Kumbh Mela: ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైలు!
ABN, Publish Date - Jan 18 , 2025 | 05:25 AM
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొనే భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రత్యేక రైలును నడుపుతోంది.
8 రోజుల యాత్రకు ప్రత్యేక ప్యాకేజీ
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొనే భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రత్యేక రైలును నడుపుతోంది. ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు 22న తిరిగి నగరానికి చేరుతుంది. వారంరోజుల పాటు జరిగే ఈ మహాకుంభ పుణ్యక్షేత్ర యాత్ర ప్రత్యేక రైలుకు ఐఆర్సీటీసీ ప్యాకేజీని ప్రకటించింది. భక్తులు వరాణసీ, అయోధ్య, ప్రయాగ్రాజ్లను దర్శించుకుని ఎనిమిది రోజుల్లో తిరిగి చేరుకునేందుకు వీలుగా ఈ ప్యాకేజీని రూపొందించింది. మొత్తం 578 మంది సామరఽ్ధ్యంతో కూడిన ఈ రైలు ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి 18న ప్రయాగ్రాజ్కు చేరుతుంది. కుంభమేళాలో భక్తులు పాల్గొంటారు. 19న వారాణసీలో కాశీవిశ్వనాఽథ్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలను దర్శించుకుని, ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుని 20న అయోధ్య చేరుకుంటారు. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హిని సందర్శించిన అనంతరం తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. 22 రాత్రికి సికింద్రాబాద్ చేరుకుంటుంది. యాత్రికులు ఎక్కి, దిగేందుకు ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, చత్రపూర్, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలసూర్ స్టేషన్లలో ఆగుతుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు. యాత్ర ప్యాకేజీలో ఎకానమీ (ఎస్ఎల్) పెద్దలకు రూ.23,035, పిల్లలకు (5-11 ఏళ్లలోపు) రూ.22,140లుగా చార్జీలు ఖరారు చేశారు. ఏసీ బోగీల చార్జీలు వేరుగా ఉంటాయి.
Updated Date - Jan 18 , 2025 | 05:25 AM