పొందటానికి గోవాలో ఉద్యమం జోరుగా సాగుతోంది. లిబియా లోబో సర్దేశాయ్ ఎవ్వరికి కనబడకుండా అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆరేళ్ల పాటు అడవుల్లోనే ఉండి రహస్యంగా రేడియో ప్రసారాల ద్వారా ఉద్యమానికి ఊపును ఇచ్చారు. ‘‘నేను అడవుల్లోకి వెళ్లే సమయానికి ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం చేస్తున్నా. లా చదువుతున్నా. ఆ సమయంలో గోవాలో ఉత్తరాలను కూడా అనుమతించేవారు కారు. పత్రికలు వచ్చేవి కావు. ఆఖరికి శుభలేఖల వేయించుకోవటానికి కూడా పోర్చుగీసు అధికారుల అనుమతి అవసరమయ్యేది’’ అంటారామే! తనతో ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్న వామన్, నికలో మెన్జిలతో కలిసి గోవా స్వాతంత్య్రం కోసం పనిచేయటానికి నిర్ణయించుకున్నారు. ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తూ ఉండటం వల్ల వారికి రేడియో స్టేషన్ ఎలా నడపాలో తెలుసు. దీనితో వారు- ‘‘వాజ్ డా లిబరేడేడ్’’ ( వాయిస్ ఆఫ్ ఫ్రీడం) అనే రేడియో స్టేషన్ను ప్రారంభించి రహస్యంగా నడపటం మొదలుపెట్టారు. అధికారులకు అనుమానం రాకుండా మకాం మార్చేసారు. లిబో, సర్దేశాయ్లు ప్రతి రోజు ఇతర రేడియో స్టేషన్లలో వచ్చే వార్తలను వినేవారు. పేపర్లలో వచ్చే వార్తలను సేకరించేవారు. ఇలా సుమారు ఆరేళ్ల పాటు రోజుకు 18గంటల దాకా పనిచేసేవారు. వీరు ఏర్పాటు చేసిన ట్రాన్స్మిషన్ సెంటర్ ద్వారానే భారతీయ సైన్యం గోవాలోని ప్రజలకు సందేశాలు పంపుతూ ఉండేది. ‘‘పోర్చుగీస్ నుంచి గోవాకు స్వాతంత్య్రం వచ్చిన రోజు- అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ జె.ఎన్. చౌదురి మా దగ్గరకు వచ్చి ఆ వార్తను చెప్పారు. నాకు ఎలా స్పందించాలో అర్ధం కాలేదు. మా గార్డెన్లో ఉన్న ఒక పువ్వును ఆయనకు ఇచ్చాను’’ అంటారు లోబో. ఆ తర్వాత మూడేళ్లకు సర్దేశాయ్ను లోబో పెళ్లి చేసుకున్నారు. గోవాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దేశాయ్ పంచాయతీ సమితిల డైరక్టర్ అయ్యారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారిగా మారారు. అంగోలాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు. 1992లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీని కూడా బహుకరించింది. లోబో కూడా తన లా డిగ్రీని పూర్తి చేసి న్యాయవాది వృత్తిలో ప్రవేశించారు. గోవా కోర్టుల్లో తొలి మహిళా న్యాయవాదిగా ప్రసిద్ధి చెందారు. మహిళా కోఆపరేటివ్ బ్యాంకును స్థాపించారు. గోవా టూరిజం అభివృద్ధి కోసం ఎంతో సేవ చేశారు. 1994లో సర్దేశాయ్ మరణించిన తర్వాత ఆమె ఒంటరిగానే గోవాలో నివసిస్తున్నారు. ‘‘ఇప్పటికి నా వంట నేనే చేసుకుంటా! నాకు ఒక పనిమనిషి ఉందంతే!’’ అనే లోబోకు ఇటీవలే వందేళ్లు నిండాయి. ఇప్పటికీ ఆమె గోవా ప్రజలలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారు. ఇటీవలే ఆమె పుట్టిన రోజును గోవా ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.
ఇవీ చదవండి:
రాత మార్చేందుకు పాత రూటులోకి.. కోహ్లీ ఊహించని ట్విస్ట్
క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్టైమ్ రికార్డు బ్రేక్
ఐసీసీ టీ20 టీమ్.. భారత్ నుంచి నలుగురు స్టార్లు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 26 , 2025 | 12:13 AM