PM Modi: ఆసియా సింహాలు పెరిగాయ్
ABN, Publish Date - Mar 04 , 2025 | 05:42 AM
మూడు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత రాష్ట్రం గుజరాత్లో ఉన్న ప్రధాని మోదీ.. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు.
సింహాల సంరక్షణలో స్థానిక గిరిజనులు, మహిళల పాత్ర భేష్: మోదీ
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని
గిర్ అడవుల్లో ప్రధాని లయన్ సఫారీ
సాసన్ (గుజరాత్), మార్చి 3: గిర్ అభయారణ్యంలో ఆసియా సింహాల ఆవాసాలను కాపాడేందుకు స్థానిక గిరిజనులు, మహిళలు చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వారందరి కృషి వల్ల ఆసియా సింహాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత రాష్ట్రం గుజరాత్లో ఉన్న ప్రధాని మోదీ.. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా లయన్ సఫారీ చేశారు. అక్కడ కనిపించిన సింహాలను కెమెరాలో బంధించారు. అనంతరం వాటిని ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘ఈ రోజు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం. ఈ సందర్భంగా ఆసియా సింహాల ఆవాసానికి నిలయమైన గిర్ అటవీ ప్రాంతానికి వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న చర్యలకు సంబంధించి అనేక జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి.
కొన్నేళ్లుగా ఇక్కడ చేస్తున్న సమష్టి కృషి వల్ల ఆసియా సింహాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సింహాల ఆవాసాలను కాపాడడంలో గిరిజన సంఘాలు, స్థానిక మహిళల పాత్ర ప్రశంసనీయం’ అని మోదీ ఎక్స్లో ట్వీట్ చేశారు. గత పదేళ్లలో పులులు, చిరుతలు, ఖడ్గమృగాల సంఖ్య కూడా పెరిగిందని అన్నారు. వన్యప్రాణులను మనం ఎంతగానో ప్రేమిస్తున్నామని, జంతువులకు సుస్థిర ఆవాసాలను నిర్మించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ వెంట కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, ఇతర మంత్రులు, అటవీశాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. అనంతరం గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రధాన కార్యాలయమైన సాసన్ గిర్లో జరిగిన జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశానికి ప్రధాని హాజరయ్యారు. కాగా.. ఆసియా సింహాల పరిరక్షణకు ఉద్దేశించిన లయన్ ప్రాజెక్టు కోసం రూ.2,900 కోట్లకు ఆమోదం లభించిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇవి కూడా చదవండి
MK Stalin: కొత్త దంపతులు వెంటనే పిల్లల్ని కనండి
Mamata Banerjee: డూప్లికేట్ ఎపిక్ నంబర్లు ఉంటే.. నకిలీ ఓటర్లు ఉన్నట్లు కాదు!
Raksha Khadse: కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 04 , 2025 | 05:42 AM