Republic Day : కర్తవ్యపథ్లో సైనిక సత్తా
ABN, Publish Date - Jan 27 , 2025 | 05:11 AM
భారత 76వ గణతంత్ర వేడుకలు మన సైనిక సత్తాకు వేదికగా నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్లో ఆదివారం నిర్వహించిన ఈ వేడుకలు త్రివిధ దళాల శక్తిసామర్థ్యాలను చాటిచెప్పాయి. ఎలైట్ బృందాల కవాతులు, క్షిపణులు, స్వదేశీ ఆయుధ వ్యవస్థలతో సహా సైనిక
గణతంత్ర పరేడ్లో త్రివిధ దళాల విన్యాసాలు.. సాయుధ పాటవానికి అద్దం
ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో
రాష్ట్రపతి ముర్ముతో కలిసి బగ్గీలో ప్రాంగణానికి రాక
రంగుల తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని మోదీ
శకటాల నుంచి విన్యాసాల వరకూ నారీ భేరి
వేడుకలకు 10వేల మందికి పైగా అతిథులు
న్యూఢిల్లీ, జనవరి 26: భారత 76వ గణతంత్ర వేడుకలు మన సైనిక సత్తాకు వేదికగా నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్లో ఆదివారం నిర్వహించిన ఈ వేడుకలు త్రివిధ దళాల శక్తిసామర్థ్యాలను చాటిచెప్పాయి. ఎలైట్ బృందాల కవాతులు, క్షిపణులు, స్వదేశీ ఆయుధ వ్యవస్థలతో సహా సైనిక శక్తిని ఘనంగా ప్రదర్శించాయి. దేశ ఘన సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుంబియాటో సైనిక విన్యాసాలను ఆసాంతం ఆసక్తిగా తిలకించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలసి ఆయన సంప్రదాయ గుర్రపు బగ్గీలో వేడుకలకు రావడం ఆకట్టుకుంది. ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్నాథ్, పలువురు కేంద్ర మంత్రులు, దేశ అత్యున్నత సైనికాధికారులు, విదేశీ దౌత్యవేత్తలు, సీనియర్ అధికారులు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా నారీ శక్తి
గణతంత్ర వేడుకల్లో మహిళా బృందాల పరేడ్, మహిళ, శిశు అభివృద్ధికి సంబంధించిన శకటాల ప్రదర్శనతో కర్తవ్యపథ్లో నారీశక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అసిస్టెంట్ కమాండెంట్ ఎం.ఐశ్వర్య జాయ్ నేతృత్వంలో 148 మందితో కూడిన సీఆర్పీఎఫ్ మహిళా బృందం, సీనియర్ అధికారిణి ఏక్తా కుమారి నేతృత్వంలోని ఎన్సీసీ బాలికల బృందం, మదేశ్ అశోక్, అంకితా కుమారి నేతృత్వంలోని ఎన్సీసీ సంయుక్త బ్యాండ్ బృందం పరేడ్లో పాల్గొన్నాయి. అలాగే, ఢిల్లీ పోలీసుకు చెందిన మహిళా బృందం వరుసగా రెండో ఏడాది బ్యాండ్ మాస్టర్ రుయంగునో కెన్సే నేతృత్వంలో బ్యాండ్ ప్రదర్శన నిర్వహించింది. ఆర్మీ, నావికాదళ, వైమానిక దళ మహిళా దళాల కవాతులకు సీనియర్ మహిళా అధికారిణులు లెఫ్టినెంట్ రవీందర్జీత్ రంధ్వా, లెఫ్టినెంట్ కమాండర్ మణి అగర్వాల్, ఫ్లైట్ లెఫ్టినెంట్ రుచి సహా నేతృత్వం వహించారు. అలాగే, డీఆర్డీవో బృందం కవాతుకు శాస్త్రవేత్త సునీతా జెనా నేతృత్వం వహించారు. ‘మాతృత్వం, జీవిత చక్రం నిరంతర విధానం, మహిళల నేతృత్వంలో అభివృద్ధి’ అనే థీమ్తో మహిళా శిశు అభివృద్ధి శాఖ శకటాన్ని ప్రదర్శించింది. కవాతులో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలు సందడి చేయగా, వాటిలో మహిళా సాధికారతను ప్రతిబింబించేవి 26 ఉన్నాయి. సుమారు 15 మంది మహిళా పైలట్ల బృందం ప్లైఫా్స్టలో ప్రతిభను ప్రదర్శించింది.
అబ్బుర పర్చిన డేర్ డెవిల్స్ విన్యాసాలు
మోటార్ సైకిళ్లతో సైనికుల బృందం నిర్వహించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. ‘డేర్ డెవిల్స్’గా పేరొందిన ఆర్మీ సైనికులు మోటార్ సైకిళ్లపై అసాధారణ నైపుణ్యాలు ప్రదర్శించింది. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా కెప్టెన్ డింపుల్ సింగ్ భాటి.. అందరి దృష్టినీ ఆకర్షించారు. కదులుతున్న మోటార్సైకిల్పై అమర్చిన 12 అడుగుల నిచ్చెనపై నుంచి ఆమె రాష్ట్రపతి ముర్ముకు గౌరవ వందనం సమర్పించారు. తద్వారా ఆర్మీలో ఈ ఘనత సాధించిన తొలి మహిళా అధికారిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
ఇండోనేసియా దళం బ్యాండ్
ఇండేనేసియా కవాతు దళం, బ్యాండ్ దళం ఈసారి తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నాయి. ఇండోనేసియా మిలటరీ దళాలు విదేశీ గడ్డపై కవాతు, బ్యాండ్ ప్రదర్శన నిర్వహించడం కూడా ఇదే తొలిసారి. ఇండోనేసియా త్రివిధ దళాలకు చెందిన 152 మంది కవాతులో పాల్గొనగా, మరో 190 మంది బ్యాండ్ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రతి నెలా చివరి ఆదివారాలలో నిర్వహిస్తున్న మన్ కీ బాత్ (రేడియో) కార్యక్రమాల్లో పాల్గొన్న సుమారు 400 మందిని గణతంత్ర వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించారు.
