Uttarakhand : నడిరోడ్డుపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కాల్పులు
ABN, Publish Date - Jan 28 , 2025 | 06:12 AM
ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఓ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే పట్టపగలే తుపాకీలతో కాల్పులు జరుపుకోవడం సంచలనం కలిగించింది. ఖాన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉమేష్ కుమార్
రూర్కీ, జనవరి 27: ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఓ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే పట్టపగలే తుపాకీలతో కాల్పులు జరుపుకోవడం సంచలనం కలిగించింది. ఖాన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ (ఇండిపెండెంట్), మాజీ ఎమ్మెల్యే లస్కర్ కన్వర్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్ (బీజేపీ)ల మధ్య ఈ కాల్పులు జరిగాయి. ఆదివారం గ్యాంగ్వార్లా తలపించిన ఈ ఘటన వీడియోలు వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్య 2022 నుంచి తీవ్రమైన వైరం నెలకొంది. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో వారు చేసుకున్న కామెంట్లు వివాదాన్ని రాజేసింది. తనను దూషించారన్న కారణంతో మాజీ ఎమ్మెల్యే ఛాంపియన్, ఆయన అనుచరులు ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ నివాసం వద్దకు వెళ్లి అక్కడివారితో ఘర్షణకు దిగారు. రాళ్లు విసరడంతోపాటు కాల్పులు జరిపారు. విషయం తెలుసుకొని ఎమ్మెల్యే కుమార్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి 300 మీటర్ల దూరంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లి రాళ్లు విసరడంతో పాటు కాల్పులు జరిపారు. తుపాకీ పట్టుకొని వచ్చిన ఎమ్మెల్యేను పోలీసులు బలవంతంగా నిలువరించారు. సుమోటోగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఇద్దరు నాయకులను అరెస్టు చేశారు. సోమవారం వారిని కోర్టులో హాజరు పరచగా ఎమ్మెల్యేకు బెయిల్ లభించింది. మాజీ ఎమ్మెల్యేను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది.
Updated Date - Jan 28 , 2025 | 06:12 AM