PM Modi: ఊబకాయంపై ‘దశ’దిశగా పోరు
ABN, Publish Date - Feb 25 , 2025 | 04:12 AM
ఊబకాయంపై యుద్ధం చేయడంలో సహాయపడటానికి, విస్తృత ప్రచారానికి వివిధ రంగాలకు చెందిన 10 మంది ప్రముఖులను నియమించారు. ఈ విషయాన్ని సోమవారం ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.
విస్తృత ప్రచారానికి ప్రధాని శ్రీకారం
ఒమర్ అబ్దుల్లా, ఆనంద్ మహీంద్రా,
మోహన్లాల్ సహా 10 మంది ప్రముఖుల నియామకం
తాము కూడా పది మంది చొప్పున
నామినేట్ చేసిన ప్రముఖులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న ఊబకాయంపై మన్ కీ బాత్లో ప్రస్తావించిన మరుసటి రోజే.. ప్రధాని మోదీ ఆ సమస్య నియంత్రణకు శ్రీకారం చుట్టారు. ఊబకాయంపై యుద్ధం చేయడంలో సహాయపడటానికి, విస్తృత ప్రచారానికి వివిధ రంగాలకు చెందిన 10 మంది ప్రముఖులను నియమించారు. ఈ విషయాన్ని సోమవారం ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘ఊబకాయంపై పోరాటానికి మరింత శక్తిని సమకూర్చేందుకు, ఆహారంలో వంట నూనెల వినియోగాన్ని తగ్గించడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీరిని నియమిస్తున్నాను. వారిని మరో 10 మందిని నామినేట్ చేయమని కోరుతున్నారు. తద్వారా ఈ ఉద్యమం మరింత పెద్దది అవుతుంది’’ అని పోస్టులో ఆ జాబితాను మోదీ ప్రకటించారు. వారిలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర, నటులు మోహన్లాల్, ఆర్ మాధవన్, గాయని శ్రేయా గోషాల్, బోజ్పురి గాయకుడు, నటుడు నిరాహువ, షూటింగ్ చాంపియన్ మను భాకర్, వెయిట్లిఫ్టర్ మిరాబాయ్ చాను, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని, ఎంపీ సుధామూర్తి ఉన్నారు. మోదీ ప్రకటనపై వీరు వెంటనే ప్రతిస్పందించారు. తమను నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఊబకాయంపై ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ తరఫున వారు కూడా 10 మంది చొప్పున నామినేట్ చేశారు. ప్రచారానికి కొనసాగింపుగా తాము ప్రతిపాదించిన ఆ 10 మంది మరో పది మందిని నామినేట్ చేయాలని కోరారు. ఆదివారం మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ఊబకాయం సమస్యపై మాట్లాడిన విషయం తెలిసిందే. వంట నూనెల వినియోగం పది శాతం తగ్గించాలని, ఆ విషయం చెప్పి మరో పది మందికి సవాల్ విసరాలని ఆయన కోరారు.
ఊబకాయం.. పెరిగిపోతోంది
ఊబకాయంతో ఆరోగ్యానికి ప్రమాదమని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 25 కంటే ఎక్కువ ఉంటే దానిని అధిక బరువుగానూ, 30 కంటే ఎక్కువ ఉంటే దానిని ఊబకాయంగానూ పరిగణిస్తారు. అయితే భారత్లో ఊబకాయానికి సంబంధించి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని గతేడాది లాన్సెట్ జర్నల్లో ప్రచురించిన ఓ అధ్యయనం తెలిపింది. ఇది యువతలో ఎక్కువ అవుతోందని హెచ్చరించింది. ఇప్పటికే అసాంక్రమిక వ్యాధులైన గుండె జబ్బులు, స్ట్రోక్స్, మధుమేహంతో భారతీయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఊబకాయం కూడా ఉంటే ఆ జబ్బుల తీవ్రత యువతలో మరింత పెరుగుతుంది. యుక్తవయసులోనే టైప్2 మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంటుంది. దేశంలో ఇప్పటికే 10 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. కొన్ని రకాల కేన్సర్ల రిస్క్ కూడా ఊబకాయంతో పెరుగుతుంది. గుండెలో మంట, గాల్ బ్లాడర్ వ్యాధులు, లివర్ సమస్యలు తలెత్తుతాయి. నిద్రలో కొంచెం సేపు ఊపిరి ఆగిపోయి మళ్లీ మొదలయ్యే స్లీప్ అప్నియా ప్రమాదం ఊబకాయుల్లో చాలా ఎక్కువ.
ఇవీ లెక్కలు..
2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 24ు మహిళలు, 22.9ు పురుషులు ఊబకాయులుగా ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయులు ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది.
2035కి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 330 కోట్ల మంది ఊబకాయ బాధితులు ఉంటారని అంచనా. వీరిలో 77 కోట్ల మంది 5-19 ఏళ్ల మధ్య వారే ఉంటారు.
గతేడాది లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో పేర్కొన్న ప్రకారం.. 2022 నాటికి భారత్లో 1.25 కోట్ల మంది 5 నుంచి 19 ఏళ్ల మధ్య బాలలు అధిక బరువు ఉన్నారు.
2030 కల్లా ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయ బాధిత పిల్లల్లోని ప్రతి 10 మందిలో ఒకరు భారత్లో ఉంటారని యూనిసెఫ్ ఒబేసిటి అట్లాస్-22 పేర్కొంది. ఆ సమయానికి భారత్లో 2.7 కోట్ల మందికి మించి ఊబకాయ పిల్లలు ఉంటారని అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి..
Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు
Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్లో హిందీ నేమ్ బోర్డుకు తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 25 , 2025 | 04:12 AM