5వేల మంది కళాకారులు..
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 5వేల మందికిపైగా జానపద, గిరిజన కళాకారులు.. 45 నృత్య రూపాలను ప్రదర్శించారు. సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ‘జయతి జయ మామా భారతం’ పేరుతో 11 నిమిషాలపాటు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన అలరించింది. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని దేశంలోని గిరిజన, జానపద రూపాల గొప్పదనం, వారసత్వాన్ని కొనసాగించేలా ప్రదర్శించిన నృత్య రీతులు విశేషంగా ఆకట్టుకున్నాయి. గణతంత్ర వేడుకలకు గ్రామ సర్పంచ్లు, విపత్తు సహాయక కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పారాలింపిక్ అథ్లెట్లు సహా సుమారు 10వేల మంది ప్రత్యేక అతిథులు వేడుకలకు హాజరయ్యారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ కింద పునరుత్పాదక శక్తిని వినియోగించే రైతులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
‘ప్రళయ్’ ప్రదర్శన
స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో తయారు చేసిన ప్రళయ్ క్షిపణిని తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించారు. ఇది ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి. దీని పరిధి 150 నుంచి 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 500 నుంచి వెయ్యి కిలోల బరువులను మోసుకెళ్లగలదు. ఇది అణ్వాయుధాలనూ తీసుకెళ్లగలదు. అలాగే, డీఆర్డీవో రూపొందించిన క్షిపణులను పరేడ్లో ప్రదర్శించారు.
ఆకట్టుకున్న శకటాలు
బలమైన, సురక్షితమైన భారత్ థీమ్తో త్రివిధ దళాలకు చెందిన శకటం సాయుధ దళాల మధ్య విస్తృత సమైక్యతా స్ఫూర్తిని ప్రతిబింబించింది. అధునాతన ఆయుధ వ్యవస్థలతో దేశీయంగా రూపొందించిన అర్జున్ యుద్ధ ట్యాంకు, తేజస్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లతో భూమి, నీరు, ఆకాశంలో ఏకకాలంలో యుద్ధం చేయగలిగిన ఉమ్మడి సైనిక సామర్థ్యాలను ప్రదర్శించింది. నలుగురు అధికారులు, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్షీర్ నమూనాలతో భారత సముద్ర ప్రయోజనాలను పరిరక్షించగల బలమైన ఆత్మనిర్భర్ నావికా దళానికి ప్రతీకగా ఇండియన్ నేవీకి చెందిన శకటం నిలిచింది. నలుగురు అధికారులు, 144 మంది సిబ్బందితో కూడిన ఐఏఎఫ్ బృందం తొలుత మూడు మిగ్-29 ఎయిర్క్రా్ఫ్టలతో ఫ్లై-పాస్ట్ నిర్వహించింది. బీఎ్సఎ్ఫకు చెందిన ఒంటె దళం కవాతు ఆకర్షణగా నిలిచింది. డేర్ డెవిల్స్గా ప్రసిద్ధి పొందిన కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ చేసిన మోటార్ సైకిల్ విన్యానాలు కళ్లు తిప్పుకోనివ్వలేదు. చివరిగా వాయుసేనకు చెందిన రాఫేల్, సుఖోయ్, జాగ్వార్, డోర్నియర్ తదితర 22 యుద్ధ విమానాలు, 11 రవాణా విమానాలు, 7 అపాచీ, ఎంఐ-17 హెలికాప్టర్లు చేసిన ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో వేడుకలు ఘనంగా ముగిశాయి.
మోదీ తలపాగా ప్రత్యేక ఆకర్షణ
గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ పసుపు, ఎరుపు వర్ణాలతో కూడిన తలపాగా ‘సఫా’ను ధరించారు. ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకల్లో వివిధ ప్రాంతాలకు చెందిన తలపాగాలను ధరించడం ద్వారా అక్కడి సంస్కృతిని మోదీ ప్రతిబింబింపజేస్తున్నారు. గతేడాది గణతంత్ర వేడుకల్లో రాజస్థానీలు ధరించే బహుళ రంగుల తలపాగాను ఆయన ధరించారు. కాగా, కర్తవ్యపథ్లో చెత్తను ఏరడం ద్వారా ‘స్వచ్ఛభారత్’ ప్రాముఖ్యతను ప్రధాని మోదీ గణతంత్ర వేడుకల్లో చాటిచెప్పారు.
కర్తవ్యపథ్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇండోనేసియా అధ్యక్షుడు సుబియాంటో, ప్రధాని మోదీ
ఇవి కూడా చదవండి:
Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
Republic Day 2025: గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్..
Read More National News and Latest Telugu News
Updated Date - Jan 27 , 2025 | 05:16 AM