ఐటీలో నియామకాలు పెరుగుతున్నాయ్
ABN, Publish Date - Feb 04 , 2025 | 06:17 AM
ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో మళ్లీ నియామకాలు ఊపందుకున్నాయని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) డైరెక్టర్ కవిత తెలిపారు. సోమవారం నాడిక్కడ హైదరాబాద్ సాఫ్ట్వేర్...
కీలకంగా మారుతున్న జీసీసీలు.. ఎస్టీపీఐ డైరెక్టర్ కవిత
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో మళ్లీ నియామకాలు ఊపందుకున్నాయని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) డైరెక్టర్ కవిత తెలిపారు. సోమవారం నాడిక్కడ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ సర్వీసులు సహా అన్ని విభాగాల్లో రిక్రూట్మెంట్స్ తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయన్నారు. గతంలో కొంత స్తబ్దత నెలకొన్నప్పటికీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రధానంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (జీసీసీ)లో పెద్దఎత్తున ఏర్పాటు అవుతుండటంతో పాటు ఉద్యోగాల కల్పన కూడా అదే స్థాయిలో ఉంటోందని తెలిపారు. హైదరాబాద్లో దాదాపు 110 జీసీసీలు ఉండగా నియామకాల్లో వాటి వాటా 25 శాతం వరకు ఉందన్నారు. కాగా గడచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 16.8 శాతంగా ఉందని కవిత తెలిపారు. ఇందులో జీసీసీల వాటానే 38 శాతం వరకు ఉందని ఆమె పేర్కొన్నారు. కొత్త జీసీసీలు పెద్దఎత్తున ఏర్పాటు కానుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ వాటా మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆమె చెప్పారు.
11న హైసియా జాతీయ సమ్మిట్: ఈ నెల 11న హైదరాబాద్లో 32వ హైసియా జాతీయ సదస్సు, అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హైసియా ప్రెసిడెంట్ ప్రశాంత్ నందెళ్ల తెలిపారు. ఏఐ అండ్ బియాండ్: రీడిఫైనింగ్ ది ఫ్యూచర్ పేరుతో ఈ సమ్మిట్ను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. సదస్సులో భాగంగా లైఫ్ సైన్సెస్, సస్టేనబల్ సిస్టమ్స్, గ్రీన్ సాఫ్ట్వేర్, సిటీ సర్వీసులు, ఈ-గవర్నెన్స్ విభాగాల్లో ఏఐ ద్వారా వస్తున్న మార్పులపై విస్తృత స్థాయిలో చర్చాగోష్ఠిని నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Feb 04 , 2025 | 06:17 AM